ETV Bharat / bharat

Sunitha Petition In SC: అవినాష్‌ మధ్యంతర బెయిల్​పై సుప్రీంకోర్టుకు సునీత.. రేపు విచారణ

author img

By

Published : Apr 20, 2023, 11:07 AM IST

Updated : Apr 20, 2023, 12:22 PM IST

ys viveka
ys viveka

11:04 April 20

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సునీత పిటిషన్‌

Sunitha Petition In SC: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్​ రెడ్డి, వైఎస్​ భాస్కర్​రెడ్డి, గజ్జల ఉదయ్​కుమార్​ రెడ్డిలను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అవినాష్​రెడ్డిని ఈనెల 25వరకు అరెస్ట్​ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ క్రమంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. అవినాష్​ ముందస్తు బెయిల్​ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్​ చేస్తూ సునీత పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు సునీత తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సునీత పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తెలిపింది.

వివేకా హత్య కేసులో అవినాష్​ రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సునీత సుప్రీంలో సవాలు చేశారు. ‘‘25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాష్​ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాష్​ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి’’ అని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించడంతో ఆసక్తి రేపుతోంది. సునీత పిటిషన్​ను విచారించి.. ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

రెండో రోజు నిందితులను విచారిస్తున్న సీబీఐ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వారిద్దరినీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇది వరకే ఆదేశించింది. వారిద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇదే కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ఎంపీ నుంచి ఏయే విషయాలు రాబట్టాలన్న దానిపై సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని రూపొందించుకున్నారు. బుధవారం కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఇవాళ వాటికి కొనసాగింపుగా మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశముంది. దిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తోంది. వెన్నెముక సమస్య కారణంగా భాస్కరరెడ్డి ఎక్కువ దూరం నడవలేకపోతుండటంతో సీబీఐ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఈ ముగ్గుర్నీ వేర్వేరుగా అధికారులు విచారించారు. హత్య ఉదంతాన్ని నేరుగా ప్రస్తావించకుండా మొదటిరోజు పూర్తిగా వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీయడంపైనే అధికారులు ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ ప్రశ్నలు సంధించే అవకాశముంది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 20, 2023, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.