ETV Bharat / bharat

ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మ.. 3గంటల తర్వాత 'టెన్త్ ఎగ్జామ్'​ రాసిన బాలింత

author img

By

Published : Feb 19, 2023, 7:42 AM IST

woman writes class 10 board exam
పదో తరగతి పరీక్షలు రాసిన గర్భిణీ

మరో మూడు గంటల్లో పదో తరగతి సైన్స్​ పరీక్ష ఉందనగా.. ఆమె ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పరీక్ష కచ్చితంగానే రాయాల్సిందేనని పట్టుబట్టింది. చివరకు అనుకున్నదే తడవుగా ఎగ్జామ్​ హాల్​కు వెళ్లి పరీక్ష రాసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

సంకల్పం గట్టిగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా అనుకున్నది సాధించవచ్చు. ఇదే విషయాన్ని నిరూపించారు బిహార్​కు చెందిన ఓ మహిళ. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ విషయం.. చుటు పక్క ప్రాంతాల్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..
బంకా జిల్లాకు చెందిన రుక్మిణీ కుమారి(22).. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిండు గర్భిణీ అయిన ఆమె.. ఎలాగైనా పది పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. అయితే ఫిబ్రవరి 14న ఆమె మొదటి పరీక్ష రాసింది. అదే రోజు సాయంత్రం ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే రుక్మిణీని స్థానిక ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.

ఆ తర్వాత రోజు ఉదయం ఆరు గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో కూడా ఆమకు పరీక్ష విషయం గుర్తుకు వచ్చింది. మరో మూడు గంటల్లో జరగనున్న సైన్స్​ పరీక్షను ఎలాగైనా రాయాలని ఫిక్స్​ అయింది. కానీ కుటుంబసభ్యులు, వైద్యులు మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఆమె మాత్రం ఎగ్జామ్​ రాయడానికి మొగ్గుచూపింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఒక అంబులెన్స్​ ఏర్పాటు చేసింది. ఎగ్జామ్​ హాల్​కు అందులో ఆమెను తీసుకెళ్లింది. రుక్మణికి తోడుగా వైద్య సిబ్బందిని కూడా పంపింది. మొత్తానికి ఆమె విజయవంతంగా పరీక్ష పూర్తి చేసింది.

"పరీక్షల ప్రారంభమైన మొదటి రోజు నుంచే కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఫిబ్రవరి 14న గణితం పరీక్ష పూర్తి చేశాను. మరుసటిరోజు ఉదయం జరగబోయే సైన్స్ పరీక్ష గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఈ లోపే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా కుమారుడు పెద్దయ్యాక బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను నా బిడ్డకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నా. పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు వస్తాయి."

--రుక్మిణి, పరీక్ష రాసిన యువతి

'బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పరీక్షకు వెళ్లొద్దని, అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మేం చెప్పిచూశాం. కానీ ఆమె వెళ్లడానికే నిర్ణయించుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు' అని ఆమె చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.