ఖలిస్థానీ నేతపై ఉక్కుపాదం.. పోలీసుల భారీ ఆపరేషన్.. పరారీలో అమృత్​పాల్​

author img

By

Published : Mar 18, 2023, 3:45 PM IST

Updated : Mar 18, 2023, 9:57 PM IST

Amritpal arrested

ఖలిస్థానీ అనుకూల 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ సింగ్​ కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 78 మంది అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సైతం అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని పోలీసులు ధ్రువీకరించలేదు. అమృత్​పాల్ పరారీలోనే ఉన్నాడని పేర్కొన్నారు.

ఖలిస్థానీ అనుకూల 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ సింగ్​పై ఉక్కుపాదం మోపేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధమయ్యారు. అతడిని అరెస్టు చేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అమృత్​పాల్ పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అమృత్​పాల్​ను అనుసరిస్తున్న 78 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచారణ నిమిత్తం మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారనే సమాచారంతో అమృత్​పాల్ పారిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 100 వాహనాలతో పోలీసులు అతడిని వెంబడించినట్లు సమాచారం. చివరకు జలంధర్​లోని నాకోదార్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు మాత్రం అతడు పరారీలోనే ఉన్నాడని తెలిపారు. అతడి అనుచరులు నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పక్కా ప్లాన్​తో అరెస్ట్​
బఠిండా జిల్లాలోని జలంధర్​-మొగా జాతీయ రహాదారిపై అమృత్​పాల్​ కార్యక్రమం నిర్వహిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసేందుకు జలంధర్, మొగా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్​ను చేపట్టారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. శనివారం జలంధర్​ దాటగానే.. పోలీసులు అతడి కాన్వాయ్​ను అడ్డకున్నారు. దీనిని గమనించిన అమృత్​పాల్ డ్రైవర్​ లింక్​రోడ్​కు మళ్లించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి కాన్వాయ్​ను పోలీసులు వెంబడించారు. అతడిని పట్టుకునేందుకు సుమారు 8 జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు.

మరోవైపు, పంజాబ్​లోని పలు జిల్లాలో ఆదివారం వరకు ఇంటర్నెట్​ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలు ఎలాంటి హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా ఉండాలని పంజాబ్​ పోలీసులు కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్​ న్యూస్​ ప్రచారం చేయవద్దంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, పోలీసులు మమల్ని వెంటాడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు 'వారీస్​ పంజాబ్​ దే' సంస్థ చీఫ్​ అమృత్​పాల్ సింగ్. అతడు కూర్చుని ఉండగా.. అతడి మద్దతుదారులు వీడియో తీశారు.

గతనెలలో 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించి.. తమ మద్దతుదారుడిని విడుదల చేయించుకున్నారు. అమృత్​పాల్​ పిలుపుతో.. వేలాది మంది అనుచరులు తల్వార్లు, తుపాకులతో అజ్నాలా పోలీస్​ స్టేషన్​ను ముట్టడించారు. అమృత్​పాల్ సింగ్​ సన్నిహితుడు లవ్​ప్రీత్​ తుఫాన్​ అరెస్టుకు నిరసనగా వారంతా ఇలా ఆందోళన చేపట్టారు. ఈ తరుణంలోనే ఆయుధాలతో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్​కు చేరుకున్న మద్దతుదారులు తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్​లోకి చొచ్చుకెళ్లారు. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిరసనకారుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరి ఆందోళనలకు తలొగ్గిన పోలీసులు.. లవ్​ప్రీత్ తుఫాన్​ను విడుదల చేశారు. అయితే, పంజాబ్​ పోలీసులు మాత్రం.. తమకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లవ్​ప్రీత్​ను విడుదల చేశామని అమృత్​సర్ ఎస్ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.

వివాదాల అమృత్!
'వారీస్ పంజాబ్ దే'ను ఖలిస్థాన్ అనుకూల సంస్థగా చెబుతుంటారు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్​పాల్ సింగ్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. దొంగతనం, కిడ్నాప్, హింసకు పాల్పడటం వంటి కేసులు అతడిపై నమోదయ్యాయి.

ఇవీ చదవండి : రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్​ కార్యకర్తలు.. ఫ్లెక్సీ వివాదమే కారణం

ఘనంగా బావి-తోట పెళ్లి.. 1500 మంది అతిథులు.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం!

Last Updated :Mar 18, 2023, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.