ETV Bharat / bharat

Volunteer Cheating with Rubber Fingerprint: వాలంటీర్​ నిర్వాకం.. బెంగళూరులో ఉంటూ.. ఊర్లో పింఛన్లు పంపిణీ.. ఇదెలా..!

author img

By

Published : Aug 2, 2023, 3:10 PM IST

Updated : Aug 2, 2023, 5:35 PM IST

volunteers
volunteers

Volunteer Cheating in Prakasam: వాలంటీర్ల దారుణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఎక్కడో ఓ చోట హత్య, వేధింపులకు పాల్పడుతున్న వాలంటీర్ల గురించి వస్తున్న వార్తలను చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చెబుతున్న వాలంటీర్ వ్యవహారం మాత్రం అంతకుమించి. కనికట్టు, మాయ, మోసం.. ఇలా ఎన్ని చెప్పుకున్నా ఇతగాడి లీలలు జగన్నాటకాన్ని తలపిస్తాయి. ఒక్క ముక్క చెప్పాలంటే తెలుగు భాష లెక్క.. ఆడ ఉంటా.. ఈడ ఉంటా అన్నట్లుగా ఉంటుంది.. ఈ వాలంటీర్ వ్యవహారం. అదెలా అని అంటారా.. మీరే చూడండి..

వాలంటీర్​ నిర్వాకం.. బెంగళూరులో ఉంటూ.. ఊర్లో పింఛన్లు పంపిణీ.. ఇదెలా..!

Volunteer Cheating in Prakasam: ఆంధ్రప్రదేశ్​లో వాలంటీర్ల వ్యవస్థ గురించి సీఎం జగన్ మోహన్​ రెడ్డి​ గొప్పలు చెబుతారు. ప్రతి నెలా అవ్వ, తాతల ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తారని ఆర్భాటంగా ప్రగల్భాలు పలుకుతారు. వాలంటీర్లు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులని.. సంక్షేమ సారథులని వారి గురించి గొప్పలకు పోతారు. సూర్యోదయం కాకముందే.. ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తారని ఓ రేంజ్​లో పైకెత్తుతారు. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పింఛన్ తీసుకోవాలంటే వాలంటీర్ ఇంటికి వెళ్లి.. ఇంటి ముందు పడిగాపులు కాయక తప్పదు.

ఒకవేళ ఆ వాలంటీర్ గ్రామంలో లేకుండా వేరే దగ్గర ఉన్నప్పటికీ.. అవ్వ తాతలకు పింఛన్​లు ఇస్తుంటారు. అదేంటి వాలంటీర్లు ఇంటిలో లేకపోతే పింఛన్​ ఇవ్వడం ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. వారికి అది సాధ్యమే. అలాంటి ఓ వాలంటీర్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఉండేది బెంగుళూరులో.. కానీ బయోమెట్రిక్‌తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు. అదెలాగో తెలిస్తే.. మీరు కూడా ఈ వాలంటీర్ పనితనాన్ని మెచ్చుకోకమానరు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ప్రకాశం జిల్లా వెళ్లాల్సిందే.

ప్రకాశం జిల్లా పామూరు మండలం కట్టకిందపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని కందులవారిపల్లిలో గురుప్రసాద్​ అనే వ్యక్తి వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. నిజానికి అతను ఉండేది బెంగుళూరులో.. కానీ ఇక్కడ గ్రామంలో వితంతు, వృద్ధాప్య పింఛన్​ పంపిణీ వంటి కార్యకలాపాలు మాత్రం యథావిధిగా సాగుతూనే ఉంటాయి. మరి పింఛన్​ ఇవ్వడానికి వేలిముద్రలు ఎక్కడి నుంచి వస్తాయని మీకు డౌట్​ వచ్చిందా.. అక్కడికే వస్తున్నా..

గురుప్రసాద్​కు టెక్నాలజీ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో వేలిముద్రలతో కూడిన ఓ కృత్రిమ రబ్బరు వేలును తయారు చేశాడు. దానిని తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి బెంగుళూరులో దర్జాగా ఉంటున్నాడు. వాళ్లు ఆ రబ్బరు వేలిముద్ర సాయంతో.. పింఛన్లు ఇస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది. అయితే ఇదేమిటని ప్రశ్నించిన అవ్వతాతలకు ఆ నెలలో పింఛన్ నిలిపివేస్తున్నారు. ఈ నెలలో కూడా కొందరికి అలా పింఛన్‌ నిలిపివేయగా.. ఈ రబ్బర్ వేలు తతంగం వెలుగులోకి వచ్చింది. పింఛన్‌దారులు స్థానిక సచివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. స్పందించిన సచివాలయ అడ్మిన్.. వాలంటీర్‌ లేకుండా పింఛన్ల పంపిణీ జరగడం నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

"వాలంటీర్​ ఊర్లో లేడని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దానిపై విచారిస్తే అతడు ఇక్కడ లేడని.. బెంగుళూరులో ఉన్నాడని తెలిసింది. బెంగుళూరులో ఉంటూ.. ఇక్కడ రబ్బరు వేలిముద్రతో కుటుంబ సభ్యుల సాయంతో పింఛన్​ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం"-సచివాలయ అడ్మిన్​, కట్టకిందపల్లి

Last Updated :Aug 2, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.