ETV Bharat / bharat

మార్గదర్శి మేనేజర్లపై కఠిన చర్యలొద్దు.. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

author img

By

Published : Apr 5, 2023, 7:47 AM IST

Margadarsi : మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌పై.. నమోదు చేసిన కేసులో బ్రాంచ్ మేనేజర్లపై కఠిన చర్యలు వద్దని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కక్షసాధింపు ధోరణితో దర్యాప్తు కొనసాగుతోందని.. దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. సహకరిస్తున్నా అరెస్టు చేస్తున్నారన్న వాదనలు విన్న న్యాయస్థానం కఠిన చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ts high court
తెలంగాణ హైకోర్టు

Margadarsi Chit Fund: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీచేసిన మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మార్గదర్శిపై నమోదు చేసిన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ వెలుపల స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ సీహెచ్‌ శైలజ మంగళవారం ఉదయం అత్యవసరంగా మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాది విమల్‌ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ ‘‘ఈ కేసులో దర్యాప్తు కక్షసాధింపు చర్యతో కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి పిటిషనర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చిట్‌ఫండ్‌ సంస్థను మూసేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. దర్యాప్తు సమాచారాన్ని వారి అనుకూల మీడియాకు లీక్‌ చేస్తున్నారు. సోమవారం విచారణకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఛైర్మన్‌ ఫొటోను తీసి సాక్షి మీడియాకు పంపారు. 6న ఎండీ విచారణ ఉందంటూ ఫొటోతో పత్రికల్లో వేస్తున్నారు. విచారణలో వేసిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలు పత్రికలో వస్తున్నాయి.

సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు వివరాలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఓ వైపు విచారణకు సహకరిస్తున్నా 30 మంది మేనేజర్లకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు పేరుతో పిలిచి అరెస్టు చేస్తారని ఆందోళన ఉంది. దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. సమాచారం అందించడానికి వెళ్లిన ఆడిటర్‌ శ్రావణ్‌ను నిర్బంధించి, అనంతరం అరెస్టు చేశారు. ఆయన గొంతు, మెడపై గాయాలున్నాయి. శ్రావణ్‌ రిమాండ్‌ రిపోర్టులో బాత్రూంకు వెళ్లి తానే గాజుతో గాయపరచుకున్నారని, కింద పడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

పొద్దుపోయాక ఇంటికి వెళ్లాలని చెప్పినా శ్రావణ్‌ వెళ్లలేదంటూ చెబుతున్నారు. కానీ ఎవరూ పోలీసుస్టేషన్‌లో ఉండాలని కోరుకోరు’’ అని తెలిపారు. తమ తరఫు వాదనలు వినిపించడానికి ఏజీ వస్తారని, వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి కోరారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఛైర్మన్‌, ఎండీలకు ఉన్న రక్షణను వారి ఉద్యోగులకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. దర్యాప్తును నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వట్లేదని, కేవలం కఠిన చర్యలు తీసుకోరాదనే ఇస్తున్నామని చెప్పారు. 30 మందిని అరెస్టు చేయబోతున్నారా అని ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని ఏపీ న్యాయవాది తెలిపారు. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసే పరిధి హైకోర్టులకు లేదని, సుప్రీంకోర్టుకే ఉందని తెలిపారు. ఇదో పెద్ద కుంభకోణం అని, దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఏమీ తేలకపోతే అదే విషయాన్ని తుది నివేదికలో పేర్కొంటామని జీపీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.