ETV Bharat / bharat

పరువు హత్య కలకలం.. కుమారుడితో కలిసి కూతురిని హత్య చేసిన తండ్రి

author img

By

Published : Jan 12, 2023, 7:27 PM IST

Updated : Jan 12, 2023, 10:11 PM IST

ఓ వృద్ధ మహిళను ఆమె కొడుకు, కోడలు కొట్టి చంపారు. ఈ హృదయవిదారక ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు కొడుకుతో కలిసి కూతురిని చంపిన ఓ తండ్రి.. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు.ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ వెలుగు చూసింది.

son-beat-his-mother-to-death-along-with-his-wife-in-jharkhand
భార్యతో కలిసి తల్లిని దారుణంగా కొట్టి చంపిన కొడుకు

కొడుకుతో కలిసి కుమార్తెను చంపేశాడు ఓ తండ్రి. అనంతరం తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్ సంభాల్​లో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

జనవరి 10న ఐంచోడ కంబోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారాపుర్​ గ్రామానికి చెందిన షాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి తన కుమార్తె అస్రాబీ విషం తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు మొదటి నుంచీ ఆమె తండ్రిపై అనుమానం ఉంది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తరువాత వారి అనుమానం మరింత బలపడింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె విషం తాగి చనిపోయినట్లు లేదు. దీంతో తప్పుడు సమాచారం అందించిన యువతి తండ్రిని పోలీసులు తమదైన శైలిలో విచారించంగా అసలు విషయం బయటపడింది.

ఇదీ జరిగింది
షాహిద్ హుస్సేన్ కుమార్తె అస్రాబీ గత ఆరేడు నెలలుగా పక్కింట్లో ఉన్న వేరే వర్గానికి చెందిన షాజాద్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది తెలిసిన తండ్రి ఆమెను మందలించాడు. అయితే యువతి మాత్రం తండ్రి మాటలు పట్టించుకోకుండా అతడిని రహస్యంగా కలుస్తూనే ఉండేది. ఎప్పటిలాగానే జనవరి 9న అస్రాబీ తన ప్రియుడు ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ యువతి మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ వ్యవహారం వల్ల గ్రామంలో తన పరువు పోయిందని భావించిన హుస్సేన్ తన కుమార్తెను చంపేందుకు కొడుకుతో కలిసి ప్లాన్ చేసి ఆమెను ఇంటికి పిలిచారు. జనవరి 10 రాత్రి కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్న సమయంలో హుస్సేన్, అతని కుమారుడు షానవాజ్ కలిసి అస్రాబీ నోటిపై దిండు పెట్టి.. ఆమె చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన ఆమె స్కార్ఫ్​ను ఇంట్లోనే దాచిపెట్టారు. హత్యకు ఉపయోగించిన చున్నీను స్వాధీనం చేసుకుని తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

వృద్ధురాలిని హత్య చేసి.. శ్మశానంలో పాతిపెట్టిన దుండగులు..
దిల్లీలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల ఓ వృద్ధురాలిని హత్య చేశారు ముగ్గురు దుండగులు. అనంతరం మృత దేహాన్ని నంగ్లోయ్‌ శ్మశానవాటికలో పాతి పెట్టారు. అందుకోసం శ్మశానవాటిక సంరక్షకునికి రూ.5000 నగదును కూడా ఇచ్చారు. ఈ ఘటనలో రెహాన్, మోబిన్ ఖాన్, నవీన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు రాత్రి సమయంలో శ్మశానంలో డెడ్​ బాడీని పాతి పెట్టేందుకు డబ్బులు తీసుకుని అనుమతిని ఇచ్చిన కాటికాపరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చనిపోయిన మహిళ పేరు మీనా అని, ఆమె ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుందని నిందితులు చెబుతున్నారు. బుధవారం శ్మశానవాటిక నుంచి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. జనవరి 2 నుంచి మీనా కనిపించట్లేదని మంగోల్​పురి పోలీస్​ స్టేషన్​లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మీనా కనిపించపోవడంలో మోబిన్ ప్రమేయం ఉందనే అనుమానాన్ని ఆమె కుటుంబీకులు వ్యక్తం చేశారు. ఈ సూచన మేరకు పోలీసులు మోబిన్​ను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారంచగా ఈ విషయం అంతా బయటపడింది.

భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుకు
ఝార్ఖండ్​ సరాయికేలలో హృదయ విదారక ఘటన జరిగింది. ఆదిత్యపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధ మహిళను ఆమె కొడుకు, కోడలు కొట్టి చంపారు. నిందితులను కెనరా బ్యాంక్​లో మేనేజర్​గా పనిచేస్తున్న ప్రీతమ్​కుమార్, అతని భార్య రేణుగా పోలీసులు గుర్తించారు. ప్రీతమ్, రేణు ఇద్దరూ బుధవారం కమలా దేవిని కొట్టి గాయపరిచారు. అనంతరం వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కమలాదేవి.. ఆస్పత్రి​లో చికిత్స పొందుతూ మరణించింది.

son-beat-his-mother-to-death-along-with-his-wife in jharkhand
నిందితులు

వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులిద్దరూ జంషెడ్​పుర్​లో తలదాచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసు బృందం జంషెడ్‌పూర్‌కు చేరుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు ఆదిత్యపుర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రాజన్ కుమార్ తెలిపారు. కమలాదేవి మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్టుమార్టం నివేదికలో మృతదేహంపై గాయాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Last Updated : Jan 12, 2023, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.