రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

author img

By

Published : Nov 12, 2022, 7:55 PM IST

Updated : Nov 12, 2022, 10:05 PM IST

rajiv gandhi murder accused released

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్ల నుంచి విడుదలయ్యారు. వీరిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీరంతా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆరుగురు నిందితుల్లో నళిని భర్త మురుగన్‌ సహా నలుగురు శ్రీలంక దేశస్థులుకాగా వీరిని తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా మిగిలిన దోషులు తమిళనాడు జైళ్ల నుంచి విడలయ్యారు. పెరోల్‌పై ఉన్న నళిని తాను శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళా కారాగారానికి వెళ్లి విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అక్కడ నుంచి వెంటనే వెల్లూరు కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. ఆ కారాగారం నుంచి విడుదలైన తన భర్త వి.శ్రీహరన్‌ అలియాస్‌ మురుగన్‌ను చూసి నళిని భావోద్వేగానికి గురయ్యారు.

శ్రీలంక దేశస్థులైన మురుగన్‌, సంథన్‌ను జైలు నుంచి విడుదల చేసి పోలీసు వాహనంలో తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు. మరో ఇద్దరు శ్రీలంక దేశస్థులు రాబర్ట్‌ పాయస్‌, జయకుమార్‌ను చెన్నైలోని పుజల్ జైలు నుంచి విడుదల చేసి వారిని కూడా తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు. ఈ నలుగురిని అక్కడ ఉంచనున్నారు. వీరిని అక్కడ నుంచి శ్రీలంకకు పంపడంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. నళిని చెన్నైలో ఉంటారా లేదా లండన్‌లో ఆమె కుమార్తె వద్దకు వెళ్తారా అనేది ఇంకా స్పష్టంకాలేదు.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నళిని శ్రీహరన్‌ సహా మొత్తం ఆరుగురు దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీరందరినీ విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతిని గుర్తుచేసింది. కారాగారంలో వీరందరి ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే కేసులో 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించిన పెరారివాలన్‌ విడుదలకు.. రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 18న ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం స్పష్టం చేసింది.

Last Updated :Nov 12, 2022, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.