ETV Bharat / bharat

'నుపుర్​' మాటలపై మంటలు.. ఇస్లామిక్ దేశాల భగ్గు

author img

By

Published : Jun 7, 2022, 4:15 AM IST

Updated : Jun 7, 2022, 6:44 AM IST

Nupur sharma: నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు భగ్గుమన్నాయి. భాజపా నేతల వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలిపిన ఖతార్‌, కువైట్‌, ఇరాన్‌లతో సౌదీఅరేబియా, బహ్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇండోనేసియా, మాల్దీవులు, జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఒమన్‌ దేశాలు గొంతు కలిపాయి. ఇస్లాం మత పవిత్రతను కించపరుస్తూ, ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడకుండా కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి సూచించాయి.

nupur sharma controversial statement on muhammad prophet
నుపుర్​ మాటలపై మంటలు.. ఇస్లామిక్ దేశాల భగ్గు

Islamic Countries Protest: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్నాయి. తమ మత విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని ఇస్లామిక్‌ దేశాలు మండిపడుతుండగా... తమకు అన్ని మతాలూ సమానమేనని, ఎవరినీ అవమానించడం లేదని భారత్‌ స్పష్టంచేసింది. భాజపా నేతల వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలిపిన ఖతార్‌, కువైట్‌, ఇరాన్‌లతో సౌదీఅరేబియా, బహ్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇండోనేసియా, మాల్దీవులు, జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఒమన్‌ దేశాలు గొంతు కలిపాయి. ఇస్లాం మత పవిత్రతను కించపరుస్తూ, ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడకుండా కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి సూచించాయి. 57 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) జనరల్‌ సెక్రెటేరియెట్‌ భారత్‌లో ముస్లింల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ సోమవారం ప్రకటన విడుదల చేశాయి. అన్ని వర్గాలను, విశ్వాసాలను గౌరవించాలని పేర్కొన్నాయి. వివాద కారకులపై భారతీయ జనతా పార్టీ తీసుకున్న చర్యలను స్వాగతించాయి. కువైట్‌ నగరంలోని అల్‌ అర్దియ కోఆపరేటివ్‌ సొసైటీకి చెందిన సూపర్‌ మార్కెట్‌ తన స్టోర్‌లోని భారతీయ ఉత్పత్తులను ఒక చోట పోగేసి ఆ వస్తువులను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. మహమ్మద్‌ ప్రవక్తను అవమానిస్తే ముస్లింలు సహించరని స్టోర్‌ సీఈవో నాసర్‌ అల్‌ ముతైరీ పేర్కొన్నారు. మక్కా, మదీనాల్లోని మసీదుల మత పెద్దలు కూడా వేర్వేరు ప్రకటనల్లో నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను ఖండించారు.

కువైట్​

భారత్‌ తీవ్ర అభ్యంతరం
ఓఐసీ ప్రకటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వ్యక్తుల ఆలోచనలను ఒక దేశ ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారంటూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రశ్నించింది. పాక్‌ ప్రకటనపైనా మండిపడింది. ‘కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి. అవి భారత ప్రభుత్వ అభిప్రాయాలు కానేకావు. ఆ వ్యక్తులపై సంబంధిత సంస్థ(భాజపా) ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఓఐసీ జనరల్‌ సెక్రెటేరియట్‌ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం విచారకరం. స్వార్థ ప్రయోజనాల వల్లే విభజనపూరిత అజెండాను ప్రదర్శిస్తున్నారని స్పష్టమవుతోంది. ఓఐసీ జనరల్‌ సెక్రెటేరియట్‌ మతపరమైన విధానాలను పక్కనబెట్టి, అన్ని విశ్వాసాలను గౌరవించాలని కోరుకుంటున్నాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పాక్‌పై ఎదురుదాడి
వివాదంపై పాకిస్థాన్‌ నిరసన వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భాజపా నేతల వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంది. దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఎన్నో ఏళ్ల నుంచి మైనారిటీ హక్కులను కాలరాస్తున్న దేశం.. మరో దేశంలోని మైనారిటీల వ్యవహారాలపై మాట్లాడటం అసంబద్ధంగా ఉందని అరిందమ్‌ బాగ్చి దుయ్యబట్టారు. భారత్‌లో అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని, పాకిస్థాన్‌లా మతోన్మాదులకు తాము స్మారకాలు కట్టడం లేదని దుయ్యబట్టారు. పాక్‌ ముందుగా.. తమ దేశంలోని పరిస్థితులపై దృష్టిసారించాలని హితవు పలికారు.

నుపుర్‌, నవీన్‌ను అరెస్టుచేయాలి: కాంగ్రెస్‌
అంతర్జాతీయ స్థాయిలో భారత పేరు ప్రతిష్ఠలను భాజపా నేతలు దిగజార్చుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని కోరింది. భాజపాలోని సంఘ వ్యతిరేక శక్తులు దేశాన్ని విద్వేష మంటల్లోకి నెట్టివేస్తున్నాయని ధ్వజమెత్తింది. కమలం పార్టీ తప్పిదాల కారణంగా దేశం క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు రావడం విచారకరమని కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, పి.చిదంబరం తదితరులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ నేతలపై విదేశాల ఒత్తిడి వల్లే భాజపా చర్యలు తీసుకుందని సీపీఎం, సీపీఐ పేర్కొన్నాయి. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ మాట్లాడిన వ్యక్తులను భాజపాతో సంబంధంలేని వ్యక్తులుగా ఎలా పేర్కొంటారని వామపక్ష అగ్ర నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా ప్రశ్నించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు డిమాండ్‌ చేశాయి.

ప్రాణాలకు ముప్పు: నుపుర్‌ శర్మ
భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హతమార్చుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లు 153ఎ, 506, 507, 509 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు దిల్లీలోని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, కొన్ని ముస్లిం దేశాలు నిరసన తెలిపిన నేపథ్యంలో భాజపా జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ, ఆ పార్టీ దిల్లీ మీడియా విభాగ అధినేత నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఆదివారం భాజపా నుంచి సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే.

ముంబయిలో కేసు నమోదు
నుపుర్‌ శర్మ టీవీలో చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదైనట్లు ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండే తెలిపారు. ఆమెను పిలిపించి వాంగ్మూలం నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దైవ దూషణపై చట్టం ఉండాలి: వీహెచ్‌పీ
మహ్మద్‌ ప్రవక్తపై భాజపాకు చెందిన ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో భారత్‌లో దైవదూషణకు వ్యతిరేకంగా కఠిన చట్టం ఉండాలని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పేర్కొంది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ను బహిష్కరించాలన్న పిలుపునూ సమర్థించింది. ఈ అంశంపై ఖతార్‌ ప్రభుత్వ వైఖరిని విమర్శించింది. ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం ‘వెలుగు చూసినప్పుడు’ ఒక వర్గం వారు దాన్ని ఫౌంటెయిన్‌గా అభివర్ణించారని పేర్కొంది. అది హిందువుల మనోభావాలను గాయపరిచిందని వ్యాఖ్యానించింది.

ఎవరీ నుపుర్‌ శర్మ?

నుపుర్ శర్మ

అంతర్జాతీయ సమాజానికి భారత్‌ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన నుపుర్‌ శర్మ(37) వృత్తిరీత్యా న్యాయవాది. దిల్లీ నివాసి అయిన ఆమె ..విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆరెస్సెస్‌ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ తరఫున దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా 2008లో ఎన్నికయ్యారు. దిల్లీలోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నుపుర్‌.. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద విద్యలో పట్టా పొందారు. ఆ తర్వాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. భాజపా యువజన విభాగంలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత భాజపా దిల్లీ విభాగ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భాజపాలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నుపుర్‌ శర్మను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా...పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. శ్రేణులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సంస్థాగతమైన పలు బాధ్యతలను భాజపా ఆమెకు అప్పగించింది. వాగ్ధాటి కలిగిన ఆమె టీవీ ఛానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాల్లో తన అభిప్రాయాలను గట్టిగా వినిపించేవారు. తాజా వివాదంతో భాజపా నుంచి సస్పెండయ్యారు.

ఇదీ చదవండి: 'మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టట్లేదు'... పాక్​పై భారత్ ఫైర్

Last Updated :Jun 7, 2022, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.