ఒమిక్రాన్​ భయాల వేళ.. 10 మంది విదేశీయులు మిస్సింగ్​!

author img

By

Published : Dec 3, 2021, 9:23 PM IST

travelers from South Africa

Omicron cases in India: ఒమిక్రాన్​ భయాల వేళ.. విదేశీ ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచాల్సిన తరుణం ఇది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు చేరుకున్న 10 మంది ప్రయాణికుల ఆచూకీ లేదని బాంబు పేల్చింది కర్ణాటక ప్రభుత్వం. వారిని ట్రేస్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. మరోవైపు.. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Omicron cases in India: దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ ఇప్పటికే ప్రవేశించింది. బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్​ నిర్ధరణ అయింది. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది బృహత్​ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ). ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి వచ్చిన సుమారు 10 మంది ప్రయాణికుల ఆచూకీ లేదని వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బీబీఎంపీ కమిషనర్​ గౌరవ్​ గుప్త తెలిపారు. 'ట్రాకింగ్​ అనేది నిరంతర ప్రక్రియ. దానిని మేం కొనసాగిస్తున్నాం. ఎవరైనా ఫోన్​ ద్వారా స్పందించకపోతే.. మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తాం.' అని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 57 మందిలో 10 మంది విదేశీయుల జాడ లభించలేదని తెలిపారు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్​ సుధాకర్​.

" దక్షిణాఫ్రికా నుంచి 57 మంది వచ్చారు. అందులో 10 మంది ఆచూకీని బీబీఎంపీ, ఆరోగ్య అధికారులు గుర్తించలేకపోయారు. వారంతా ఆఫ్రికా దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన వారు నవంబర్​ 12 నుంచి 22 మధ్య బెంగళూరుకు వచ్చారు. ఫోన్లు స్విచ్​ ఆఫ్​ వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ వారిని గుర్తించేపనిలో నిమగ్నమైంది. త్వరలోనే వారిని పట్టుకుంటాం. వారిని గుర్తించేందుకు పోలీస్​ విభాగాన్ని ఆశ్రయించారు అధికారులు. వైరస్​ బారిన పడిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు."

- డాక్టర్​ సుధాకర్​, కర్ణాటక ఆరోగ్య మంత్రి.

కర్ణాటకలో కొత్త మార్గదర్శకాలు

ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఆరోగ్య మంత్రి సుధాకర్​, ఐటీబీటీ మంత్రి అశ్వత్​నారాయణ్​, రెవెన్యూ మంత్రి అశోక్​ల సమావేశానంతరం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.

  • కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వస్తేనే విమానాశ్రయం నుంచి పంపిస్తారు
  • విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జనవరి 15 వరకు వాయిదా
  • సినిమా హాళ్లు, మాల్స్​, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకోవాలి
  • అన్ని ప్రభుత్వ శాఖ సిబ్బంది రెండు డోసులు తీసుకోవాలి
  • వివాహాల్లో 500 మందికి మించి ఉండకూడదు
  • రోజువారీ కరోనా పరీక్షలను 60వేల నుంచి లక్షకు పెంపు
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్​, ఐసీయూ పడకల ఏర్పాటు
  • కొవిడ్​ జోనల్​ బృందాలు, కంట్రోల్​ రూమ్​ల పునరుద్ధరణ

వారిలో 18 మందికి పాజిటివ్​: కేంద్రం

ఎట్​ రిస్క్​ దేశాల నుంచి భారత్​లోకి వచ్చిన 16వేల మందికి ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహించినట్లు పార్లమెంట్​లో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవీయా. వారిలో 18 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలిందని, జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించినట్లు చెప్పారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. బఫర్​ స్టాక్​ పాలసీతో అన్ని రాష్ట్రాల్లో సరిపడా ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. అలాగే, బూస్టర్​ డోస్​, పిల్లలకు వ్యాక్సిన్​పై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Omicron Variant:​ ఒమిక్రాన్​పై షాకింగ్​ విషయాలు- జాగ్రత్త పడకపోతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.