ETV Bharat / bharat

బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

author img

By

Published : Jan 4, 2023, 12:59 PM IST

Updated : Jan 4, 2023, 6:24 PM IST

ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని కత్తితో దారుణంగా పొడిచాడు ఓ యువకుడు. ఈ దారుణమైన ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు ఎనిమిదో తరగతి విద్యార్థిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన పట్నాలో జరిగింది.

lover-stabbed-girlfriend-after-breakup-in-delhi
ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రేమికుడు, బాలికపై గ్యాంగ్ రేప్

పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి

దిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో బ్రేకప్ చేసుకుందని పట్టపగలు ఓ యువతిని ఆమె ప్రేమికుడు కత్తితో దారుణంగా పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి క్లిష్టమైన పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

బాధితురాలు తెలిపిన సమాచారం ప్రకారం.. సిమ్రంజిత్ కౌర్ (21) అనే యువతి కేవల్ పార్క్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో తన కుటుంబంతో పాటు నివసిస్తోంది. ఆమె బీఏ చదువుతోంది. సుఖ్వీందర్ అనే వ్యక్తితో నాలుగైదు సంవత్సరాల నుంచి స్నేహం చేస్తోంది. సుఖ్వీందర్ దిల్లీలో సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ యువకుడితో స్నేహం చేయడం ఆమె కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. అందుకే అతడిని దూరం పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన సుఖ్వీందర్ ఆమెను కత్తితో పొడిచాడు.

"ఆ యువకుడు తెలిసినవాడే కాబట్టి ఇలా కత్తితో పొడుస్తాడని ఊహించలేదు. ఏదో మాట్లాడతా అని నన్ను వీధిలోకి పిలిచి ఇలా నాపై దాడి చేశాడు. మా ఇద్దరి స్నేహాన్ని కొనసాగించమని అతడు జనవరి 2న కోరాడు. అయితే ఆ యువకుడితో స్నేహం చేయటం మా కుటుంబంలో ఇష్టం లేకపోవడం వల్ల అతడితో దూరంగా ఉన్నాను. దీంతో ఆ యువకుడు నన్ను కత్తితో పొడిచాడు" అని బాధితురాలు సిమ్రంజిత్ కౌర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకుని, నిందితుడు సుఖ్విందర్ సింగ్​ను హరియాణాలోని అంబాలా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఎనిమిదో తరగతి విద్యార్థిపై ఐదుగురు గ్యాంగ్ రేప్..
బిహార్ పట్నాలో బాలికపై ఐదుగురు వ్యక్తులు కలిసి గ్యాంగ్ రేప్ చేసిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. బాలిక కోచింగ్​కు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. విద్యార్థినిని జల్లాలోని హనుమాన్ టెంపుల్ సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితులు పరారయ్యారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులలో ఒకడైన ఆటోడ్రైవర్​ను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.

"బాలిక కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. విద్యార్థిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తి ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. నలుగురు నిందితులు అప్పటికే అక్కడ ఉన్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేశారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టాం" అని పట్నా ఏఎస్​పీ అమిత్ రంజన్ చెప్పారు.

పది రోజుల పాటు బంధించి వివాహితపై గ్యాంగ్ రేప్..
ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఓ వివాహితను పదిరోజుల పాటు బంధించి గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. ఆమె రెండున్నరేళ్ల కుమారుడిని భారీ మొత్తానికి ఓ మహిళకు అమ్మేశారు.

మీర్జాపుర్​కు చెందిన బాధితురాలి భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ మహిళ ఏదో ఒక పని చేసి తన కుమారుడిని పోషించుకుంటోంది. ఆమె ఏదైనా మంచి పనిలో చేరి తన కొడుకును బాగా చూసుకోవాలని ఎన్నో ఆశలతో ఉండేది. దీనిలో భాగంగా ముగ్గురు మహిళలతో సహా నలుగురు ఆమెకు పని ఇప్పిస్తామంటే వారితో పాటు ఆమె ఆగ్రాకు వెళ్లింది. తర్వాత ఆమెను వారు చాలా చోట్లకు తీసుకుని వెళ్లి, ఓ చోట బేరం కుదుర్చుకుని ఆమెను అమ్మేశారు. ఆమె అందుకు అంగీకరించకపోవడం వల్ల ముగ్గురు వ్యక్తులు ట్రాన్స్ ​యమునా ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో పది రోజులపాటు బంధించి ఆమెపై గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు.

ఆమెతో పాటు ఉన్న రెండున్నరేళ్ల కుమారుడిని గురుగ్రామ్​లోని ఓ మహిళకు భారీ మొత్తానికి అమ్మేశారు. కేసు నమోదు చేసుకున్న చునార్ పోలీసులు మంగళవారం ఆగ్రాకు చేరుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు శ్రమించిన పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్​ నుంచి ఓ మహిళ ట్రాన్స్​ యమునా ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌కు వచ్చి బాధితురాలి కుమారుడిని తీసుకుని వెళ్లిందని నిందితులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్రా, చునార్ పోలీసులు మహిళ కొడుకు ఆచూకీ తెలుసుకునే పనిలో ఉన్నారు.

పక్కింటి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం..
18 ఏళ్ల బాలికను ఆమె పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్ పిలిభీత్​లోని జెహనాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జనవరి 1 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాధితురాలిని ఆమె పక్కింట్లో ఉండే కమల్ అనే వ్యక్తి అతడి ఇంటికి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ బాలిక కేకలు వేయడం వల్ల ఆమెను కొట్టాడు. తర్వాత ఆ బాలికకు బలవంతంగా విషం తాగించాడని పోలీసులు తెలిపారు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి ఇంటికి వెళ్లి ఈ ఘటన గురించి వారిని అడగగా వారు ఆమెను కొట్టారు. ఈ విషయాన్ని జెహనాబాద్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే మొదట ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. తన కూతురు పరిస్థితి విషమంగా ఉందని, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనలో నిందితుడు, అతని తల్లి, సోదరుడు, సోదరి, తండ్రిపై సంబంధిత సెక్షన్ల కింద మంగళవారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితులు ఇంటికి తాళం వేసి పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Last Updated :Jan 4, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.