ETV Bharat / bharat

దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మాణం.. ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!

author img

By

Published : Sep 10, 2022, 8:22 AM IST

Updated : Sep 10, 2022, 8:42 AM IST

Longest Bridge In India
Longest Bridge In India

మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అస్సాం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెనను రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన 60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా తీర్చిదిద్దారు.

Longest Bridge In India : మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అస్సాం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు. 60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా తీర్చిదిద్దారు. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.

లోహిత్‌పై సుందర కట్టడం
పూర్తిగా స్తంభాలపై నిర్మించిన 'భూపేన్‌ హజారికా సేతు' అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతుంది. తిన్‌సుకియా జిల్లాలో దక్షిణాన ఉన్న ధొలా నుంచి ఉత్తరాన ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై నిర్మించడంతో దీనిని ధొలా సాదియా వంతెనగా కూడా పిలుస్తారు. టిబెట్‌లో పుట్టి అరుణాచల్‌లో అడుగుపెట్టే లోహిత్‌ నది అసోంలో బ్రహ్మపుత్రలో కలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధారామాలను, ప్రకృతి అందాలను, అంతర్జాతీయ సరిహద్దును వీక్షించాలనుకునే పర్యాటకులు ఈ వంతెన మీదుగా వెళ్లవచ్చు. అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలోనూ పలు పర్యాటక విశేషాలు ఉన్నాయి. తిన్‌సుకియాకి 17 కి.మీ. దూరంలోని బెల్‌ టెంపుల్‌లోని శివుడికి ఒక గంట బహూకరిస్తే కోర్కెలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టుకు గంటను కట్టి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. దీనితో ఈ ఆలయానికి బెల్‌ టెంపుల్‌ అని పేరు వచ్చింది.

నవయుగ నిర్మాణం
భూపేన్‌ హజారికా సేతును హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ నిర్మించింది. 2011 నవంబరులో నిర్మాణ పనులను ప్రారంభించి 2017లో పూర్తి చేసింది. దాదాపు రూ.1,000 కోట్లు వెచ్చించారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్‌ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు.

ఇదీ చదవండి: సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అడుగులు.. అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌!

'అరవై ఏళ్లుగా దిగుమతి చేసుకుంటున్నాం.. ఇకపై భారత్​లోనే తయారీ'

Last Updated :Sep 10, 2022, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.