ETV Bharat / bharat

రసవత్తరంగా ఝార్ఖండ్​ రాజకీయం, క్యాంపులకు ఎమ్మెల్యేల తరలింపు

author img

By

Published : Aug 27, 2022, 4:14 PM IST

Updated : Aug 27, 2022, 6:13 PM IST

Jharkhand Political Crisis ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. సంకీర్ణ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బస్సుల్లో క్యాంపులకు తరలించారు.

Jharkhand Political Crisis
Jharkhand Political Crisis

రసవత్తరంగా ఝార్ఖండ్​ రాజకీయం, క్యాంపులకు ఎమ్మెల్యేల తరలింపు

Jharkhand Political Crisis: ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఊగిసలాటలో ఉంది. సీఎం శాసనసభ్యత్వంపై అనర్హత వేటుకు గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల బేరసారాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు.

Jharkhand Political Crisis
క్యాంపునకు వెళ్తున్న ఎమ్మెల్యేలు

శుక్రవారం సాయంత్రమే సోరెన్‌ నివాసం వద్ద రెండు బస్సులు కనిపించాయి. ఈ ఉదయం ఎమ్మెల్యేలంతా బ్యాగులు సర్దుకుని సీఎం నివాసానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం సంకీర్ణ ఎమ్మెల్యేలు బస్సుల్లో సోరెన్‌ ఇంటి నుంచి బయల్దేరారు. వీరిని కుంతీ జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ లేదా బంగాల్‌కు ఎమ్మెల్యేలను పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని భాజపా నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష భాజపా.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని గురువారం సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. దీనిపై గవర్నర్‌ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవీ చదవండి: అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత

ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష, లోదుస్తుల వివాదంతోనే

Last Updated :Aug 27, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.