ETV Bharat / bharat

'మానవ శరీరంలోనే కొత్త వేరియంట్లకు బీజాలు'

author img

By

Published : Aug 1, 2021, 2:32 PM IST

బాధితుడి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్‌ జన్యుక్రమంలో జరిగే మార్పులు.. కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. మహమ్మారి సమయంలో దాదాపు మూడువేల మంది కొవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు వెల్లడించారు.

variants of corona
కరోనా వేరియంట్లు

బాధితుడి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్‌ జన్యుక్రమంలో జరిగే మార్పులు.. కొత్త వేరియంట్లలోనూ ప్రతిబింబిస్తున్నాయని భారత శాస్త్రవేత్తలు తేల్చారు. ఉద్ధృతంగా వ్యాపించే కరోనా వైరస్‌ రకాల వ్యాప్తి, సాంక్రమిక శక్తిపై ముందస్తు అంచనాలు వేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అలాగే బాధితుడి శరీరంలో ఉన్నప్పుడు వైరస్‌లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా.. దాని మనుగడకు కీలకంగా మారే/ అవరోధంగా తయారయ్యే భాగాలను గుర్తించడానికి వీలవుతుందన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.

ఇతర కణాల్లోకి విస్తరించేకొద్దీ..

ఉత్పరివర్తన అనేది వైరస్‌ జీవనచక్రంలో చాలా సాధారణ ప్రక్రియ. మానవ కణంలోపల వైరస్‌ తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. ఈ క్రమంలో కొత్త వైరస్‌ ప్రతిరూపాల్లోని న్యూక్లియోటైడ్లలో స్వల్ప మార్పులు తలెత్తుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే వ్యక్తిలో ఈ వైరస్‌ ప్రతిరూపాలు ఇతర కణాల్లోకి విస్తరించేకొద్దీ.. ఆ మార్పులు కూడా క్రమంగా సూక్ష్మజీవిలో పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి, సమీపంలోని ఇతరులకూ వ్యాపిస్తున్నాయని తెలిపారు. మహమ్మారి సమయంలో రెండు విభిన్న సందర్భాల్లో దాదాపు మూడువేల మంది కొవిడ్‌-19 బాధితుల నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.