Hyderabad Techie Killed in Road Accident : నరకానికి దారి చూపిన 'గూగుల్​ మ్యాప్స్'

author img

By

Published : May 15, 2023, 2:08 PM IST

Hyderabad Techie Killed in Road Accident

Hyderabad Techie Killed in Road Accident : వీకెండ్​లో జాలీగా గడపాలనుకుని ఫ్రెండ్స్ అంతా కలిసి బయటకు వెళ్లారు. చేరుకోవాల్సిన ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్​లో వెతుకుతూ దారి తప్పారు. అయ్యో.. రాంగ్ రూట్​లో వెళ్లామని అర్థమై.. వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చావు బతుకుల మధ్య కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. అటుగా వెళ్లే వారిని బతికించిమని ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ అక్కడికి అంబులెన్స్ వచ్చేలోగా ప్రాణాలు విడిచాడు. సరదా యాత్ర.. విషాదంగా ముగిసిన ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Hyderabad Techie Killed in Road Accident : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు వీకెండ్ వచ్చిందంటే కాస్త రిలాక్స్ అవ్వడానికి మినీ టూర్ వేయాల్సిందే. అలా ఓ ​మిత్రబృందం హైదరాబాద్​లో మూడు బైకులపై వీకెండ్ విహారయాత్రకు వెళ్లింది. రోజంతా నగర శివారుల్లోని పలు టూరిస్ట్ ప్రాంతాలు తిరిగారు. ప్లాన్ చేసుకున్నట్లు వెళ్లాలనుకున్న ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత చివరకు కేబుల్ బ్రిడ్జి చూడాలనుకున్నారు. అందుకోసం కేబుల్ బ్రిడ్జివైపు మూడు బైకులతో వారంతా పయనం మొదలుపెట్టారు.

Software engineer died in Hyderabad : కేబుల్ బ్రిడ్జికి వారున్న ప్రాంతం నుంచి రూట్ సరిగ్గా తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించారు. రెండు బైకులపై ఉన్న వారు కరెక్ట్​గానే వెళ్లారు. కానీ మూడో బైకుపై ఉన్న వారు మాత్రం దారి తప్పారు. కాస్త దూరం వెళ్లాక దారి తప్పిన విషయం గమనించి తిరిగి వెనక్కి వెళ్దామనుకున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరిగి బైక్ నడిపిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడాడు. అతడితో పాటు ఉన్న ఇద్దరమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగర శివారులో మెహిదీపట్నం-శంషాబాద్‌ మధ్యలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా చిన్న గొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్​(22) ఇంజనీరింగ్​ పూర్తి చేశాడు. హైదరాబాద్​లోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా ఉద్యోగం వచ్చింది. పోచారం సమీపంలోని టౌన్​షిప్​లో స్నేహితులతో కలసి రూంలో ఉంటున్నాడు. శనివారం వారాంతపు సెలవు అయినందున స్నేహితులంతా కలిసి మూడు ద్విచక్ర వాహనాలపై 9 మంది భాగ్యనగరానికి వచ్చారు. చరణ్​ వాహనం వెనుక ఇద్దరు అమ్మాయిలు కుర్చున్నారు. ఉత్సాహంగా నూతన సచివాలయం, అంబేడ్కర్​ విగ్రహం చూశారు. అనంతరం కాసేపు ట్యాంక్​బండ్​పై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. తరవాత తీగల వంతెనకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వారిలో ఎవ్వరికి సరైన రూట్​ తెలియక గూగుల్​ మ్యాప్​ సాయంతో బయల్దేరారు. మోహిదీపట్నం మీదుగా తీగల వంతెన వైపు ప్రయాణించారు. చరణ్​ కంటే ముందుగా మిగిలిన రెండు బైక్​ల మీద ఉన్న వారు వెళ్లిపోయారు. చరణ్​ గూగుల్​ మ్యాప్​ చూస్తూ ఆరాంఘర్​ దగ్గర బైక్​ని పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ వైపు తిప్పాడు. కొంత దూరం ప్రయాణించిన తరవాత ఆ మార్గం కాదని తెలుసుకున్నాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్​ నంబరు 82 వద్ద ఎక్స్​ప్రెస్​ వే మార్గం వైపు వచ్చారు. అదే సమయంలో ఆరాంఘర్​ వైపు నుంచి వస్తున్న కారు వారి బైక్​ను ఢీ కొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరణ్​ రోడ్డు మీద కాసేపు నరకయాతన అనుభవించాడు. పైకి లేవలేని స్థితిలో అటుగా వెళ్తున్న వారిని తనని కాపాడమని వేడుకున్నాడు. కానీ అంబులెన్స్ వచ్చే లోగానే ప్రాణాలు విడిచాడు. అతని వెనక ఉన్న యువతులు గాయాలతో బయటపడి ఇంటికి చేరుకున్నారు. మిగిలిన మిత్రులు ఆ రాత్రి తీగల వంతెనకు చేరుకుని చరణ్​కు ఫోన్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఆందోళన చెంది.. వెనక్కి వచ్చి ప్రమాద విషయాన్ని తెలుసుకున్నారు. అర్ధరాత్రి నడిరోడ్డుపై చరణ్ అనుభవించిన నరకం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.