ETV Bharat / bharat

గూగుల్ సాయంతో ట్రీట్మెంట్​.. 3నెలల క్రితం కొత్త హాస్పిటల్​.. 'శంకర్ దాదా' గుట్టురట్టు

author img

By

Published : Feb 11, 2023, 12:39 PM IST

గూగుల్​ సాయంతో కొన్నేళ్లుగా రోగులకు చికిత్స చేస్తున్నాడో ఓ వ్యక్తి. ఇంటర్నెట్​లో చూసి మందులు కూడా రాసి ఇస్తున్నాడు. మూడు నెలల క్రితం ఓ క్లినిక్​ను కూడా ప్రారంభించాడు. తాజాగా అతడి బాగోతం బయటపడింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే?

aFake doctor who saw medicine with the help of Google was arrested
Fake doctor who saw medicine with the help of Google was arrested

గూగుల్​ ఉపయోగిస్తూ పేషెంట్లకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్​ను అరెస్ట్​ చేశారు తమిళనాడు పోలీసులు. ఇంటర్నెట్​లో సంబంధింత వ్యాధికి ఏ మందులు రాసి ఇవ్వాలో తెలుసుకుని రోగులకు ప్రిస్క్రిప్షన్​ రాస్తి ఇస్తున్నాడు నిందితుడు. తన పేరుతోనే ఉన్న ఓ వైద్యుడి స్థానంలో నకిలీ ధ్రువపత్రాలు సంపాదించాడు. చివరకు ఆ వైద్యుడి ఫిర్యాదుతో.. నిందితుడి బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. తంజావూరు జిల్లాకు చెందిన సెంబియన్​(35) అనే వైద్యుడు.. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2013లో రష్యాలో మెడికల్​ కోర్సు పూర్తి చేసిన అతడు.. తమిళనాడు మెడికల్​ కౌన్సిల్​లో వైద్యుడిగా నమోదు చేసుకున్నాడు. మెడికల్​ రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన తర్వాత.. ఇండియన్​ కౌన్సిల్​లో పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవలే సెంబియన్​.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మళ్లీ తమిళనాడులో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.

sFake doctor who saw medicine with the help of Google was arrested
నకిలీ వైద్యుడు సెంబియన్​

అందుకోసం గ్రాడ్యుయేషన్​ సర్టిఫికెట్​ను మెడికల్​ కౌన్సిల్​ వెబ్​సైట్​లో అప్లోడ్​ చేసేందుకు యత్నించాడు. ఎంత చేసినా అప్లోడ్​ అవ్వలేదు. దీంతో తమిళనాడు మెడికల్​ కార్యాలయానికి సెంబియన్​ వెళ్లాడు. జరిగినదంతా వారికి చెప్పాడు. రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. చెన్నై పోలీసు కమిషనర్​ ఈ కేసును.. అన్నానగర్​ సైబర్​ క్రైమ్​ పోలీస్​స్టేషన్​కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి. అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి.. అసలైన వైద్యుడి స్థానంలో నకిలీ పత్రాలు అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

మైలదుతురై జిల్లాకు చెందిన నిందితుడు సెంబియన్ (31).. 2012లో పుదుకోట్టైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివాడు. 2017లో ఉద్యోగం వెతుక్కుంటూ చెన్నై వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో మూడు నెలలు పనిచేశాడు. తర్వాత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మార్కెటింగ్‌ ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో వైద్యరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కోసం ఫస్ట్​ ఎయిడ్​, ఫైర్​ అండ్ సేఫ్టీ, స్కాన్ వంటి డిప్లొమా కోర్సులను అభ్యసించాడు. గూగుల్ ద్వారా తన పేరు మీద ఉన్న డాక్టర్ల వివరాల కోసం వెతికాడు. ముగ్గురు డాక్టర్లు సెంబియన్​ పేరుతో ఉన్నట్లు గమనించిన అతడు.. తన వయసును పోలి ఉన్న తంజావూరుకు చెందిన ఓ వైద్యుడిని గుర్తించాడు. డాక్టర్​ సెంబియన్​ పేరును సెలెక్ట్​ చేసి తమిళనాడు మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాడు.

ఒరిజినల్​ డాక్టర్ సెంబియన్ ప్రొఫైల్ నుంచి అతడి ఫొటో, అడ్రస్ తొలగించి ఫొటోషాప్ ద్వారా తన ఫొటో, అడ్రస్​ పొందుపరిచాడు నకిలీ వైద్యుడు సెంబియన్. ఆ తర్వాత నీలాంగరైలోని అస్త్రా ఆసుపత్రిలో పనిచేశాడు. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులకు అధిక డిమాండ్ కారణంగా.. ఇతడిపై ఎవరికి అనుమానం రాలేదు. మూడు నెలల క్రితం తారామణి ప్రాంతంలో స్పార్క్ ఫ్యామిలీ క్లినిక్ పేరుతో హాస్పిటల్ కూడా మొదలుపెట్టాడు.

తాజాగా అసలు విషయం బయటపడ్డాక పోలీసులు నకిలీ వైద్యుడు సెంబియన్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్కామ్​లో సెంబియన్‌కు మెడికల్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ ద్వారా నకిలీ వైద్యుడు సెంబియన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.