పాక్​లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​.. ప్రయాణికుడు మృతి

author img

By

Published : Mar 13, 2023, 11:19 AM IST

Updated : Mar 13, 2023, 1:45 PM IST

delhi to doha indigo flight emergency landing

దిల్లీ నుంచి దోహాకు బయల్దేరిన విమానాన్ని పాకిస్థాన్​లో అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడికి అస్వస్థత తలెత్తడం వల్ల విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. అయితే, ఆ ప్రయాణికుడు మృతి చెందినట్లు కరాచీ విమానాశ్రయ వైద్య బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇండిగో విమానాన్ని పాకిస్థాన్​లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో దిల్లీ నుంచి దోహాకు వెళ్లే విమానాన్ని పాకిస్థాన్​లోని కరాచీలో దించేశారు. సోమవారం ఉదయం దిల్లీ నుంచి 6ఈ-1736 ఇండిగో విమానం బయల్దేరింది. ఇది దోహాకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తింది. పరిస్థితి విషమించడం వల్ల విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్థాన్​లోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. దురదృష్టవశాత్తూ విమానం గగనతలంలో ఉండగానే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్​పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.

సోమవారం ఉదయం 8:41 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 11 గంటలకు ఖతార్​ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించింది. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్​ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్​పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్​కు అనుమతి కోరారు. అయితే విమానం​ కరాచీలో ల్యాండ్​ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు. కరాచీ విమానాశ్రయంలోని వైద్య సిబ్బంది సైతం.. ప్రయాణికుడు మరణించినట్లు ధ్రువీకరించారు. దాదాపు 5 గంటలపాటు విమానాన్ని కరాచీలోనే ఉంచి అధికారులు సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. అన్ని లాంఛనాలు పూర్తెన తర్వాత ఆ ఇండిగో విమానం తిరిగి దిల్లీకి బయల్దేరినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఎయిర్​లైన్​ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత లేదు. త్వరలోనే అబ్దుల్లా మృతికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితం కూడా ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఫిబ్రవరి నెలలో దిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తగా అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఫిబ్రవరి 25న కొచ్చి నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా భోపాల్​లో ల్యాండ్​ అయింది.

Last Updated :Mar 13, 2023, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.