కాంగ్రెస్ జోరు​.. బీజేపీకి బిగ్ షాక్.. హంగ్ అంచనాలు తారుమారు!

author img

By

Published : May 13, 2023, 10:36 AM IST

Updated : May 14, 2023, 3:59 PM IST

Karnataka Election Results 2023

Karnataka Election Results 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందన్న అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.

Karnataka Election Results 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికార బీజేపీ-కాంగ్రెస్​ మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్​ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్​ చెప్పుకోదగ్గ స్థానాలతో సరిపెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెండు జాతీయ పార్టీలు మాత్రం గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే తామేనంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో అధిష్ఠానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలందరినీ వెంటనే బెంగళూరుకు రావాలని కోరింది. కాంగ్రెస్​ ముందంజలో ఉండడం వల్ల ఆ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరులో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ శిమ్లాలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్​
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు DK శివకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నేతలకే చెందుతుందన్నారు. తనపై సోనియా చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని శివకుమార్‌ తెలిపారు.

"ఈ విజయం పార్టీ శ్రేణులు, నాయకులది. వారు ఎంతో శ్రమించారు. ప్రజలు మాపై విశ్వాసం చూపారు. నాయకులు మాకు మద్దతు ఇచ్చారు. ఇది సమష్టి నాయకత్వం. మేమంతా కలిసి పనిచేశాం. నేను ఆరంభంలో చెప్పాను. మేమంతా కలవటం ఇది ఆరంభమని ఓటువేసిన రోజు చెప్పాను. కలిసి ఆలోచించటమే పురోగతి. కలసి పనిచేయటం విజయమని చెప్పాను. జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవటానికి సోనియా వచ్చిన విషయం నేను మరిచిపోలేను. బీజేపీ నేతలంతా కలిసి నన్ను జైల్లో పెట్టారు."

--డీకే శివకుమార్‌, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు

ఆదివారమే కొత్త సీఎం ఎన్నిక!
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఆదివారం కాంగ్రెస్ శాసనసభా పక్షం బెంగళూరులో సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక PCC అధ్యక్షుడు DK శివకుమార్ సీఎం రేసులో ముందున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సాయంత్రానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగళూరు చేరుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సూచించారు. అధిష్టానం పరిశీలకులను పంపిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై మిగిలిన ప్రక్రియ అంతా జరుగుతుందని తెలిపారు.

మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యాం: బొమ్మై
మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని సీఎం, బీజేపీ నేత బసవరాజ్‌ బొమ్మై వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రజల ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు బొమ్మై తెలిపారు. ప్రధాని మోదీ నుంచి పార్టీ కార్యకర్తల వరకు అంతా శ్రమించినా కూడా సానుకూల ఫలితాలు రాలేదన్నారు. మొత్తం ఫలితాలను విశ్లేషించి.. లోపాలను సరిదిద్దుకొని 2024 పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కానున్నట్లు బొమ్మై చెప్పారు.

ఇవీ చదవండి : 'మెజారిటీ లేకున్నా అధికారం.. బీజేపీ ప్లాన్​-బీ రెడీ!'.. జేడీఎస్ కలిసేది వారితోనే!!

కౌంటింగ్​కు రంగం సిద్ధం.. కన్నడనాట గెలుపెవరిది? ఎగ్జిట్​ పోల్స్​ నిజమవుతాయా?

Last Updated :May 14, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.