కాంగ్రెస్​లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి​' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?

author img

By

Published : May 13, 2022, 1:25 PM IST

Updated : May 13, 2022, 2:30 PM IST

Chintan Shivir'

Congress chintan shivir: పార్టీ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకునేందుకు మూడు రోజుల పాటు చింతన్​ శిబిర్​ నిర్వహిస్తోంది కాంగ్రెస్​. ఈ క్రమంలో ఒకే కుటుంబం- ఒకే టికెట్​ ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తున్నట్లు కీలక నేత తెలిపారు.

Congress chintan shivir: ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ పార్టీ.. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు చింతన్​ శిబిర్​ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతూనే పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరిగే చింతన్​ శిబిర్​ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఒకే కుటుంబం ఒకే టికెట్​ వంటి కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్​ పరిశీలిస్తోందన్నారు హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్​ మాకెన్​.

"చింతన్​ శిబిర్​లో 'ఒకే కుటుంబం- ఒకే టికెట్​' ప్రతిపాదనపై చర్చ జరగుతోంది. ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీతో గత ఐదేళ్లుగా పనిచేసినట్లయితే.. వారికి మినహాయింపు ఉంటుంది. గాంధీ కుటుంబీకులతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మండల కమిటీల ఏర్పాటుపై బూత్​, బ్లాక్ స్థాయి కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం, ప్రస్తుతం పార్టీలో పదవీ కాలం గరిష్ఠంగా 3 ఏళ్లు ఉండగా.. దానిని ఐదేళ్లకు పెంచటం, పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది."

- అజయ్​ మాకెన్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ప్రస్తుతం కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్​బరేలీ లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. కేరళలోని వయనాడ్​ లోక్​సభ ఎంపీగా రాహుల్​ గాంధీ కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అయితే.. చింతన్​ శిబిరంలో చర్చకు వచ్చిన 'ఒకే కుటుంబం.. ఒకే టికెట్​' ప్రతిపాదనకు కాంగ్రెస్​ ఆమోదం తెలిపితే.. గాంధీ కుటుంబీకులపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. దీంతో సోనియా, రాహుల్​, ప్రియాంక పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది. అయితే, ఈ ప్రతిపాదనలోనే ఐదేళ్ల మెలిక ఉన్నందున వారి పదవులకు వచ్చిన ముప్పేదీ లేదని పలువురు పేర్కొంటున్నారు.

  • కాంగ్రెస్​ పరిశీలనలోని కీలక సంస్కరణలు: కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు ఒకే కుటుంబం- ఒకే టికెట్​ రూల్​ ప్రతిపాదన. అదే కుటుంబంలోని మరో వ్యక్తి ఐదేళ్లు పార్టీ కోసం పని చేసి ఉంటే కొత్త నిబంధన నుంచి మినహాయింపు.
  • బూత్​, బ్లాక్​ స్థాయిల మధ్య మండల కమిటీలను ఏర్పాటు చేయటం. 15-20 బూత్​లకు ఒక మండల కమిటీ, 3-4 మండల కమిటీలతో బ్లాక్​ స్థాయి కమిటీ ఉండేలా చర్యలు
  • అన్ని స్థాయుల్లో ఉన్న కమిటీల్లో 50 శాతం మంది 50 ఏళ్లలోపు వారే ఉండాలి
  • పార్టీ పదవుల్లో గరిష్ఠంగా ఐదేళ్లు కొనసాగేలా మార్పులు
  • హౌస్​ సర్వే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రజా అంతర్దృష్టి విభాగం ఏర్పాటు
  • పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం

ఇదీ చూడండి: కాంగ్రెస్ 'చింత' తీరేనా? 'యూపీఏ++'తో భాజపాను ఢీకొట్టగలిగేనా?

Last Updated :May 13, 2022, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.