ETV Bharat / bharat

'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'

author img

By

Published : Aug 12, 2022, 2:31 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు తాను ప్రయత్నిస్తామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్​ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. మరోవైపు, కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​పై బిహార్​ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ తీవ్రంగా మండిపడ్డారు.

CM Nitish Kumar Statement on opposition unity For 2024 lok Sabha Election
CM Nitish Kumar Statement on opposition unity For 2024 lok Sabha Election

Bihar CM Nitish Kumar: బిహార్​లో భాజపాతో తెగదెంపులు చేసుకుని మహాకూటమిలోని పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతీశ్ కుమార్​పై దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోదీకి ప్రత్యర్ధిగా విపక్షాల కూటమి తరఫున ఆయన నిలబడతారన్న ఊహాగానాలు తెగ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ దీనిపై స్పందించని నీతీశ్ కుమార్.. శుక్రవారం మాట్లాడారు.

"నేను అందరికీ నమస్కరించి చెబుతున్నాను. ప్రధాని పదవికి పోటీపడే ఆలోచనలు నాకు లేవు. దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి. అయితే దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. అందరం కలసి పని చేయాలని కోరుకుంటున్నాను."

-- నీతీశ్​ కుమార్​, బిహార్​ సీఎం

ప్రధాని రేసుపై నీతీశ్ కుమార్​ క్లారిటీ

త్వరలో బిహార్ రాష్ట్ర క్యాబినెట్​ను విస్తరిస్తామని నీతీష్‌ తెలిపారు. మహాకూటమిలోని పార్టీలతో కలిసి చర్చిస్తున్నామని, 15వ తేదీ తర్వాత విస్తరణ జరుగుతుందని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత నీతీశ్​పై భాజపా చేస్తున్న మాటల యుద్ధం గురించి కూడా ఆయన స్పందించారు. "నా గురించి మాట్లాడడం వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని భావించి వారు మాట్లాడితే.. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చామనేది స్పష్టం చేశాము. కాబట్టి ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదు. తేజస్వీ ఇచ్చిన పది లక్షల ఉద్యోగాల హామీపై చర్చిస్తున్నాం. అందుకు మా వంతు కృషి చేస్తున్నాం. 2015-16లో చెప్పినవన్నీ చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ హామీని నెరవేరుస్తాం." అని నీతీశ్​ అన్నారు.

కేంద్ర మంత్రి గిరిరాజ్​పై తేజస్వీ ఫైర్..
కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​పై బిహార్​ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై తాను చేసిన ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తేజస్వీ తెలిపారు. ద‌శ‌ల వారీగా పది లక్షల కొలువుల్ని భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎంతసేపూ ఎదుటి వాళ్ల మీద నిందలు వేయడం త‌ప్ప భాజ‌పాకు ఇంకో ప‌ని లేద‌ని విమర్శించారు. తాను జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్​ను కేంద్ర మంత్రి ఎడిట్ చేయించి, షేర్ చేయ‌డాన్ని తీవ్రంగా తప్పుప‌ట్టారు.

"ఏటా భారీగా ఉద్యోగాలు ఇస్తామని ప్ర‌ధాన మంత్రి మోదీ హామీ ఇచ్చారు. మరెందుకు భ‌ర్తీ చేయ‌డం లేదు? ముందు మీరు భ‌ర్తీ చేయండి. తర్వాత దీని గురించి మాట్లాడండి. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ప్ర‌తిప‌క్షాల మీద‌, నాయ‌కుల మీద విమ‌ర్శ‌లు చేయ‌డం మీకు అల‌వాటుగా మారింది."

-- తేజస్వీ యాదవ్​, బిహార్​ డిప్యూటీ సీఎం

అయితే బిహార్​ డిప్యూటీ సీఎంగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 ల‌క్ష‌ల ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌ని ప్రకటించారు. దీనిపై మీరెలా భ‌ర్తీ చేస్తారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ ప్ర‌శ్నించారు. దాంతో పాటు తేజస్వీ యాదవ్​ ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్​ను కూడా ఆయన సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఇవీ చదవండి:

దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు!

పోస్ట్​లో ఒకేసారి 40వేలకుపైగా రాఖీలు, గ్రీటింగ్ కార్డ్​లు.. అన్నీ ఆయనకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.