ETV Bharat / bharat

'కరోనా ప్లాన్​'తో భర్తనే కిడ్నాప్​ చేయించిన భార్య

author img

By

Published : Dec 6, 2020, 8:49 PM IST

డబ్బుకోసం ఎలాంటి పనిచేసేందుకైనా కొందరు వెనకాడరు అనేందుకు ఇదొక నిదర్శనం. తన కుటుంబం బాగోగులు ఆలోచించి.. ఓ ఇల్లు కొందామని భర్త డబ్బు దాచాడు. దీనిపై కన్నేసిన భార్య.. ఏకంగా కట్టుకున్న భర్తనే కిడ్నాప్​ చేయించింది. పైగా అతడికి కరోనా సోకినట్టు అసత్య ప్రచారం కూడా చేసింది. అయితే.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ కేసును ఛేదించారు పోలీసులు. అలా ఆమె ప్లాన్​ బయటపడగా.. అడ్డంగా దొరికిపోయారు సహచరులు.

Bengaluru: Husband kidnapped by Wife for 40 lakh: 5 arrest
భర్తను కిడ్నాప్​ చేసిన భార్య- ఐదుగురు అరెస్ట్​

కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. రూ.40లక్షల కోసం కట్టుకున్న భర్తనే అపహరించింది భార్య. ఇందుకోసం భర్తకు కరోనా సోకిందని అబద్ధం చెప్పిందామె. బాగులకుంటెలో జరిగిన ఈ కిడ్నాప్ కేసును బాధితుడు మిత్రుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఛేదించారు పోలీసులు. ఇందులో భాగమైన ఎనిమిది మందిలో.. ఐదుగురు నిందితుల(బాధితుడి భార్య సుప్రియ, లత, గగన్​, బాలాజీ తేజస్​, కిరణ్​ కుమార్)ను అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

కిడ్నాప్​ ఎందుకంటే?

త్యాగరాజనగర్​లో నివాసముంటోన్న సోమశేఖర్​ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఇల్లు కొనేందుకు రూ. 40లక్షలు కూడబెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య సుప్రియ ఎలాగైనా ఆ సొమ్మును కాజేయాలని కుట్రపన్నింది. బంధువుల సాయంతో భర్తను కిడ్నాప్​ చేయించింది.

ప్లాన్​ చేసిందిలా..

నవంబర్​ 1న తనకు కడుపు నొప్పిగా ఉందంటూ భర్తను పిలిపించింది సుప్రియ. ఇందుకోసం మందులు తీసుకురమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్టుగా మెడికల్​ షాప్​లో మందులు కొని నడుస్తూ ఇంటికి వస్తుండగా.. సోమశేఖర్​ వద్దకు ఓ అంబులెన్స్​ వచ్చింది. 'మీరు కరోనా రోగి, ఆస్పత్రి నుంచి తప్పించుకు తిరుగుతున్నారు' అని చెప్పారా అత్యవసర వాహన సిబ్బంది. అదంతా అబద్ధమని అతడు ఎంత చెప్పినా వినకుండా.. బలవంతంగా అంబులెన్స్​ ఎక్కించి అపహరించారు. అనంతరం అతడ్ని చామరాజనగర్​లోని ఓ ఫామ్​హౌస్​లో బంధించారు.

ఆ తర్వాత​ స్నేహితుడి సాయంతో అతడి భార్య సుప్రియకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు కిడ్నాపర్లు. వారు చెప్పినట్టుగానే సుప్రియకు రూ.10లక్షలు ఇమ్మని తన మిత్రుడితో చెప్పాడు సోమశేఖర్​. అయితే.. ఈ విషయమై అనుమానం వ్యక్తం చేసిన స్నేహితుడు సుప్రియ ఇంటి వద్దకు వెళ్లి విచారించాడు. 'నా భర్త(సోమశేఖర్) కొవిడ్​ బారినపడ్డాడు, అందుకే అతడ్ని మా బంధువు గగన్.. మాగాడి రోడ్​ ఆస్పత్రిలో చేర్పించారు' అని బుకాయించింది సుప్రియ.

బయటపడిందిలా..

అయితే.. ఆమె మాట తీరుపై అనుమానంతో బాధితుడి మిత్రుడు స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో సుప్రియ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విషయాన్ని వెంటనే తన సహచరులకు చెప్పిందామె. అలా ఇద్దరు నిందితులు(గగన్​, ఆమె తల్లి లత) దొరికిపోయారు. బండారం మొత్తం బయటపడిపోయింది. వారు చెప్పిన వివరాల ప్రకారం.. బీబీఎంపీ(బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ)లో పనిచేస్తున్న లత(సుప్రియ తల్లి).. కరోనా డ్రామాకు తెరలేపింది.

ఇదీ చదవండి: రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.