నూతనత్వంలేని ఏపీ బడ్జెట్‌.. అభివృద్ధి ఊసెత్తని ఆర్థిక మంత్రి

author img

By

Published : Mar 17, 2023, 9:06 AM IST

AP BUDGET 2023-24
AP BUDGET 2023-24 ()

AP BUDGET 2023-24: రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మాత్రం నూతనత్వం లేదు. 2లక్షల 79వేల 279.27 కోట్ల రూపాయల పద్దులో ఒక్క కొత్త పథకం, ప్రాజెక్టునూ చేపట్టలేదు. సాగునీటి ప్రాజెక్టులపై మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఆర్థిక మంత్రి.. అభివృద్ధి ఊసే ఎత్తలేదు. మద్యపాన నిషేధాన్ని మళ్లీ అటకెక్కించి.. లిక్కర్‌ అమ్మకాలతో 25 వేల కోట్ల రూపాయలను పిండుకునే ప్రయత్నం చేశారు. పెండింగ్‌ బిల్లులపై హామీ ఇవ్వని మంత్రి.. ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న భరోసాను కల్పించలేకపోయారు. అటు.. రాబడి అంచనాలు, అప్పుల లెక్కలన్నీ సందేహాస్పదంగానే ఉన్నాయి.

AP BUDGET 2023-24 : ఆంధ్రప్రదేశ్​ బడ్జెట్‌ అంతా అంకెల గారడీలా ఉంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి.. 2023-24 వార్షిక బడ్జెట్‌ పద్దును అత్యంత జాగ్రత్తగా 2 లక్షల 79వేల 2వందల 79.27 కోట్ల రూపాయలుగా సర్దుబాటు చేశారు. దానిలో ఏకంగా 73వేల 055 కోట్లు వివిధ రుణాల రూపంలోనే సమీకరించనున్నారు. 2022-23 బడ్జెట్‌లో 65వేల 031 కోట్లు అప్పు చేయనున్నట్టు ప్రతిపాదించిన ప్రభుత్వం, సవరించిన అంచనాల్లో దాన్ని 64వేల 303 కోట్ల రూపాయలుగా చూపించింది. కానీ వాస్తవంగా చేసిన రుణాలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి.

రెవెన్యూ రాబడి కన్న ఖర్చులే అధికం: ఇక కొత్త బడ్జెట్‌లో 73వేల 055 కోట్ల అప్పుల్ని ప్రతిపాదించారంటే.. ప్రభుత్వం కార్పొరేషన్లు వంటి వాటి ద్వారా చేసే రుణాల్ని కూడా కలిపితే ఇది భారీగా పెరిగే అవకాశముంది. 2023-24 బడ్జెట్‌లో చూపించిన అప్పుల్ని మినహాయిస్తే.. రెవెన్యూ రాబడి కింద 2లక్షల 6వేల 224.01 కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం లెక్కించింది. రెవెన్యూ ఖర్చులు 2లక్షల 28వేల 540 కోట్లు చూపించింది. అంటే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చే రెవెన్యూ రాబడి కన్నా ఖర్చులే ఎక్కువ.

అప్పులు తీర్చడానికే.. అప్పులు: అప్పుల రూపంలో తీసుకొస్తున్న దానిలోనూ కొంత మొత్తాన్ని ఏ ఆస్తీ సృష్టించని రెవెన్యూ ఖర్చుల కోసమే వినియోగించాల్సి వస్తోంది. ఈ బడ్జెట్‌లో దాదాపు 47వేల 084 కోట్లు అప్పులు తీర్చేందుకు, వడ్డీలు చెల్లించేందుకే కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఈ బడ్జెట్‌లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరో వైపు మూల ధన వ్యయాన్ని 31వేల 061 కోట్లుగా చూపించారు. మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో ఇది కేవలం 11 శాతమే ఉండటం గమనార్హం.

రాబడి ఎంత తగ్గితే.. అంత మేర అప్పులపై ఆధారపడాలి: ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన బడ్జెట్‌ అంచనాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ రాబడిని 2.06 లక్షల కోట్లుగా అంచనా వేసింది. పాత బడ్జెట్‌ అనుభవాల్ని , వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంత రాబడి సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాస్తవ లెక్కల్ని తాజాగా తేల్చారు.

వాటినే పరిగణనలోకి తీసుకుంటే.. నాడు ప్రభుత్వం 1లక్ష 77వేల 196.48 కోట్ల రూపాయలు రెవెన్యూ రాబడి వస్తుందని ఆశించింది. చివరికి లెక్కలు తేలేసరికి ఆ మొత్తం 1లక్ష 50వేల 552.49 కోట్లకే పరిమితమైంది. దాదాపు 27 వేల కోట్ల రాబడి తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1లక్ష 91వేల 225 కోట్ల రాబడిని అంచనా వేశారు. పది నెలల రాబడి, రెండు నెలల అంచనాల ఆధారంగా అది 1లక్ష 76వేల 448 కోట్లకే పరిమితమవుతుందని భావిస్తున్నారు. అంచనాల కన్నా.. 15 వేల కోట్లు తక్కువ రాబడి ఉంటుందని లెక్కించారు. రాబడి ఎంత తగ్గితే అంత మేర అప్పులపై ఆధారపడాల్సి ఉంటుంది.

ప్రాజెక్టులను తక్కువ ప్రాధాన్యం: సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక ప్రాజెక్టులు, రహదారులు వంటి కీలక నిర్మాణ రంగాలపై చేసే ఖర్చు.. రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి తక్కువ ప్రాధాన్యమిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మొత్తం బడ్జెట్‌లో మూలధన వ్యయ కేటాయింపులు మరీ తక్కువగా ఉంటున్నాయి. మరో వైపు చేసిన మొత్తం ఖర్చులో మూలధన వ్యయం మరీ తగ్గిపోతోంది.

వాటికి తప్పించి మిగిలిన వాటికి అంతంతమాత్రమే: ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, నవరత్నాలకు తప్పా.. వ్యవసాయం, సాగునీరు వంటి రంగాలకు అంతంతమాత్రం కేటాయింపులతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ అదే ధోరణి కనబరిచింది. 2022-23 బడ్జెట్‌లో మూలధన వ్యయంగా 30వేల 679 కోట్లు ప్రతిపాదించారు. కానీ 2023 జనవరి వరకు ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం పది నెలల్లో 7వేల 367 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2023-24 బడ్జెట్‌లో మూల ధన వ్యయాన్ని 31,061 కోట్లుగా ప్రతిపాదించారు. దానిలో ఎంత ఖర్చు చేస్తారన్నది సందేహమే.

పేదలకు తక్కువ కేటాయింపులే: ఎన్నికల హామీల్ని 98 శాతం నెరవేర్చామని గొప్పలు చెప్పే వైసీపీ ప్రభుత్వం.. అత్యంత కీలకమైన పేదలకు గృహ నిర్మాణ పథకం అమల్లో ఘోరంగా వెనుకబడి ఉన్నా, ఈ బడ్జెట్‌లోనూ అత్తెసరు కేటాయింపులతోనే సరిపెట్టింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు.. అంటూ పదే పదే చెప్పే సీఎం జగన్‌.. ఈ బడ్జెట్‌లో వారి కోసం ప్రత్యేకంగా చేసిందేమి లేదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు అంతంత మాత్రం కేటాయింపులతోనే సరిపెట్టారు.

అటకెక్కిన మద్య నిషేధం: మద్య నిషేధం హామీపై మళ్లీ మాట తప్పి, మడమ తిప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఎక్సైజ్‌ సుంకం ద్వారానే 18 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం మద్య నిషేధాన్ని పూర్తిగా అటకెక్కించేశారని చెప్పడానికి నిదర్శనం. వ్యాట్‌ తదితరాలు కలిపితే ఇది మరో 7నుంచి 8 వేల కోట్లు పెరుగుతుంది. అంటే ప్రజలతో మరింతగా మద్యం తాగించి, వీలైనంత ఎక్కువ ఆదాయం పిండుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పకనే చెప్పారు.

పెండింగ్​ బిల్లులపై లేని స్పష్టత: కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు నేతిబీరలో నెయ్యి చందమేనని మరోసారి నిరూపించారు. నవరత్నాల కోసం ఖర్చు చేస్తున్న నిధుల్నే.. వివిధ కార్పొరేషన్లకు కేటాయింపులుగా చూపిస్తూ మాయ చేశారు. గుత్తేదారులకు 1.80 లక్షల కోట్లకు పైగా పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లులు ఎలా చెల్లిస్తారన్న స్పష్టత గానీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నామన్న భరోసా గానీ ఈ బడ్జెట్‌ ద్వారా కల్పించలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు 16 వేల కోట్ల రూపాయలకు పైగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల ఊసే లేదు.

నూతనత్వంలేని ఏపీ బడ్జెట్‌.. అభివృద్ధి ఊసెత్తని ఆర్థిక మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.