ETV Bharat / bharat

పంజాబ్​లో ఆప్​ సంచలనం సృష్టించేనా? 'కేజ్రీ' పాచిక పారేనా?

author img

By

Published : Jan 24, 2022, 4:57 PM IST

Punjab assembly election 2022: దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌ సంచ‌ల‌నాల పార్టీగా పేరు పొందింది. దేశ రాజధానిలో వరుస విజయాలను నమోదు చేస్తున్న కేజ్రీవాల్​ పార్టీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొరుగున ఉన్న పంజాబ్‌లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పంజాబ్​లో 2017 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆమ్​ ఆద్మీ పార్టీ.. 2022 ఎన్నికల్లో దిల్లీ తరహాలో సంచలనం సృష్టిస్తుందా? కేజ్రీవాల్​ చెబుతున్న దిల్లీ తరహా 'సంక్షేమ' పాచిక పంజాబ్​లో పారుతుందా? బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి కేజ్రీ సైన్యం ఏం చేస్తోంది?

పంజాబ్​లో ఆప్​ సంచలం సృంచేనా?
AAP sensation in Punjab

punjab assembly election 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆమ్​ ఆద్మీ పార్టీ ముందుకు సాగుతోంది. 2017 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆప్​.. ఈసారి సీఎం పీఠంపై కన్నేసింది. 2022 అసెంబ్లీ పోరులో గెలిచి.. సంచలనం సృష్టించాలని ఊవిళ్లూరుతోంది.

గత ఎన్నికల్లో ఆప్​ ప్రభావం ఇలా..

వాస్తవానికి 2017లో పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి సానుకూల పవనాలు వీస్తాయనే భావించారు అంతా. కారణం.. అప్పటికే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో 4ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవటం. మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో 4 గెలుచుకోవటం సహా మరో 3 చోట్ల స్వల్ప తేడాతో ఓటమి చవి చూసింది. అంటే.. కాస్తోకూస్తో ఓట్లు ఆప్‌ వైపు మొగ్గి ఉంటే ఆ మూడు స్థానాల్లోనూ గెలిచేదే. పంజాబ్‌లో పాగా వేయాలనుకున్న పార్టీకి ఈ ఫలితాలు ఎంతో ఉత్సాహం ఇచ్చాయి.

ఇదే జోరుతో 2017 అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ విజయం సాధించాలని చూసినా.. ఆప్‌కు అనుకున్న ఫలితాలు రాలేదు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 77 సీట్లు గెల్చి అధికారం చేపట్టింది.

ఆమ్‌ఆద్మీ 20చోట్ల విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి ఈ స్థానాలు పెంచుకోవటం మాత్రమే కాదు.. ఏకంగా పంజాబ్ పీఠం అధిష్ఠించాలని గట్టిగా కసరత్తులు చేస్తోంది ఆప్.

ఆ విషయంలో ఆప్​ క్షమాపణలు..

2017 అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చిన నేపథ్యంలో.. ఈసారి మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ఆప్‌. గత ఎన్నికల సమయంలో కాస్తంత దూకుడుగా వ్యవహరించారు పార్టీ అధినేత కేజ్రీవాల్. యాంటీ డ్రగ్స్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించటమే కాక.. శిరోమణి అకాలీదళ్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. డ్రగ్స్ మాఫియాకు అండగా నిలుస్తున్న పార్టీ నాయకుల్ని జైలుకు పంపిస్తానన్నారు. ఇది పార్టీకి చేటు చేసిందే తప్ప మేలైతే చేయలేదు.

తరవాత ఆ పార్టీ నేతలు పరువు నష్టం దావా వేస్తే... క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పైగా ప్రచారంలో ఎన్​ఆర్​ఐలకు అధిక ప్రాధాన్యమిచ్చి ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటుకే పరిమితమైన పార్టీకి ఈ ఎన్నికలు సవాలు విసురుతున్న మాట వాస్తవం. అందుకే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోంది ఆప్​.

బలహీనంగా అకాలీద‌ళ్..

అధికార కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకత, శిరోమణి అకాలీద‌ళ్‌ కోలుకోకపోవడం.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. 2017 నుంచి క్రమంగా పుంజుకుంటున్న ఆప్.. ఈసారి ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొన్ని సంస్థల ముందస్తు సర్వేలు.. గాలి ఆమ్‌ఆద్మీ వైపే వీస్తోందని అంచనా వేశాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

పంజాబ్‌లో శిరోమ‌ణి అకాలీద‌ళ్ సంస్థాగ‌తంగా బలహీనపడుతూ వచ్చింది. భాజపాతో పొత్తు ముగిసిన తర్వాత ఆ పార్టీ ఎవ‌రితో పోరాడుతుందో అర్థం కాకుండా అయింది.

రైతు చ‌ట్టాల‌ను వ్యతిరేకించి భాజపాతో తెగదెంపులు చేసుకున్నా.. రైతుల‌కు ద‌గ్గర కాలేక‌పోయింది. అటు భాజపాకూ దూరమైంది. ఫలితంగా ఈసారి ఎన్నిక‌ల్లో అకాలీద‌ళ్ ప్రభావం పెద్దగా ఉండ‌క‌పోవ‌చ్చని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్‌ఆద్మీకి ఇది బాగా కలిసొచ్చే అంశమే.

సగం మంది కాంగ్రెస్​లోకి..

ఐదేళ్ల క్రితం 20 మంది ఎమ్మెల్యేల‌తో పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్‌ను అధికార కాంగ్రెస్ వ‌ద‌ల్లేదు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయినా క్షేత్రస్థాయిలో పార్టీపై ఓట‌ర్లకు న‌మ్మకం క‌లిగించేలా ప్రయ‌త్నించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. క్రమంగా బలపడుతూ వచ్చింది.

ఇటీవలి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. మొత్తం 14 చోట్ల గెల్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపా 12, కాంగ్రెస్ 8, అకాలీదళ్ ఒక్క చోటే గెలిచాయి. ఈ ఫలితాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ వైపు ప్రజలు మొగ్గుతారన్న సంకేతాలు ఇచ్చాయంటున్నారు విశ్లేషకులు.

ఎన్​ఆర్​ఐల ప్రభావం..

పంజాబ్ ఎన్నికలపై ఎన్​ఆర్​ఐల ప్రభావం అధికంగా ఉంటుంది. ఉచిత విద్యుత్, తాగునీరు, మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు లాంటి హామీలూ ఆమ్‌ఆద్మీకి కలిసొచ్చే అంశాలు అవచ్చు అన్నది మరో విశ్లేషణ. పంజాబ్‌లో నిరుద్యోగ సమస్య ఎన్నికలపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది. రాష్ట్ర యువత కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, భాజపాపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

నిరుద్యోగ సమస్యను ఈ 3 పార్టీలు గాలికొదిలేశాయన్న అసంతృప్తి స్థానికంగా నెలకొంది. ఈసారి రైతు సంఘాలూ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో... ఆప్‌కు రావాల్సిన ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. అయితే... ఆప్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా యువత ఓట్లన్నీ తమకే అన్న ధీమాతో ఉంది.

punjab aap cm candidate channi

టెలీ ఓటింగ్‌ ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక

ఈసారి సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్‌ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రజలతో టెలీ ఓటింగ్‌ నిర్వహించింది. ఇందులో 93శాతం మంది భగవంత్‌ మాన్‌నే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. 48ఏళ్ల భగవంత్‌ మాన్‌.. సంగ్రూర్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆప్‌ పంజాబ్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసిన నేతగా అధిష్ఠానం విశ్వాసాన్నీ సంపాదించుకున్నారాయన. ప్రజలంతా జుగ్నూగా పిలుచుకునే భగవంత్ మాన్​కు... స్థానికంగా మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. పైగా పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతూ పలు సేవా కార్యక్రమాలూ చేస్తుంటారు భగవంత్. ఇది కూడా కలసి వచ్చే అంశమే. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి అరవింద్ కేజ్రీవాల్ మనిషిగా ముద్రపడి పోయింది. డ్రగ్స్ మాఫియాపై నిత్యం నిరసన గళం వినిపించటమూ సానుకూలతల్లో ఒకటి. ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించిన ఆప్‌కు.. ఈ సారి గెలుపు ఖాయమన్న అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇదీ చదవండి: మాల్వా చిక్కితే పంజాబ్‌ దక్కినట్లే.. అన్ని పార్టీల గురి అక్కడే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.