ETV Bharat / bharat

మహిళా కానిస్టేబుల్​కు బెదిరింపులు.. తలపై తుపాకీ​ గురిపెట్టి.. అశ్లీల వీడియోలు తీస్తానంటూ..

author img

By

Published : Dec 26, 2022, 1:34 PM IST

Updated : Dec 26, 2022, 3:14 PM IST

female constable
female constable

మహిళా కానిస్టేబుల్​ తలపై తుపాకీ గురిపెట్టి ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ముఖంపై యాసిడ్​ పోసి.. అశ్లీల వీడియోలను చిత్రీకరించి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఒక్కసారిగా కానిస్టేబుల్​ కేకలు పెట్టగా.. ఆమె స్కూటీకి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిందీ ఘటన.

రాష్ట్ర ప్రజలకు రక్షణ సేవలు అందిస్తున్నఓ మహిళా కానిస్టేబుల్​ బెదిరింపులకు గురైంది. తన ఇంట్లోకి వెళ్లి ఓ యువకుడు ఆమె తలపై తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ముఖంపై యాసిడ్​ పోసి అశ్లీల వీడియోలు తీసి వైరల్​ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయంచింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖ్​నవూలో పోలీస్​ క్వార్టర్స్​లో తన తమ్ముళ్లతో బాధితురాలు నివసిస్తోంది. రాయ్​బరేలికి చెందిన యోగేంద్ర పాండే అనే యువకుడు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. డిసెంబరు 23న నిందితుడు.. బాధితురాలికి ఫోన్​ చేసి ఇంటి బయటకు రమ్మన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తమ్ముళ్లను చంపేస్తానని ఫోన్​లోనే బెదిరించాడు. అయినా ఆమె బయటకు రాలేదు.

వెంటనే ఆమె గదిలోకి చొరబడి బాధితురాలి తలపై తుపాకీ గురిపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే ముఖంపై యాసిడ్​ పోసి.. అశ్లీల వీడియోలు తీస్తానని అన్నాడు. వాటిని సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తానని బెదిరించాడు. ఒక్కసారిగా బాధితురాలు గట్టిగా కేకలు పెట్టింది. దీంతో అతడు ఇంటి బయటకు వచ్చి ఆమె స్కూటీకి నిప్పంటించాడు. గమనించిన బాధితురాలు పోలీసులకు సమచారం అందించింది. పోలీసులు వచ్చినప్పటికే నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్​ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

దళిత యువతిపై గ్యాంగ్​రేప్​.. భాజపా ఎమ్మెల్యే అండతో!
ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​కు చెందిన ఓ దళిత యువతి.. తనపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయింది. తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తుల వెనుక భాజపా ఎమ్మెల్యే ఉన్నారని.. అందుకే పోలీసులు కేసు నమోదు చేయట్లేదని ఆరోపణలు చేస్తుంది. అసలేం జరిగిందంటే?

బాధితురాలి కథనం ప్రకారం..
19 ఏళ్ల దళిత యువతి.. తన తల్లి, అమ్మమ్మతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి, సోదరుడు వేరేచోట పనిచేస్తుంటారు. అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు. బాధితురాలి తల్లి స్వీపర్​గా పనిచేస్తుంది. ఆమె ఎక్కువగా నైట్​ డ్యూటీకి వెళ్తుంటుంది. ఇదే ఆసరాగా తీసుకున్న ప్రదీప్​ సింగ్​, విపుల్​ సింగ్​ అనే ఇద్దరు వ్యక్తులు డిసెంబరు 15వ తేదీ రాత్రి బాధితురాలి ఇంట్లోకి వెళ్లారు. తనను గదిలో బలవంతంగా తీసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెబుతోంది.

యువతి గట్టిగా కేకలు పెట్టగా.. ప్రదీప్​ సింగ్​ పరారయ్యాడు. కుటుంబసభ్యులు విపుల్​ సింగ్​ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. డిసెంబర్ 16న పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. నిందితుడితో రాజీ కుదుర్చుకోమని పోలీసులు సూచించారు. అందుకు బాధితురాలి బంధువులు ఒప్పుకోలేదు.

అయితే తాము ఎంత చెబుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వల్ల.. బాధితురాలి కుటుంబసభ్యులు ఏడీజీని ఆశ్రయించారు. ఆయన జోక్యం చేసుకున్న తర్వాత కేవలం లైంగిక వేధింపులు కేసు మాత్రమే నమోదు చేశారు పోలీసులు. కానీ తర్వాత రోజు బాధితురాలి కుటుంబసభ్యులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ప్రదీప్​ సింగ్​, విపుల్​ సింగ్​.. స్థానిక భాజపా ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారని అందుకే పోలీసులు కేసు నమోదు చేయట్లేని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇద్దరు యువకులు దారుణ హత్య..
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. మృతులను బసవరాజ్​, గిరీష్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని షిండోల్లి గ్రామంలో ఆదివారం రాత్రి మినీ కబడ్డీ టోర్నమెంట్​ జరిగింది. ఆ సమయంలో కొందరు దుండగులు మైదానంలోకి ప్రవేశించారు. వెంటనే అక్కడ ఉన్న ఆటగాళ్లు, స్థానికులు.. వారిని వెళ్లపోమని అరిచారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బసవరాజ్, గిరీష్​ అనే ఇద్దరు యువకులను దుండగులు కత్తితో పొడిచారు. వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Last Updated :Dec 26, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.