3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం

author img

By

Published : Nov 6, 2022, 12:03 PM IST

man sold his land for protest agains adulteration

2000 ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాలకు ఆర్​టీఐ దరఖాస్తులు.. 400 పత్రికా సమావేశాలు.. 12ఏళ్లుగా అలుపెరుగని పోరాటం. ఇది ఓ సామాన్య వ్యక్తి ఆహర కల్తీపై చేస్తున్న రాజీలేని పోరాటానికి సాక్షిగా నిలిచిన మైలురాళ్లు. ఈ పోరాటం కోసం తనకున్న మూడు ఎకరాలను అమ్మి 30 లక్షలు ఖర్చు చేశారు. ఆహార కల్తీపై పోరాటం చేస్తూ.. అశేష భారత ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్న కేరళకు చెందిన జాన్​ పోరాట గాథ తెలుసుకుందాం.

ఆశయం, సంకల్పం, పట్టుదల ఈ మాటలు చెప్పడానికి తేలికే.. కానీ వీటిని ఆచరణలో పెట్టాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలి. భూమాత అంత ఓర్పు, సహనం ఉండాలి. అప్పుడే మన ఆశయం సిద్ధిస్తుంది. ఈ లక్షణాలన్నీ పునికిపుచ్చుకున్నారు కేరళలోని కన్నూర్​కు చెందిన లియోనార్డో డో జాన్ అనే వ్యక్తి. తన స్నేహితుడిని ఓ ప్రాణాంతక వ్యాధి బలితీసుకుందని.. దానికి కారణం ఆహార కల్తీ అని గ్రహించారు. అతడిలా ఎవరూ మరణించకూడదని ఆహార కల్తీపై 12 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పుటివరకు దాదాపు 2 వేలకు పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాల్లో ఆర్​టీఐ దరఖాస్తులు చేశారు. 400 పైగా ప్రెస్​ కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఈ పనులన్నీ చేయడానికి తనకున్న 3 ఎకరాలను అమ్మేశారు. ఇప్పటివరకు 30 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

జాన్​ స్నేహితుడు 12 ఏళ్ల క్రితం కాలేయ సంబంధిత వ్యాధితో మరణించాడు. అతడి మరణానికి దాల్చిన చెక్క, కాసియా మిశ్రమంతో చేసిన పదార్థాలు కల్తీ కావడమే కారణమని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఇలాంటి కారణంతోనే తన తల్లి క్యాన్సర్​ బారిన పడింది. దీంతో అహార కల్తీని అరికట్టడానికి పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారు. అనంతరం దాల్చిన చెక్క, కాసియా, మిరప పొడి కల్తీపై, ఎథియోన్ పురుగులమందు వాడకానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు.

కేరళలోని ఆయుర్వేద మందుల తయారీకి అవసరైమన పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.75 లక్షల చొప్పున ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిందని జాన్ చెప్పారు. కానీ ఎవరూ అలాంటి పరికరాలని కొనుగోలు చేయలేదని ఆరోపించారు. అయితే ఆయుర్వేద మందులు వినియోగించేముందు వాటిని పరీక్షించాలని.. కానీ ఎవరూ అలా పరీక్షించడం లేదని చెప్పుకొచ్చారు.

"ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే కేరళలో 2.70 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. వీరికితోడు ఏడాదికి 50 వేల కొత్త కేసులు వస్తున్నాయి. భారత్​లోకెల్లా కిడ్నీ, కాలేయ వ్యాధులకు సంబంధించిన పేషెంట్లు కేరళలోనే ఎక్కువన్నారు. ఆయుర్వేద మందుల వల్ల వచ్చే కాలేయ వ్యాధులపై ఎర్నాకులంలోని లకేషోర్ ఆస్పత్రి వివిధ పరిశోధనలు చేసింది. 2016-17 సంవత్సరంలో 1440 మంది రోగులను పరీక్షించారు. అందులో ఎక్కువగా ఆయుర్వేద మందులు వాడుతున్న వారికే కాలేయ వ్యాధులు వచ్చాయి. ఆయుర్వేద పదార్థాల్లో పురుగుల మందులు, కల్తీ ఏమైనా ఉన్నాయా అనేది పరీక్షించేందుకు తయారీదారుల వద్ద పరికరాలు లేవు. కేరళ ఆయుర్వేద పరిశ్రమ ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్​ చేస్తోంది."

-- లియోనార్డో డో జాన్, సామాజిక కార్యకర్త

ఈ పోరాటంలో భాగంగా దాదాపు 2 వేల ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాల నుంచి చాలా సమాచారం సేకరించారు.​ అయితే తన పోరాటానికి వస్తున్న స్పందనపై సంతోషాన్ని వ్యక్తం చేశారు జాన్​." సిక్కిం రాష్ట్రం పూర్తిగా ఆర్గానిక్​గా మారిపోయింది. వచ్చే 90 రోజులు ప్రమాదకరమైన పురుగుల మందులు నిషేధించామని తమిళనాడు ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. దీన్ని ఎలా ఆచరణలో పెడతారో వేచిచూడాలి. నేను ఇలా చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను ఓ ఉగ్రవాదిగా చూస్తాయి. అది నన్ను చాలా బాధిస్తుంది. అయితే తమిళనాడు నుంచి వచ్చే అన్ని మసాలా పౌడర్లను నిషేధించడం ఒక మంచి పరిణామం. అనేక మంది ఆహార తనిఖీ అధికారులున్నా.. 50 ఏళ్ల నుంచి కేరళ ఆహార కల్తీపై సరైన తనిఖీలు నిర్వహించలేదు." అని జాన్​ చెప్పుకొచ్చారు.

అయితే 12 సంవత్సరాలుగా జాన్​ చేస్తున్న పోరాటం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఇటీవల జాన్ వేసిన పలు పిటిషన్లను స్వీకరించింది కేరళ హైకోర్టు. ఆహార భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని.. అందుకోసం రూ.160 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. "పోరాటం మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు వస్తాయని నేను అనుకోను. కానీ ఏటా దాదాపు ఓ 20 వేల మందికిపైగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ బారిన పడకుండా అడ్డుకోగలిగాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను" అని జాన్ అన్నారు. ఇప్పుడు కూడా జాన్​ ఆహార కల్తీపై తన పోరాటాన్ని ఆపలేదు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వేల పేజీల సమాచారంతో అధికారులపై అహార కల్తీని అడ్డుకోవాలని ఒత్తిడి తీసుకువుస్తున్నారు. అశేష భారత ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్న జాన్ జీవితం ఎందరికో​ స్ఫూర్తిదాయకం.

ఇదీ చదవండి: హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా?

వైకాపా నేతలు చెప్పినట్లు చేయడం లేదని వాలంటీర్ల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.