ETV Bharat / bharat

లారీతో ఢీకొట్టి మరో పోలీసు హత్య.. గంటల వ్యవధిలో ముగ్గురు బలి

author img

By

Published : Jul 20, 2022, 3:38 PM IST

police constable
పోలీసు హత్య

పోలీసు అధికారులపై హత్యలు కొనసాగుతున్నాయి. అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రక్షకభటులను వాహనంతో ఢీకొట్టి దారుణంగా హత్య చేస్తున్నారు నిందితులు. హరియాణా, ఝార్ఖండ్ ఘటనలు మరువక ముందే గుజరాత్​లో మరో పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

పోలీసులపై వరుస దాడులు వెలుగులోకి వస్తున్నాయి. హరియాణాలో డీఎస్​పీ, ఝార్ఖండ్​లో మహిళా ఎస్సై హత్యలు జరిగిన కొన్ని గంటలకే మరో పోలీసు అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్​ కానిస్టేబుల్​పై నుంచి డ్రైవర్​ ట్రక్కును పోనిచ్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్​ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్​లోని బోర్సాద్​లో అర్ధరాత్రి 1 గంటకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తిని కరణ్​సింగ్​ రాజ్​గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించామని త్వరలోనే అతనిడి అరెస్ట్​ చేస్తామని తెలిపారు.

police constable
కానిస్టేబుల్​ను ఢీకొట్టిన ట్రక్కు

హరియాణాలో దారుణం..: నుహ్​లో అక్రమ మైనింగ్​పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్​పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ మంగళవారం హత్యకు గురయ్యారు. లారీతో ఢీకొట్టి బిష్ణోయ్​ను హత్య చేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు జరిగిన ఎన్​కౌంటర్​లో నిందితుడికి బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలో తూటా దిగిందని హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు. ఈ హత్యకు సంబంధం ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఝార్ఖండ్​..: హరియాణాలో డీఎస్​పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్​లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు. మృతురాలు సంధ్యా టోప్పో తుపుదానా పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్​పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్​స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్​కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : పట్టుబట్టలు.. పూలదండలు.. ఘనంగా కప్పల వివాహం.. వర్షాల కోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.