CM Revanth Reddy Delhi Tour Today : నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళ, దిల్లీలో పర్యంటిచనున్నారు. తొలుత ఆయన ఇవాళ మధ్యాహ్నం కేరళలోని కోజికోడులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ కమిటీ ఏర్పాటు చేయనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అక్కడ నుంచి నేరుగా సీఎం దిల్లీకి బయల్దేరుతారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ (తెలంగాణ దశాబ్ది) వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రేవంత్రెడ్డి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.