ఇంటికి కంచె వేసిన వైసీపీ నేత - ఖాళీ చేయాలంటూ మహిళలకు బెదిరింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 10:57 AM IST
YSRCP Leaders Fenced House to Encroach Land: ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికార పార్టీ నేతలతో పాటు వారి బంధువుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మున్సిపల్ ఛైర్మన్ బంధువు తమ స్థలాలు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన రహదారిలో గుండ్లకమ్మ సమీపంలో నాగమ్మ, రమణమ్మ అనే ఇద్దరు మహిళలకు చెరో 60 గజాల స్థలం ఉంది. అందులో రేకుల షెడ్డు వేసుకొని 25 ఏళ్లుగా ఉంటున్నారు. ఆ స్థలం చివరలో మున్సిపల్ ఛైర్మన్ బాలమురళికృష్ణ బంధువు ఆర్. శ్రీనివాసులుకు భూమి ఉంది.
దీంతో వారిద్దరి స్థలాలు కలిపేసుకోవాలని 5 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా 16 అడుగుల మేర కంచె వేశారు. బాధిత మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొలతలు తీసుకోవడానికి వచ్చిన సర్వేయర్ను మున్సిపల్ ఛైర్మన్ సర్వే చేయకుండా అడ్డుకున్నారని మహిళలు వాపోయారు. చెరో 2 లక్షల రూపాయలు ఇస్తాను వాటిని తీసుకొని స్థలాన్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.