అందని రేషన్ బియ్యం - ఇబ్బందులు పడుతున్న ప్రజలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:50 PM IST
No Rice to Ration Beneficiaries in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలో ప్రభుత్వ చౌక బియ్యం అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. 14వ తేదీ వచ్చినా ఈ నెలకు రావాల్సిన బియ్యం రాలేదని వాపోతున్నారు. అగలి మండలంలో దాదాపు వెయ్యి మంది రేషన్ కార్డ్ దారులు చౌక బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. తూతూ మంత్రంగా వచ్చిన వాహనాలు మళ్లీ రాకపోవడంతో లబ్ధిదారులు బియ్యం షాప్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశంపై డీలర్లను సంప్రదించగా, తమ వద్ద ఉన్న బియ్యం మొత్తాన్ని ఎండీయూ ఆపరేటర్లకు అప్పగించామని చెబుతున్నారు. తమకు కేటాయించిన బియ్యం మొత్తం పంపిణీ చేసినట్లు డీలర్ల్ పేర్కొన్నారు. తమ వద్ద ఎలాంటి బియ్యం నిల్వలు లేవని ఎండియు ఆపరేటర్ తెలిపారు.
బియ్యం కోసం వెళ్లిన లబ్ధిదారులకు వివిధ రకాల సాకులు చెబుతూ వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బియ్యం పంపిణీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని, తమకు రావాల్సిన బియ్యాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామన్నా స్పందన లేదని ఆరోపించారు. పాత పద్దతి ద్వారా బియ్యాన్ని ఇవ్వాలని, డిమాండ్ చేశారు. కొత్త విధానంలో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.