ఓట్ల తొలగింపులో ఇదేం మూస ధోరణి- ఎన్నికల అధికారులపై హైకోర్టు మండిపాటు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 10:21 AM IST

thumbnail

High Court On Vote Violation In Bapatla District : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు ఎన్నికల అధికారులు జారీచేసిన ఉత్తర్వులు మూస ధోరణిలో ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటరు జాబితా (Voter List) నుంచి పేర్లు తొలగించడానికి గల కారణాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించి. తదుపరి విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది. ఫారం-7లను ఆధారం చేసుకొని, తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బి.గౌతమి, మరి కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  

స్థానిక గ్రామానికి చెందిన వారిమేనని రుజువు చేసుకునేందుకు ఆధార్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతా పుస్తకాలను ఈఆర్వో (ERO), బూత్‌ స్థాయి అధికారులకు అందజేశామన్నారు. వాటిని పట్టించుకోకుండా, ఓటరు జాబితా నుంచి తమ పేర్లను తొలగించారన్నారు. ఎన్నికల సంఘం (Election Commission) తరఫున న్యాయవాది శివదర్శన్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. చట్ట నిబంధనలను అనుసరించి ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ మీరిచ్చిన ఉత్తర్వులు ఒకే తరహాలో మూస ధోరణిలో ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఏ కారణంతో పేర్లను తొలగించారో వివరణ ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.