తప్పించుకుని తిరుగుతున్న పీఎఫ్ఐ నాయకుడు అరెస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 10:04 PM IST
PFI Leader Arrested in YSR District : తప్పించుకుని తిరుగుతున్న పీఎఫ్ఐ (Popular Front Of India) నాయకుడు అబ్దుల్ సలీం వైఎస్సార్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఎన్ఐఏ (National Investigation Agency) పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సలీం కోసం ఎన్ఐఏ అధికారులు వెతుకుతున్నట్లు తెలిసింది. 20 రోజుల క్రితం మైదుకూరు ప్రాంతానికి సలీం చేరుకున్నట్లు పసిగట్టిన ఎన్ఐఏ అధికారులు శనివారం (మార్చి 2న) చెర్లోపల్లి వద్ద అతన్ని అరెస్ట్ చేశారు.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల దర్యాప్తులో భాగంగా గత సంవత్సరంలో ఎన్ఐఏ పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల్లో అబ్దుల్ సలీం ఒకరు. గత కొంతకాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్న అబ్దుల్ సలీంను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు.