నా ఆటోబయోగ్రఫీ రాయనున్న యండమూరి వీరేంద్రనాథ్ - స్వయంగా వెల్లడించిన మెగాస్టార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 10:56 PM IST
Autobiography of Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆటో బయోగ్రఫీని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాయనున్నారు. దీనికి సంబంధించిన అనుమతిని ఆయనకు ఇస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. విశాఖలో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానం చేసిన వేదికపై చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ, ఎవరికి వారే రాసుకునేది ఆటో బయోగ్రఫీ అవుతుందని తెలిపారు. కానీ తనకు అంత సమయం లేదని, గతంలో ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్ తన ఆటో బయోగ్రఫీ రాసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారని చెప్పారు. అయితే ఆ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నానని సభ వేదికగా చిరంజీవి వెల్లడించారు.
ఎన్టీఆర్, హరివంశరాయ్బచ్చన్ల పుణ్యతిథి, ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా విశాఖలో లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోక్నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులగా సినీనటుడు చిరంజీవి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ.శేషసాయిలు హాజరయ్యారు. అనంతరం పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ను లోక్నాయక్ సాహిత్య పురస్కారంతో పాటు రూ.2 లక్షల రూపాయల నగదుతో సత్కరించారు. అదేవిధంగా బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాధాకృష్ణంరాజు, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కవి విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లినికి పురస్కారాలు లభించాయి. వీరికి చెరో రూ. 50 వేల చొప్పున నగదుతో పాటు లోక్నాయక్ పురస్కారాలతో సత్కరించారు. గత 19 ఏళ్లుగా లోక్నాయక్ ఫౌండేషన్ ఈ పురస్కారాలను అందిస్తోంది.