ETV Bharat / state

వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:45 AM IST

YSRCP Leaders Attacks on Priests : వైసీపీ నేతలు అధికార మదంతో అర్చకులపై దాడులకు తెగబడుతుండటంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతుండటంపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా కాకినాడలో ఘటనతో వైసీపీ నేతల తీరు మరోసారి చర్చనీయాంశమైంది.

YSRCP_Leaders_Attacks_on_Priests
YSRCP_Leaders_Attacks_on_Priests

అర్చకులపై ఆగని వైసీపీ దాడులు

YSRCP Leaders Attacks on Priests : అర్చకులు, పురోహితులపై వైసీపీ నేతలు రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అధికార గర్వంతో అర్చకులను దుర్భాషలాడుతూ, దాడులు చేస్తున్నారు. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా అధికార పార్టీ నేతల్లో మార్పు లేదు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నాలే చేస్తుండటంతో ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి.

రెండురోజుల క్రితం కాకినాడలోని పురాతన శివాలయంలో వైసీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావు ఇద్దరు అర్చకులపై దాడిచేయడంతో మరోసారి అధికార పార్టీ నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబరులో పూజారులపై ఆలయ ఛైర్మన్‌ తదితరులు చర్నాకోలాతో వాతలు పడేలా కొట్టారు. కార్తికపౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా, భక్తులకు ఉచిత దర్శనాలకూ అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణిశర్మ, సుధాకర్‌శర్మ, మురుగు ఫణిశర్మ సూచించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులు కలిసి పూజారులపై దాడిచేశారు.

వైఎస్సార్సీపీ నేతల అహంకారం - మన సంస్కృతిని చిన్న చూపు చూస్తున్నారు: చంద్రబాబు - YSRCP Leader Attack on Priest

ఉత్సవాల్లో వినియోగించే చర్నాకోలాతో పూజారులను ఇష్టానుసారం కొట్టారు. ఆలయ ఛైర్మన్‌తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్‌ చేసినా, మళ్లీ కొంత కాలానికే నాగరాజుకు వేరొక ఆలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్ర పవన్‌పై ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ భర్త యుగంధర్‌ గతేడాది ఆగస్టులో దాడిచేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్‌ను పక్కకు జరగాలని చెప్పినందుకు దురుసుగా వ్యవహరించి, దాడిచేసి, మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. ఆలయ ఛైర్మన్‌తో ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు.

గుంటూరులోని గోరంట్లలో పద్మావతీ ఆండాళ్‌ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు సాయిచరణ్‌పై గతేడాది సెప్టెంబరులో అధికారపార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్‌ లక్ష్మీనారాయణ దాడిచేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి, కర్రతో దాడిచేయడంపై అర్చకుడు సాయిచరణ్‌ సెప్టెంబరు 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైసీపీ నేతలను అరెస్టు చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదుచేసి, ఇద్దరినీ అరెస్టు చేశారు.

అర్చకుల విషయంలో దేవాదాయశాఖ అధికారులు కూడా చులకనగా వ్యవహరిస్తూ వారిని వేధించే ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశానికి ముఖ్య అర్చకుడు అంజన్‌ కుమార్‌ హాజరుకాగా, ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని ఈవో శ్రీనివాసరెడ్డి రుసరుసలాడారు. ఈవో తీరును నిరసిస్తూ అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest

చివరకు దేవాదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ అక్కడికి వెళ్లి రాజీ చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో గతేడాది అక్కడ పనిచేసిన ఈవో గోపి కొత్తగా వివిధ పూజలను ఆరంభించారు. అర్చనలు, పూజలను తాను చెప్పినప్పుడే చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు. ఇవి సాంప్రదాయానికి విరుద్ధమని అర్చకులు అభ్యంతరం చెప్పారు. ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. చివరకు ఈవోని అక్కడి నుంచి బదిలీచేశారు.

అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో గతేడాది ఇంఛార్జ్‌ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్‌ పురోహితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారాయి. ఆలయ సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునేవారికి సింగిల్‌విండో విధానంలో దేవస్థానం తరఫునే అన్నీ సరఫరా చేస్తామని ఈవో తెలిపారు. ఇందుకు అవసరమైన పురోహితుల సరఫరా కోసం గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానించడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది.

పురోహితుల కోసం వేలం నిర్వహిస్తారా? అంటూ అర్చకులు, పురోహితులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అన్నవరం కొండపై ఉండే పురోహితులు కాకుండా బయటి నుంచి పురోహితులను తీసుకొస్తే వివాహానికి 5వేలు, ఉపనయనానికి 2వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన తెచ్చారు. దీనిపై ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్నీ ఉపసంహరించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.