ETV Bharat / state

అధికారమే లక్ష్యం - రాజకీయ నాయకుల అక్రమాలు - అడ్డుకట్ట వేయనున్న సీ-విజిల్​ - C Vigil App Importance

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 2:12 PM IST

C-Vigil App Usage And Details: దేశ ప్రజల భవిష్యత్‌ను అభివృద్ధిని నిర్దేశించేవి సార్వత్రిక ఎన్నికలు. ప్రపంచ ప్రజాస్వామ్యంలోనే ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. 2024 సార్వత్రిక సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను ఒడ్డుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలూ సహజమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతంగా మారిన ఈ ఉల్లంఘనలను అరికట్టేందుకు సరికొత్త సాంకేతికతతో కేంద్ర ఎన్నికల సంఘం సీ- విజిల్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిస్తే చాలు 100 నిమిషాల్లో చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించింది. ఇందులో పౌరులే ఫిర్యాదుదారులు అవ్వడం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.

c vigil idi sangati
c vigil idi sangati

ఎన్నికల ఉల్లంఘనలు అరికట్టేలా సీ-విజిల్​ యాప్​- ఫిర్యాదుపై 100నిమిషాల్లో చర్యలు

C-Vigil App Importance in Elections : మీ కళ్లముందు ఏదైనా ఎన్నికల ఉల్లంఘన జరుగుతుందా. రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రలోభ పెడుతున్నారని మీకు తెలిసిందా. ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారా. మద్యం, మత్తుపదార్థాలు పంచుతున్నట్లు గ్రహించారా. అనుమతి లేని వాహనాలను ప్రచారానికి వినియోగిస్తున్నారా. సమయం ముగిసినా ప్రచారం చేస్తున్నారా. ఎన్నికల సమయంలో అధికారులు బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తున్నారా. ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకుంటున్నారా. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారా. ఇలాంటిది ఏదైనా జరిగితే దానిని సీ- విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయండి. దానిపై విచారణ జరిపి వంద నిమిషాల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటామంటోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు సజావుగా సాగేలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ నాయకులందరూ పాటించేలా ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కానీ ఈసీ దృష్టికి రాని ఎన్నికల ఉల్లంఘనలు అనేకం ఉంటాయి. వాటన్నింటిని తెలుసుకునేలా అందులో ఓటర్లను, పౌరులను భాగస్వామ్యం చేసేలా ఈసీ రూపొందించిందే సీ-విజిల్‌ మొబైల్‌ యాప్‌. పౌరులెవరైనా ఎన్నికల ఉల్లంఘనలు జరుగనున్నాయని గ్రహించి ఈ యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు దానిపై వీలైనంత త్వరలో చర్యలు తీసుకునేలా సీ-విజిల్‌ యాప్‌ను రూపొందించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన సమగ్ర వివరాలతో దీని ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. అందుకు మొదటగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఎన్నికల సంఘం వారి సీ-విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత మొబైల్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే సీ-విజిల్‌ యాప్‌ సిద్ధమైనట్లే. దాని ద్వారా ఎన్నికల ఉల్లంఘనలను ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.

'నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం' - సీఈసీ రాజీవ్ కుమార్​

సీ-విజిల్‌ యాప్‌ ద్వారా పౌరులు ఫిర్యాదు చేసేటప్పుడు కచ్చితమైన ఫొటో, వీడియో రూపంలో సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొబైల్‌లో యాప్‌ను ఓపెన్ చేయగానే ఫొటో, వీడియో, ఆడియో అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫొటో ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీ లొకేషన్‌ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఏ రాష్ట్రం, నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించాలి. ఈ ఫిర్యాదు నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల సంఘానికి చేరుతుంది. యాప్‌లో వివరాలు పొందుపర్చిన 5 నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారి దానిని ఫీల్డ్‌ యూనిట్‌కు పంపిస్తారు. వారు 15నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి తెలియజేస్తారు. ఎన్నికల అధికారి దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా మొత్తంగా 100 నిమిషాల్లో సీ-విజిల్‌ యాప్‌లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు స్టేటస్‌ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

'ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు'- కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

2018లో అమల్లోకి వచ్చిన సీ- విజిల్‌ మొబైల్‌ యాప్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లఘనలకు సంబంధించి పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందగా సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎన్నికల అధికారులు వాటిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ 7వేలకు పైగా ఫిర్యాదులు సీ- విజిల్‌ ద్వారా అందినట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఇందులో దాదాపు 90శాతం ఫిర్యాదులకు నిర్ణీత 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల నిబంధనలకు సంబంధించి కాల్‌ సెంటర్‌ ద్వారా కూడా 44 వేల 282 ఫిర్యాదులు అందాయని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. లోక్‌సభ షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి మార్చి 20వరకు ఆంధ్రప్రదేశ్‌లో 1300 సీ- విజిల్‌ ఫిర్యాదులు అందినట్లు ఏపీ సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అందులో 74శాతం ఫిర్యాదులపై నిర్ణీత 100నిమిషాల్లో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా 95శాతం ఫిర్యాదులపై 100నిమిషాల్లోనే పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మిగతా ఫిర్యాదులపై విచారణకు పలు విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉందని ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

లోక్​సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు​- భద్రతా దళాల తరలింపు, మోహరింపుపై మీటింగ్- షెడ్యూల్​పై క్లారిటీ!

2023లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో సీ- విజిల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 77,623 ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. వీటిలో అత్యధికంగా రాజస్థాన్‌ నుంచి ఫిర్యాదులు అందగా అత్యల్పంగా మిజోరం నుంచి కేవలం 17 ఫిర్యాదులు మాత్రమే అందాయి. మొత్తం 77,623 ఫిర్యాదుల్లో 83శాతం ఫిర్యాదులను నిర్ణీత 100నిమిషాల సమయంలోనే పరిష్కరించారు. ఈ ఫిర్యాదుల్లో 44.5శాతం అంటే 21,509 ఫిర్యాదులు అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినట్లు, విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించినవి 1105 ఉన్నాయి. సమయం ముగిసినా ప్రచారాలపై 2,220 ఫిర్యాదులు, డబ్బు, మద్యం పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు 5,819 ఫిర్యాదులు, వస్తువులు, ఇతర సామగ్రి పంపిణీపై అత్యధికంగా 50శాతం ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.

రాజకీయ పార్టీల హామీలపై ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు- నోటిఫికేషన్​పైనా క్లారిటీ!

పౌరులే ఫిర్యాదుదారులుగా నిమిషాల్లోనే చర్యలు తీసుకునేలా రూపొందించిన సీ-విజిల్‌ యాప్‌ సత్ఫలితాలను ఇస్తోంది. అధికారమే లక్ష్యంగా రాజకీయ నాయకులు చేసే అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో కీలకపాత్ర పోషిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రలోభాలకు పాల్పడి అక్రమంగా ఓట్లు సాధించి అధికార పీఠం ఎక్కాలనుకునే అరాచక రాజకీయ పార్టీలకు ఈ యాప్‌తో చరమగీతం పాడొచ్చు. ఈ నేపథ్యంలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన కనిపిస్తే ఫిర్యాదు చేయండి. అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. దేశ, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం పౌరులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్నికల పరిశీలకులకు సీఈసీ శిక్షణ- నాలుగు రోజుల్లో షెడ్యూల్ ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.