ETV Bharat / state

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 12:12 PM IST

Updated : Feb 10, 2024, 4:28 PM IST

Telangana Budget 2024 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Telangana Budget 2024
Telangana Budget 2024

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Telangana Budget 2024 : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు.

Telangana Vote On Account Budget 2024 : మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్న ప్రజలకు మనస్ఫూర్తిగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు.

ఆరు గ్యారంటీలకే బడ్జెట్​లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?

పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం ఎంతటి సాహసమైనా చేస్తుందని తెలిపారు. నిస్సహాయులకు సహాయం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.

శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు

  • రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
  • ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
  • పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774కోట్లు
  • పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
  • వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
  • ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
  • బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
  • విద్యా రంగానికి రూ.21389కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11500 కోట్లు
  • గృహజ్యోతికి రూ.2418 కోట్లు
  • విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
  • నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు

"దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి రెండు లెదర్‌ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్‌ ప్రణాళిక రచిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తాం. ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం." - భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు కేటాయింపు

గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్థిక కష్టాలు వచ్చాయని, కానీ తమ ప్రభుత్వ లక్ష్యం సంతులిత వృద్ధి అని భట్టి స్పష్టం చేశారు. ఆర్భాటాలు, ఆకర్షణలకు దూరంగా తమ ప్రభుత్వం ఉంటుందన్న ఆయన రుతుపవనాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని చెప్పారు. వ్యవసాయ రంగంలో క్షీణత ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని, వ్యవసాయంలో వృద్ధిలేమి ఇతర రంగాలపై పడిందని తెలిపారు. దీనివల్ల ఆహార పంటలు, వాణిజ్య పంటల్లో దిగుబడులు తగ్గాయని పేర్కొన్నారు.

"ధరణి కొందరికి భరణం. మరికొందరికి ఆభరణం. చాలామందికి భారం. ధరణి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకుంటాం. ధరణి పోర్టల్‌ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశాం. వ్యవసాయరంగంలో త్వరలో నూతన విత్తన విధానం తీసుకువస్తాం. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం. ప్రధాని పసల్‌ బీమా ఆధారంగా రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం." - భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి అన్నారు. సకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామన్న ఆయన పైలట్‌ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత విద్యామండలి సంపూర్ణ ప్రక్షాళనకు కృషి చేస్తామని తెలిపారు.

త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్​ క్యాలెండర్​ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ కాదు - వాస్తవిక బడ్జెట్ : సీఎం రేవంత్​

Last Updated :Feb 10, 2024, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.