ETV Bharat / state

లోక్‌సభ బరిలో వారసుల గెలుపే లక్ష్యంగా సీనియర్లు - తోడుగా కదిలొస్తున్న బంధుగణం - FAMILY CAMPAIGNING IN TS ELECTIONS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 12:50 PM IST

Election Campaign In Telangana
Family Members Election Campaign

Political Leader Family Members Election Campaign : ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్‌ నేతలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు. వారి రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాలని శ్రమిస్తున్నారు. మొన్నటి దాకా వారసులకు టికెట్లు ఇప్పించడంలో కష్టపడిన వారు ఇప్పుడు వారి గెలుపు కోసమూ కృషి చేస్తున్నారు. పగలు ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు.

Family Members Election Campaign In Telangana : రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్‌ నేతల కుమారులు తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎండను కూడా లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగినందున ఓటమి పాలైతే వారి రాజకీయ ప్రస్థానంపై నీలినీడలు పడే ప్రమాదముందని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నుంచి ఆశించకుండా సొంతంగా పెద్దఎత్తున డబ్బులను సైతం ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నాయకులను కలుస్తూ గెలుపుకు సహాయపడాలని కోరుతున్నారు.

Loksabha Election Campaign In Telangana : నల్గొండలో సీనియర్‌ నేత అయిన జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్‌ కొడుకు గడ్డం వంశీకృష్ణకు వరంగల్‌లో ఎమ్మెల్యే కడియం కూతురు కావ్యకు, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సతీమణి సునీతకు కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్లు ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్​కు చెందిన సిటింగ్‌ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కొడుకు భరత్‌కు లోక్‌సభ టికెట్‌ ఇప్పించుకున్నారు. ఇదే నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి కూడా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సోదరుడు.

వీరిలో ఎక్కువ మంది అధికార కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతో పాటు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలుస్తున్నందున ఈ స్థానాలపై పార్టీ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆరోగ్య కారణాలతో కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం ఎండలను కూడా లెక్క చేయకుండా కుమారుడి విజయం కోసం నల్గొండ కేంద్రంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. బుధవారం సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు సైతం వెళ్లి తన కుమారుడి విజయానికి మద్దతివ్వాలని వారిని కోరారు.

ఆకట్టుకునే హామీలతో ఓట్లవేట కొనసాగిస్తున్న ఎంపీ అభ్యర్థులు - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Election Campaign

తామే అండదండలుగా : మరో సీనియర్‌ నేత వివేక్‌ తన కుమారుడి గెలుపు కోసం పగలనకా రాత్రనకా శ్రమిస్తున్నారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఎమ్మెల్యే కావడంతో అన్నదమ్ములిద్దరూ తమ వారసుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక సీనియర్‌ నేత కడియం శ్రీహరి వైద్యురాలైన తన కూతురు కావ్యను రాజకీయాల్లో వేలుపట్టి నడిపిస్తున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ బీఆర్ఎస్​లో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినందున ఈ పార్టీ నేతలందరినీ కలుపుకొని పోవడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న సునీతారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. దీంతో ఆమెకు ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవముంది. అయినా ఆమె భర్త పట్నం మహేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ నేతలను కలుస్తూ భార్య విజయం కోసం కష్టపడుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ బీజేపీ అభ్యర్థి భరత్‌ ఇప్పటికే కల్వకుర్తి మండల జడ్పీటీసీ సభ్యుడు. రాజకీయాలకు కొత్త కాకున్నా లోక్ సభ ఎన్నికలు కావడంతో ఆయన తండ్రి, ప్రస్తుత ఎంపీ రాములు అండగా నిలుస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గం అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సమాహారం. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఓటర్లను చేరడం కష్టంతో కూడుకున్నది. దీంతో కుటుంబసభ్యులు, బంధుగణాన్ని రంగంలోకి దించుతున్నారు. రోజూ తలో దిక్కుకెళ్లి ప్రచారం చేసేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా ఆయన సతీమణి వినీలారావు, కుమారులు వినీత్‌రావు, వినయ్‌రావు ప్రచారంలో పాల్గొంటున్నారు.

కుటుంబసమేతంగా రంగంలోకి : ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా తమ ఇద్దరు కుమారులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. డప్పు వాయించడంలో నేర్పరి అయిన పెద్ద కుమారుడు విప్లవ్‌కుమార్‌, గాయకుడైన చిన్న కుమారుడు సాయుధ విజయ్‌కుమార్‌ ప్రచారంలో వారి కళలను ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వరంగల్‌ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌కు ఆయన బామ్మర్ది సుదర్శన్‌ భుజం కాస్తున్నారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపుకోసం ఆయన సతీమణి జమున, కోడలు క్షమిత ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలను చూసుకునే వీరు ఈటెల గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డికి సతీమణి సీతారెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా ఉంటారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఆయన కొడుకు ఆర్యన్‌రెడ్డి సైతం ప్రస్తుతం విరామం తీసుకుని రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరఫున ఆయన సతీమణి సంగీతారెడ్డి క్షేత్రస్థాయి ప్రచారం చేస్తున్నారు. వ్యాపార కార్యక్రమాలతో నిత్యం తీరికలేకుండా ఉండే ఆమె ప్రస్తుతం మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు గడపగడపా తడుతున్నారు.

ఫుల్ స్వింగ్​లో ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం - జెండా పాతేయాలని ప్రధాన పార్టీల ఆరాటం - ADILABAD ELECTION CAMPAIGN 2024

రాష్ట్రంలో జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం - ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్న అభ్యర్థులు - Election Campaign In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.