ETV Bharat / state

కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది: ప్రధాని

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:33 AM IST

Updated : Mar 5, 2024, 12:47 PM IST

PM Modi Telangana Tour
PM Modi Sangareddy Tour Live Updates Today 2024

PM Modi Sangareddy Tour Live Updates Today 2024 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు రాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని ప్రధాని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లాకు బయలదేరారు. పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు, అశేష జనవాహిని మధ్య ర్యాలీగా మోదీ చేరుకున్నారు.

12:26 PM

కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది: ప్రధాని

నాణేనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్‌ ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయైట్లు ప్రజలందరికీ అర్థమైందని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. అనంతరం నేనే మోదీ కుటుంబం అని సభికులతో నినాదాలు చేయించిన ప్రధాని, తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని ప్రధాని ఉద్ఘాటించారు. కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేసినట్లు తెలిపిన ప్రధాని, తెలంగాణలో మాదిగల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

12:20 PM

140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం: ప్రధాని మోదీ

'అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో, నాపై కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువ. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారు. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. వారి అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా, ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వను. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం.' అని మోదీ వ్యాఖ్యానించారు.

12:12 PM

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ: ప్రధాని

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ అని ప్రధాని ఉద్ఘాటించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబపార్టీలు పాలించాయని, అవి ఉన్నచోట కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని మోదీ విమర్శించారు. కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్‌ ఉందా అని ఆయన ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు, కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా యువతకు అవకాశాలు దొరకట్లేదని ప్రధాని మోదీ వివరించారు.

12:05 PM

ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారు: ప్రధాని

'నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను, ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడు.' అని ప్రధాని పటాన్​చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ఇప్పటికే భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని ప్రధాని అభివర్ణించారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు హామీ అమలు చేశామన్న ప్రధాని, ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగిందన్నారు.

11:50 AM

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లు చేపట్టారు: కిషన్‌రెడ్డి

కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్ స్థానంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, మార్పు వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. కానీ తెలంగాణలో ఏరకమైన మార్పు కనిపించట్లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు. అదేమాదిరిగా కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లు చేపట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలకు ఎంఐఎం జత కలిసిందని కేంద్రమంత్రి విమర్శించారు. మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకున్నాయని దుయ్యబట్టారు. నిజమైన మార్పు కోసం కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని, ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గులాబీ పార్టీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూసిందన్న ఆయన, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తోందన్నారు. బీజేపీ ఒక్కటే ప్రజల కోసం పనిచేసే పార్టీనని పేర్కొన్నారు. మరోసారి మోదీ హ్యాట్రిక్‌ ప్రధాని కాబోతున్నారని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

11:28 AM

దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుంది: ప్రధాని

140 కోట్ల దేశ ప్రజలు వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని సభా వేదికగా ప్రధాని ఉద్ఘాటించారు. వికసిత్‌ భారత్‌ కోసం మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకం. మౌలిక సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని ప్రధాని తెలిపారు. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. దీనివల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుందని ప్రధాని వివరించారు. దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

11:15 AM

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషిచేస్తోంది: ప్రధాని

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ప్రధాని వివరించారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన పనులను ఒకొటకటిగా వివిరించారు. వాటిలో ప్రధానంగా బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసర్చ్‌, ఇది దేశంలోనే మొదటి సివిల్‌ ఏవియేషన్‌ రీసర్చ్‌ కేంద్రంగా ప్రధాని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌, తెలంగాణకు గుర్తింపు వస్తుందన్నారు. ఏవియేషన్‌ కేంద్రం స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని, పలు కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టామని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కోవలోనే ఘట్‌కేసర్‌-లింగంపల్లి ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసు మొదలైందని ప్రధాని గుర్తు చేశారు.

11:08AM

తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయరహదారులు రెండు రెట్లు పెరిగాయని తెలిపారు. పదేళ్లలో మరో 2500 కి.మీ మేర జాతీయరహదారుల నిర్మాణం జరిగిందని కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టిందన్న కేంద్రమంత్రి, ఇప్పటికే 3 వందేభారత్‌ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్‌ ప్లాంటు మంజూరు చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైలు కోసం సర్వే జరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

10:57AM

రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో ప్రధాని మోదీ పర్యటించారు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. సభా వేదికగా పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తంగా రూ.9,021 కోట్ల రూపాయల పనులకు మోదీ వర్చువల్​గా చేయనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, కొండా సురేఖ ఇతర నేతలు పాల్గొన్నారు.

10:25AM

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు రాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని ప్రధాని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో హెలికాప్టర్‌లో సంగారెడ్డికి ప్రధాని బయలుదేరనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.

Last Updated :Mar 5, 2024, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.