హైదరాబాద్‌లో కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు - ఆక్రమణదారులపై కొరవడిన చర్యలు - Encroaching ponds and Lakes

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 10:59 PM IST

Encroached ponds and canals in Hyderabad
హైదరాబాద్‌లో కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు - చర్యలు మాత్రం శూన్యం ()

Encroached ponds and canals in Hyderabad : కబ్జా! ఈ పేరు వింటే చాలు ప్రభుత్వ భూమో, పొరంబోకు స్థలమో, పేదల భూమో అక్రమార్కుల కన్నుపడి ఆక్రమణలకు గురైందని తరచూ వింటుంటాం. అధికారుల అండదండలతో పేట్రేగి పోయే కబ్జాకారులు కంటికి కనిపించిన దేనిని వదలరు. ఈ క్రమంలో చెరువులు, నాలాలనూ వదలని అక్రమార్కులు, వాటినీ కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికిరాత్రే చెరువులను మట్టితో నింపేస్తూ వాటిల్లోనే భారీ భవనాలు, విల్లాలు నిర్మించేస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తూ అడిగిన వారిని అణదొక్కడం, అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరించడం వారికి వెన్నతో పెట్టిన విద్యే. అక్కడక్కడ అధికారులు, ప్రశ్నించినా నీటిపారుదల శాఖ కేసులు బుక్‌ చేసినా ఫలితం అంతంత మాత్రమే. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలతో హైదరాబాద్‌ మహానగరంలోని వందలాది చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యా యి. మరి దీనిపై చర్యలే లేవా ? హైదరాబాద్‌లో కబ్జాల తీరు ఎలా ఉంది.? ఏం చేస్తే ఆక్రమణలు అరికట్టవచ్చు.?

చెరువుల కబ్జా ఇంకెంత కాలం?

Encroached ponds and canals in Hyderabad : సాగు, తాగు నీటిని అందించడంలో చెరువులు కీలకం. కానీ, ఆ చెరువులే కబ్జాకు గురవుతున్న వైనం. చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన నాటి రాజులు, పాలకులు వాటి సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటే నేటి కబ్జాదారులు మాత్రం మాకు అవేవి పట్టవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భూములకు అధిక ధరలుండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కబ్జాదారులు విశ్వరూపం చూపిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే నగరంలో ఏ చెరువు చూసినా ఆక్రమణల చెరలో చిక్కిశల్యమవుతోంది.

ఆక్రమణలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటిపై చర్యలు అంతంతమాత్రమే. ఆయా శాఖల్లోని అధికారులు, రాజకీయ నేతల అండదండలతో కబ్జాదారులు వందల కోట్ల విలువైన చెరువుల స్థలాలను ఆక్రమిస్తున్నారు. వాటిల్లో కొద్దిరోజుల్లోనే అనధికారికంగా వెంచర్లు వేసి ఇంటి స్థలాల కింద అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కబ్జాలకు గురైన, గురవుతున్న చెరువులు, నాలాలను వివరాలు విస్తుపోయేలా చేస్తాయి.

నగర శివారు పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఏదుల నాగులపల్లి వద్ద గల 12 ఎకరాల నాగులకుంట చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురైంది. చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ దీనిపై పోలీసు శాఖ విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే నియోజకవర్గంలోనే ఖాజీపల్లి వద్ద విశాఖ వారి చెరువు 4 ఎకరాలు ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

చెరువులో మట్టి నింపే ప్రయత్నం : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మామిడికుంట చెరువులో ఏడాది కిందట ఓ వ్యాపారి ఎకరా భూమి కబ్జా చేశాడు. అది మరవకముందే అదే వ్యాపారి అదే చెరువులో 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు రాత్రికి రాత్రే 20 ప్రొక్లెయిన్లు, 40 టిప్పర్లతో ఆస్థలాన్ని మట్టితో నింపేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో వారిని రౌడిలతో బెదిరించారు. శంషాబాద్‌ పోలీసులు స్పందించి 2 లారీలు, ఒక టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

కాటేదాన్‌ బాబుల్‌ రెడ్డినగర్‌లో నర్సబాయికుంట రెండేళ్ల కిందటి వరకు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. మామిడి కుంటను ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యాపారితో పాటు మరికొందరు రెండేళ్లలో ఈ చెరువు మొత్తాన్ని మట్టితో పూడ్చి అనధికారిక వెంచర్‌ను వేసి ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయించారు. ఇదే కాటేదాన్‌లోని అప్పాచెరువు గతంలో 39 ఎకరాల్లో ఉండేది. కానీ, అక్రమార్కులు వలలో పడిన చెరువు 12 ఎకరాలే మిగిలింది. ఇక్కడే అనేక ఇళ్లను కూడా నిర్మించారు.

వెంచర్ల కోసం : చుట్టూ కాంక్రీణ్‌ అరణ్యాలు పరుచుకోవడంతో వానాకాలంలోనూ చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితులు లేకుండా పోతు‌న్నాయి. అదే అదునుగా నీళ్లు లేని చెరువులను మూసేస్తే భవిష్యత్​లో వెంచర్లకు ఉపయోగపడుతుందన్న ముందస్తు అంచనాతో కొందరు అక్రమార్కులు దుండిగల్‌ మండలంలోని లక్కకుంట చెరువును మట్టితో కప్పేస్తున్నారు. అక్కడ ఎకరా విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుందని, ఈ లెక్కన 8.30 ఎకరాల విస్తీర్ణమున్న చెరువు విలువ రూ.83 కోట్లు ఉంటుందని అంచనా.

చెరువు సమీపంలోకి ఎవరూ రాకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. చెరువును పూడ్చేస్తున్నా అధికారులు లక్కకుంట వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న తుమ్మిడి చెరువు ఎకరాకుపైగా కబ్జాకు గురైంది. ఖానామెట్‌ మొండికుంటలో ఓ వైపు శ్మశానం ఉండగా, అవతలి వైపు ప్రైవేటు వ్యక్తులు చెరువుస్థలాన్ని ఆక్రమించారు. జీహెచ్‌ఎంసీ, నాగారం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో చర్లపల్లి చెరువు శిఖంలో లోటస్‌కాలనీ వైపు ఎకరాల కొద్దీ కాలనీలు వెలిశాయి.

90 ఎకరాలు పోయి 20 ఎకరాలే మిగిలింది : వీటితోపాటు యూసుఫ్‌గుడాలోని 35 ఎకరాల్లో ఉన్న పెద్దచెరువు కూడా ఆక్రమణలకు గురై చిన్నకొలనుగా మారింది. పాతబస్తీ బార్కస్‌లోని గుర్రంచెరువు ఎఫ్​టీఎల్​, బఫర్‌జోన్‌ కనిపించకుండా మాయమైంది. 90 ఎకరాల విస్తీర్ణంతో ఉండే గుర్రం చెరువు కబ్జాలకు గురై 20 ఎకరాలే మిగిలింది. 46 ఎకరాలకు పైగా ఉండే బండ్లగూడలోని సూరం కాసారం సైతం ఇలానే ఆక్రమణలకు గురై 12 ఎకరాలకు పరిమితమైంది. 13 ఎకరాలకు పైగా ఉండే అంబర్‌పేటలోని బతుకమ్మకుంట 5 ఎకరాలకు కుంచించుకుపోయింది.

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 15 చెరువులున్నాయి. 10 చెరువులు సింహభాగం, 5 చెరువులు స్వల్పంగా ఆక్రమణకు గురయ్యాయి. చెరువులతో పాటు నగరంలోని అనేక నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. మణికొండ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు వేలాది క్యూసెక్కుల వరద మోసుకొచ్చే బుల్కాపూర్‌ నాలా దాదాపు 70% ఆక్రమణకు గురైంది. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల పారిశ్రామికవాడ, కూకట్‌పల్లి చెరువుల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరద తీసుకొచ్చే కూకట్‌పల్లి నాలాలోకి ఇళ్లు చొచ్చుకొస్తున్నాయని అధికారులే వెల్లడించారు.

చెరువులో భారీ భవనాలు - విల్లాలు : ఇలా నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు నాలాలకు సంబంధించి ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఎన్నో విలువైన, కీలకమైన చెరువులు, నాలాలు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. కబ్జాకోరల్లో చిక్కుకున్న చెరువులు, నాలాల పట్ల కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలైనా అక్రమార్కులు, అధికారులు వాటిని లెక్క చేయని సందర్భాలు ఉన్నాయి. కాగా ఇటీవల కొన్ని చెరువుల్లో భారీ భవనాలు, విల్లాలు నిర్మించారనే అంశంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ స్పందించారు.

ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని ఇ.వి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ఆక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండటం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా చెరువు, నాలాలు ఏళ్లుగా కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కొన్నింట్లో అధికారులే ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని, వీరి ప్రోత్సాహంతోనే కబ్జాలు చేస్తూ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. అక్రమార్జనకు ఆశపడే ఆయా శాఖల్లోని అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు. కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా వాటిని అంటిముట్టనట్లుగానే అధికారులు వ్యవహరిస్తుండటం ఇందుకు నిదర్శనం.

ఇదేందయ్యా ఇదీ - నీళ్లు లేవని చెరువునే కబ్జా చేసేస్తున్నారు!

ఆక్రమణల చెరలో పెద్దచెరువు - పట్టించుకోని అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.