ETV Bharat / state

మత్తు ఇంజక్షన్ల 'ఛీ'కటి దందా - ఫెంటనిల్‌ ఇంజక్షన్ల మాఫియా కేసులో సంచలన విషయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 2:26 PM IST

Fake Doctor Arrested
Fake Doctor Arrested In Hyderabad

Fentanyl Injection Fraud Hyderabad : డ్రగ్స్‌ కంటే వందల రెట్లు మత్తునిచ్చే ఇంజక్షన్లతో వ్యాపారం. మాదకద్రవ్యాలకు బానిసైన వారే కస్టమర్లు. నకిలీ వైద్యులు, ఫోర్జరీ సంతకాలతో ఆస్పత్రి ముసుగులో దందా సాగిస్తుంటారు. కేవలం 60 రూపాయలకు దొరికే ఇంజక్షన్‌ను 4వేలకు విక్రయిస్తుంటారు. మత్తు మందులతో యధేచ్ఛగా వ్యాపారం సాగిస్తూ. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంపై లోతైన విచారణ జరుపుతున్న 'టీఎస్-న్యాబ్‌' నిందితులను గుర్తిస్తూ, కటకటాల్లోకి నెడుతోంది.

నకిలీ వైద్యుడిని అరెస్ట్​ చేసిన రాజేంద్రనగర్​ పోలీసులు

Fentanyl Injection Fraud Hyderabad : డ్రగ్స్‌ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న వేళ హైదరాబాద్‌లో రెండ్రోజుల క్రితం కలకలం రేపిన మత్తుదందా వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఆస్పత్రి ముసుగులో మూడేళ్లుగా సాగిస్తున్న అక్రమాల బాగోతంపై సంయుక్త ఆపరేషన్‌ జరిపిన 'టీఎస్-న్యాబ్', రాజేంద్రనగర్‌ పోలీసులు మెడికల్‌ దందా చీకటి వ్యవహారాలను బయటికి తీస్తున్నారు.

హైదరాబాద్‌ ఆసీఫ్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ హసన్‌ ముస్తాఫాఖాన్‌ మెహిదీపట్నంలోని సమీర్‌ ఆస్పత్రి నుంచి తరచుగా మత్తు ఇంజక్షన్లు తీసుకెళ్తున్నాడు. సమీర్ వ్యవహారంపై నిఘా పెట్టిన 'టీఎస్-న్యాబ్' గురువారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, విచారించింది. మరుసటి రోజు సమీర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సోహెబ్‌ సుభాని, డైరెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌, ఫార్మాసిస్ట్‌ సయ్యద్‌ నసీరుద్దీన్‌, మహ్మద్‌ జాఫర్‌, మెడికేర్‌ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌ ఎండీ గోపు శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేయగా మరో నిందితుడు హసన్‌ ముస్తాఫాఖాన్‌ పరారీలో ఉన్నాడు

Joint Operation Of TSNAB, Rajendranagar Police : రోగులకు శస్త్ర చికిత్సలు, తీవ్రవ్యాధులతో బాధపడే వారికి మత్తు కోసం వైద్యులు ఫెంటనిల్‌ అనే ఇంజక్షన్‌ను ఇస్తుంటారు. ఖరీదైన డ్రగ్స్‌ కంటే వందల రెట్లు ఎక్కువగా మత్తునిచ్చే ఈ మందుకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీనిని అవకాశంగా చేసుకున్న సమీర్‌ ఆస్పత్రి నిర్వాహకులు ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌తో చేతులు కలిపి దందా ప్రారంభించినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లేకుండానే సమీర్‌ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపులో ఈ ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు.

చాక్​పీస్ పౌడర్‌, మొక్కజొన్న పిండి కాదేదీ ఔషధానికి అనర్హం! - నకిలీ మందుల దందా గుట్టురట్టు

సంతాకల పోర్జరీతో : లైసెన్స్‌ లేకపోయినా హిమాయత్‌నగర్‌కు చెందిన మెడికేర్‌ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ మత్తు ఇంజక్షన్లను మందుల దుకాణానికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఇంజక్షన్లను రోగులకు విక్రయించాలంటే వైద్యుల సిఫార్సు కావటంతో ఇందుకోసం నంద్యాల్‌లోని సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ షేక్‌ సలీమా పేరును ఉపయోగించుకున్నారు. ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి గతేడాది డిసెంబరు 12న 20 ప్రిస్కిప్షన్స్‌తో వంద ఫెంటనిల్‌ ఇంజక్షన్లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి, ఫార్మసీ రిజిస్టర్‌లోనూ నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. కొనుగోలు చేసిన ఇంజక్షన్లలో పదిహేడింటిని ఉపయోగించగా వాటిని ఎవరికి ఇచ్చారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డ్రగ్స్​కు బానిసైన వారే లక్ష్యంగా : ఈ నెల 6న మత్తువైద్యుడు డాక్టర్‌ హసన్‌ ముస్తాఫాఖాన్‌ 100 ఇంజక్షన్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో 43 డ్రగ్స్‌కు అలవాటుపడిన వారికి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగిలిన 57 ఇంజక్షన్లను తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కాలం చెల్లినవిగా నిర్దారించారు. ఒక్కో ఇంజక్షన్‌ను డిస్ట్రిబ్యూటర్‌ నుంచి 57 రుపాయలకు కోనుగోలు చేసి డ్రగ్స్‌కు బానిసలైన వారికి 4వేల నుంచి 5వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. ఈ ఇంజక్షన్లను ఎవరెవరు ఉపయోగించారనే దానిని తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్​.. కట్​ చేస్తే జైల్లో ఊచలు లెక్కపెడుతూ..

మరోవైపు సమీర్‌ ఆస్పత్రిలో ఇద్దరు నకిలీ వైద్యులు పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నకిలీ వైద్యుల ద్వారానే మత్తు దందా భారీఎత్తున జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. మెహిదీపట్నం సమీర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ మోసాల్లో దిట్టగా పోలీసులు గుర్తించారు. పదోతరగతిలోనే చదువు ఆపేసి 2017లో మెహిదీపట్నంలో ఓ ఆసుపత్రి డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆధార్‌కార్డులో డాక్టర్‌ అబ్దుల్‌ ముజీబ్‌గా పేరు మార్చుకుని డీఎంహెచ్​ఓ నుంచి ధ్రువపత్రం పొందినట్లు నకిలీపత్రాలు తయారుచేశాడు.

అదే ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితుడు సుభానీతో కలసి 2017లో ఆసిఫ్‌నగర్‌లో సమీర్‌ ఆసుపత్రి ప్రారంభించాడు. ఇద్దరూ నకిలీ వైద్యులుగా రోగులను పరీక్షించటం, మందులు ఇవ్వటం చేస్తుండేవారు. కొవిడ్‌ సమయంలో నకిలీ వైద్యుల బాగోతం వెలుగులోకి రావటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్ తరలించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులందరినీ అరెస్టు చేస్తామని టీఎస్ న్యాబ్‌ డైరెక్టర్ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఇంజక్షన్లు ఉపయోగిస్తున్న వారిని గుర్తించి వారందరినీ 'డీ-అడిక్షన్‌ సెంటర్‌'లకు పంపిస్తామని స్పష్టం చేశారు.

Fake Doctors: దొరికితే 'శంకర్‌దాదా'.. దొరక్కుంటే ఎంబీబీఎస్‌!

FAKE DOCTORS: జనం నాడి పట్టారు.. జనరల్ ఫిజీషియన్ అవతారమెత్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.