ETV Bharat / state

'మీ పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయి నేనడిగిన డబ్బివ్వకపోతే జైలుకే'​ - ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఐతే బీ కేర్​ఫుల్ - FedEx Crimes In Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 10:41 AM IST

FedEx Crimes In Telangana : నేరాలందు సైబర్‌ నేరాలు వేరయా అన్నట్టుగా రోజురోజుకూ ఒక్కో రకంగా మారుతున్నాయి సైబర్‌ నేరాలు. ఫిషింగ్, అపరిచిత లింక్‌లు, ఆధార్ స్కామ్‌లు, ఫెడెక్స్‌ కొరియర్‌ స్కాం. ఒక్కోటి ఒక్కో రకం. కానీ నేరగాళ్ల లక్ష్యం మాత్రం ఒకటే. ఉన్నచోటు నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా దోచేయడం. ఇలాంటి మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అనేది నిపుణుల మాట. అసలు ఇటీవల భారీగా జరుగుతున్న ఫెడెక్స్‌ కొరియర్‌ ఫ్రాడ్‌ ఏంటి? చూద్దాం.

FedEx Parcel Cyber Crimes in Telangana
FedEx Crimes In Telangana (ETV Bharat)

'మీ పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయి నేనడిగిన డబ్బివ్వకపోతే జైలుకే'​ - ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఐతే బీ కేర్​ఫుల్ (ETV Bharat)

FedEx Parcel Cyber Crimes in Telangana : ఫెడెక్స్ స్కాం ఏంటి అని చూస్తే మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు. మీ పార్శిల్‌లో మీరు బుక్‌ చేసిన వస్తువులతో పాటు పలు మాదకద్రవ్యాలు లేదా నకిలీ పాస్‌పోర్టులు లేదంటే నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురిచేస్తారు. తర్వాత మీ గురించి ముంబయి సైబర్‌ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబయి సైబర్‌ క్రైమ్‌ నుంచి ఉన్నతస్థాయి అధికారిగా మాట్లాడి, భయాందోళనకు గురిచేస్తారు.

స్కైప్ లాంటి యాప్‌లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి, మీపై కేసు నమోదైంది. అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి, అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగిన మొదటి గంటలో 1930కి ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని, మీ నగదు మీకు చేరుతోందని పోలీసులతో పాటు బాధితులు సైతం తమ అనుభవాల్ని చెబుతున్నారు.

మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ : ఇటీవల ఈ కేసులు నగరంలో పెరిగిపోయాయి. నగరంలోని బాధితుల్లో 27 శాతం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పోలీసులు పేరిట ఇలాంటి కాల్స్ రావడంతో పరువు పోతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ డబ్బు చెల్లిస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు 10 రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన బుక్ చేసిన పార్శిల్‌లో 5 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్‌ కార్డులు,1 జత షూలతో పాటు 200 గ్రాముల ఎమ్​డీఎంఏ డ్రగ్ ఉన్నట్లు తెలిపారు.

"మీకు ఇలాంటి కాల్స్​ వస్తే లాజిక్​గా ఆలోచించాలి. మీరు పార్శిల్​ పంపలేదు కాబట్టి భయపడే అవసరం లేదు. కాల్​ రాగానే పోలీసులకు చెప్పండి. లేదంటే 1930కి కాల్​ చేసి చెప్పిండి. చాలా మంది వారు ఏం అడగకముందుకే డబ్బులు కట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి చేశానా లేదా అని. అప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది." - సజ్జనార్​, సీనియర్ ఐపీఎస్ అధికారి

ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామంటూ కాల్​ కట్​ చేశారు. తర్వాత ముంబయి క్రైమ్ బ్రాంచ్‌ అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో బాధితుడు పూర్తిగా భయపడిపోయాడు. తన ఆధార్‌ అక్రమ కార్యకలపాలకు వాడుతున్నట్లు బెదిరించడంతో ఖంగుతున్నాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 3 లక్షల 71 వేల 581 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ కేటుగాళ్ల సరికొత్త పంథా - పోలీస్​గా పరిచయమై పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా! - Cyber Crime Cases in Telangana

శనివారం రోజున నగరానికి చెందిన ఓ విశ్రాంత మహిళా ఉద్యోగికి సైతం ఇదే తరహాలో బెదిరింపు వచ్చింది. బాధితురాలి పేరిట ఉన్న పార్శిల్​లో నకిలీ పాస్‌పోర్టులు, 960 గ్రాముల కొకైన్‌ ఉన్నట్లు బెదిరించి రూ.14 లక్షల 73వేల 400 రూపాయలు కాజేశారు. అనంతరం మోసపోయాయనని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటివి జరిగినప్పుడు కాస్త లాజికల్​గా ఆలోచిస్తే భయపడాల్సిన పని ఉండదని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ అంటున్నారు.

ఎలాంటి ఆందోళన పడకుండా కాస్త అప్రమత్తంగా ఉంటే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చనేది నిపుణుల మాట. ఏదైనా జరిగిన వెంటనే గాబరా పడకుండా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తప్పు లేకుంటే ఒకసారి ఆలోచించాలని ఆ తర్వాత దగ్గరవాళ్లకో చెప్పడం మంచిదంటున్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరిగిన ఘంటలో పోలీసులకు సమాచారం అందిస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ సైబర్‌నేరం జరిగినా 1930కి కాల్‌ చేయడం లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.

'మీ పార్శిల్​లో డ్రగ్స్​ ఉన్నాయి - నేనడిగినంత డబ్బివ్వకపోతే జైలుకెళ్లడం ఖాయం'

కంబోడియా దేశం సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకున్న భారతీయులు - ఇప్పటివరకు రూ.500 కోట్ల పైమాటే దోపిడీ - Indians was Trapped in Cambodia

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.