ETV Bharat / state

విజయవాడ వాసుల నీటి వ్యధ - అయిదేళ్లూ మొద్దు నిద్రలోనే జగన్ సర్కార్​! - Drinking Water problem

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 2:37 PM IST

water_problem
water_problem

విజయవాడ నగరంలోని భూగర్భ జలాల్లో అనేక రకాల రసాయనాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియాలతో టీడీఎస్​ (TDS-Total Dissolved Solids) అధికంగా ఉందని సదరన్​ రీజియన్​ ఆఫ్​ సెంట్రల్​ గ్రౌండ్​ వాటర్​ బోర్డు (సీజీడబ్ల్యూబీ) ఏనాడో హెచ్చారించిన పాలకుల వర్గం మాత్రం నిమ్మకు నీరెత్మినట్లుగా వ్యవహరించారు.

Drinking Water Problem in Vijayawada : ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? తాగునీరే గరళమై జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆర్‌డబ్ల్యూఎస్‌(RWS-Rural Water Supply) పైపులైన్​లో సహా భూగర్భ జలాలు కలుషితమైపోయాయని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నా పాలకులు ఎలా స్పందించాలి?

  • కానీ వైఎస్సార్సీపీ సర్కారుకు ఇవేమీ పట్టలేదు. జనం ప్రాణాలు అంటే విలువే ఇవ్వలేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ అయిదేళ్లూ మొద్దు నిద్రలో గడిపేసింది. ఏళ్ల కిందట వేసిన మంచినీటి పైపులైన్లకు పగుళ్లు వచ్చినా, లీకులొచ్చినా పనులు చేయడానికి నిధులు లేవంటూ చేతులెత్తేసింది.
  • ఉమ్మడి జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం నగరాలు సహా మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి ఎంతోమంది హాస్పిటల్​ పాలయ్యారు. కొంత మంది మృత్యువాత పడ్డారు. అయినా మంచినీటి శుద్ధి విషయంలో వైఎస్సార్సీపీ సర్కారు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. విజయవాడలో గత ప్రభుత్వాలు వేసిన పైపులైన్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. విజయవాడ లాంటి నగరాల్లో మురికిగా, బురదగా ఉన్న నీరే వస్తోంది. చాలా చోట్ల డ్రెయినేజీ తాగునీటి పైపులైన్లు పక్కపక్కనే ఉండడం వల్ల పగుళ్ల ఏర్పాడిన చోట నీరు కలుషితం అవుతోంది. ఈ విషయాన్ని పాలకులు, అధికారులకు జనం మొరపెట్టుకున్నా ఫలితం లేదు.

కేవీఆర్‌ కాలనీలో జల విషాదం : విజయవాడ శివారులోని ఎనికేపాడులో ఉన్న కేవీఆర్‌ కాలనీలో 2 సంవత్సరాలు కిందట డయేరియా లక్షణాలతో పదుల సంఖ్యలో బాధితులు అనారోగ్యం బారిన పడ్డారు. 15 మంది ఆసుపత్రిలో చేరగా కె. లీల(50) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. జిల్లా అంటువ్యాధుల నిపుణుల బృందం ఇక్కడి నీటి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించి నల్లా నీటిలో 'క్లెబ్సియెల్లా' అనే బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ వాటర్‌ ప్లాంటు నీటిలోనూ ఈ బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు సృష్టం చేయడంతో మూయించేశారు.

రేపల్లెలో తాగునీటి ఎద్దడి - రహదారికి అడ్డంగా నీటిడ్రమ్ములు పెట్టి ఆందోళన - Drinking Water Problem

ముత్యాలంపాడులో రంగుమారిన నీరే దిక్కు : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వసతి గృహంలో విద్యార్థులు బోరు నీటినే వాడేవారు. దాతలిచ్చిన ఆర్వో ప్లాంటు ఉన్నా సరైనా నిర్వహణ లేక పాడైపోయింది. ఏడాది కిందట బోరు నీటిని తాగిన విద్యార్థుల్లో 20 మంది ఒకేసారి జ్వరాల బారిన పడ్డారు. వీరిలో 13 మంది విద్యార్థులకు టైఫాయిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. జ్వర తీవ్రత అదుపు చేయలేనంతగా పెరిగిపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వసతిగృహాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇక్కడి బోరు నీటిలో 'అమోనికల్‌ నైట్రేట్‌' అనే విషపదార్థం అధికంగా ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ నీరు తాగడానికి పనికిరాదని సృష్టం చేశారు.

సీజీడబ్ల్యూబీ ఎప్పుడో హెచ్చరించినా : విజయవాడలో కలుషితమైన భూగర్భజలాలనే తోడి శుద్ధి చేసి వాటర్‌ ప్లాంట్ల ద్వారా కొంత మంది స్వార్థపరులు విక్రయిస్తున్నారు. నీటిని శుద్ధి చేశాక వచ్చే గాఢ నీటిని తిరిగి భూమిలోకే పంపించేస్తున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం లేదు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, తాగునీటిలో పలురకాల రసాయనాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియాలున్నాయని, టీడీఎస్‌ శాతం అధికంగా ఉందని సదరన్‌ రీజియన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు (సీజీడబ్ల్యూబీ) చాలాకాలం కిందటే హెచ్చరించిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. భూగర్భంలో ఉన్న తాగునీటి పైపులైన్లు పగిలిపోయి ఈ వ్యర్థాలు, రసాయనాలు నీటిలో కలిసిపోతున్నాయని, ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెప్పారు. అయినా అధికార ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. నగరంలో ఇంటింటికీ పంపిణీ చేసే నీటిలో నిత్యం 30% లీకేజీలతో వృథాగా పోతోంది.

మాచర్లలో నిలిచిన తాగునీరు - ట్యాంకర్​ వస్తే యుద్ధ వాతావరణమే! - Water Problem

కిడ్నీ వ్యాధి బాధితులు పెరిగిపోయారు : ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు తండాల్లో కలుషిత జలాల కారణంగా అయిదేళ్లలో కిడ్నీ వ్యాధి బాధితులు విపరీతంగా పెరిగిపోయారు. తాగునీరు ఇవ్వండి మహాప్రభో అంటూ గిరిజన తండాల ప్రజలు వేడుకున్నా అధికార నేతల చెవికెక్కించుకోలేదు. జలజీవన్‌ మిషన్‌ కింద కృష్ణా జలాల ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటూ కేంద్రమంత్రులు చెప్పినా, జగన్​ సర్కార్​ నాలుగేళ్లు కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఇటీవలే పనులు ప్రారంభమైనా, తాగునీరు అతీగతీ లేదు. తండాలకు 6 కోట్ల రూపాయలతో ట్యాంకర్ల ద్వారా నీరిస్తామని ఏడాది కిందట కలెక్టరు ప్రకటించినా అది అస్తవ్యస్తంగానే ఉంది. ఈ నీరు మురికిగా ఉందని, చేపలు కూడా వస్తున్నాయని గిరిజనులు ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిధులు ఇవ్వలేదంటూ కొన్నాళ్లు గుత్తేదారు నీటి సరఫరా ఆపేశారు. ప్రజలు మళ్లీ ఆందోళన చేశాకే అధికారులు స్పందించారు.

భీమవరం వాసులకు కలగానే మిగిలిన కుళాయిల నీటిసరఫరా - దశాబ్దాలుగా ట్యాంకర్ నీళ్లపైనే ఆధారం - Drinking Water Problem

తెంపల్లిలో అతిసారానికి ముగ్గురు బలి : తెంపల్లిలో బోర్ల నుంచి నీటిని తోడి సంపుల్లోకి ఎక్కించి సరఫరా చేసేవారు. ఏడాదిన్నర కిందట బల్లిపర్రు, యాదవుల బజారుకు వెళ్లే మార్గంలో పైపులైన్ల లీకుల కారణంగా తాగునీటిలోకి మురుగు చేరి కలుషితమైంది. దీంతో ఒక రోజులోనే 33 మంది వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. రాఘవేంద్రరావు (36), పల్లపోతు వెంకట్రామయ్య (81), కొలుసు మహేష్‌ (62) మృత్యువాత పడ్డారు. సుమారు వంద మంది ఇబ్బంది పడ్డారు. స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరినా పాలకులు పట్టించుకోలేదు. దీంతో స్థానికులు అప్పటి కలెక్టరు రంజిత్‌ను నిలదీశారు. ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ లీలాకృష్ణపై మండిపడ్డారు. దీంతో ఆయన జలజీవన్‌ మిషన్‌ కింద పైపులైన్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలు జారీ చేశారు కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.