ETV Bharat / state

గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఏపీపీఎస్సీ గోప్యత - APPSC RESTRICTIONS ON GROUP 1 MARKS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 2:42 PM IST

APPSC_Restrictions_on_Group1_Marks_Details_Release
APPSC_Restrictions_on_Group1_Marks_Details_Release

APPSC Restrictions on Group1 Marks Details Release: గ్రూప్-1 మార్కుల వెల్లడికి ఏపీపీఎస్సీ ఇంకా గోప్యత పాటిస్తోంది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని కంటే ఏడు నెలల ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తామనే దానిపై విమర్శల నేపథ్యంలో ప్రకటించినా అవీ దరఖాస్తు చేసినవారికే తెలియజేస్తామని ఆంక్షలు విధించింది.

APPSC Restrictions on Group1 Marks Details Release : గతంలో ఎన్నడూ లేని రీతిలో గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఎపీపీఎస్సీ ఆంక్షలు విధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కులు వెల్లడించకుండా కేవలం దరఖాస్తు చేసుకున్నవారికే తెలియజేస్తామన్న ఏపీపీఎస్సీ ప్రకటనపై సందేహాలు రేకిత్తిస్తున్నాయి. 2016 నోటిఫికేషన్‌ వరకు బహిరంగంగా జాబితాలు ఇచ్చే సంప్రదాయానికి కమిషన్‌ తిలోదకాలపై అభ్యర్థుల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గ్రూప్‌-1 మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ ఇంకా గోప్యత పాటిస్తోంది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని కంటే ఏడు నెలల ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తారా అనే విమర్శల నేపథ్యంలో ప్రకటించినా, అవీ దరఖాస్తు చేసినవారికే తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. యూపీఎస్సీలో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్‌ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది.

వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టుపట్టిన ఏపీపీఎస్సీ - తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అడ్డదారులు

2022 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెలరోజుల తర్వాత కోరిన వారికి మార్కుల మెమొరాండం అందిస్తామని పేర్కొన్నా అలా చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంగళవారం ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. గ్రూప్‌-1 (28/2022) నోటిఫికేషన్‌ అనుసరించి మార్కుల మెమొరాండం అవసరమైనవారు ఈ నెల 22 నుంచి జూన్‌ 21లోగా కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి అందిన రెండు వారాల తర్వాత మార్కుల మెమొరాండాన్ని లాగిన్‌ విధానంలో తెలుసుకోవచ్చునని పేర్కొంది. ఇందుకు తొలుత ప్రకటించినట్లు 200 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షల్లో తమ మార్కుల గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇవి తెలిస్తేనే పోటీలో వారు ఏ స్థానంలో ఉన్నారో ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడగలరు. అందుకే యూపీఎస్సీ ఈ మార్కులను అభ్యర్థులకు తెలియబరుస్తుంది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం మార్కుల వెల్లడిపై ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది.

గ్రూప్‌-1లో అక్రమాలు రుజువైనా బుకాయిస్తున్నారు- సవాంగ్ రాజీనామా చేయాలి: పట్టాభి

2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్‌ ప్రాథమిక 'కీ' వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమొరాండం ఉండదని తెలిపింది. కానీ ఈ నోటిఫికేషన్‌ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకూ చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వారికి కోర్టు కేసు ఉందని కమిషన్‌ సమాధానమిస్తోంది.

ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను అనుసరించి ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన మార్కులను జాబితా రూపంలో ప్రకటించింది. అందులో అభ్యర్థుల రోల్‌ నెంబరు, కమ్యూనిటీ, ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించింది. నిరుద్యోగులకు సానుకూలంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించకుండా లేనిపోని ఆంక్షలతో పరిమితం చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.