ETV Bharat / spiritual

పోగొట్టుకున్నవి తిరిగిచ్చే మహిమాన్విత దైవం! 'తిరుత్తణి' సుబ్రమణ్య స్వామిని దర్శించారా? - Tiruttani subramanya swamy temple

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 3:58 AM IST

సుబ్రమణ్య స్వామి
సుబ్రమణ్య స్వామి (GettyImages)

Tiruttani Subramanya Swamy Temple : దక్షిణ భారతదేశంలో ఆరు ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుత్తణి ఒకటి. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుత్తణి క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి? ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? తదితర విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తి చదవండి.

Tiruttani Subramanya Swamy Temple : తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది.

మురుగ పెరుమాళ్లు ఆలయ విశేషాలు
తిరుత్తణి దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని 'బియ్యపుకొండ' అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని 'గానుగ పిండి కొండ' అని కూడా పిలుస్తారు.

తప్పులను క్షమించి ఓదార్చే మురుగన్
తిరుత్తణి క్షేత్రం స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు, మునులను బాధిస్తున్న శూరపద్మునితో యుద్ధం చేసాడంట! వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయ కుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి 'తణిగై' లేదా 'శాంతిపురి' అనే పేరొచ్చింది. అలాగే 'తణిగ' అంటే ద్రవిడ భాషలో క్షమించడం, లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.

మెట్లు ఎక్కితే చాలు 365 రోజులు పూజించినట్లే!
తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు, కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరమంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు.

కుమారునికి జ్ఞానశక్తిని ప్రసాదించిన శివుడు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్టించి శివుని సేవించాడంట. అప్పుడు కుమారస్వామి పితృ భక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి 'జ్ఞానశక్తి' అనే 'ఈటె'ను అనుగ్రహించాడట. అప్పటి నుంచి ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చిందని శాస్త్ర వచనం.

తిరుత్తణి క్షేత్ర విశేషం - కుమార తీర్థం
తిరుత్తణిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. అంతేకాదు కుమారస్వామి, శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన క్షేత్రం
త్రేతా యుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని సేవించి, అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు, ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్ర వచనం. ద్వాపర యుగములో, పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ తిరుత్తణికి వచ్చి ఇక్కడ స్వామి వారిని కొలిచాడంట.

పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే తప్పకుండా దర్శించాల్సిందే!
తిరుత్తణి దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ, విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహా విష్ణువు తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంఖు, చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. మరో ముఖ్య విశేషమేమిటంటే ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ, ప్రణవ అర్థమును చెప్పలేక పోవడం వలన, ఆయనను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యములను పొందాడు కాబట్టి తిరుత్తణి క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం.

అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే, ఇంద్ర తీర్థములో, "కరున్ కువలై" అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో సుబ్రహ్మణ్యుని పూజించిన తరువాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న" సంఘనీతి, పద్మనీతి, చింతామణి " మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడని ప్రతీతి. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునే వారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి.

ఆలయంలో నిత్యపూజలు
తిరుత్తణి క్షేత్రంలో ప్రతి రోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.

ఆకట్టుకునే సుందర మూర్తులు
ఈ క్షేత్రంలో ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము వంటి ఛత్రము రుద్రాక్షలతో చేసినది. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు, ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి భక్తులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామి వారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వ పత్రములతో చేసిన మాలను కూడా వినియోగిస్తారు.

సంతానం ప్రసాదించే కావడి ఉత్సవం
తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం.

దేవేంద్రుడే స్వయంగా ఇచ్చిన చందనం
ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

ఐశ్వర్యాలనిచ్చే విభూతి
తిరుత్తణిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజూ నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

విద్యనిచ్చే భైరవుడు
అలాగే తిరుత్తణి ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉండడం నాలుగు వేదాల పరిరక్షణకే అని శాస్త్రవచనం. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం. ఇన్ని గొప్ప విశేషాలున్న ఈ తిరుత్తణి ఆలయాన్ని మనమందరం దర్శిద్దాం, తరిద్దాం.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

అమావాస్య ముందు ఆరోగ్య సమస్యలా? ఈ 'స్పెషల్​' సోమవారం పూజతో అంతా సెట్​! - masa shivaratri 2024

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి శుభసమయం ఏది? - మీకు తెలుసా? - Akshaya Tritiya 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.