ETV Bharat / politics

LIVE UPDATES : ఇది ఎన్నికల సభ కాదు - అభివృద్ధి ఉత్సవం : మోదీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 10:42 AM IST

Updated : Mar 4, 2024, 12:47 PM IST

PM Modi Adilabad Tour Live Updates
PM Modi Adilabad Tour Live Updates

PM Modi Adilabad Tour Live Updates Today 2024 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఆదిలాబాద్​ చేరుకున్నారు. మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మొదట పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ అనంతరం బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు.

12.46 PM

మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ : మోదీ

వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో గెలవాలని ఆకాంక్షించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశామని, సమ్మక్క-సారక్క సెంట్రల్‌ ట్రైబర్‌ వర్సిటీని స్థాపించామని, హైదరాబాద్‌లో రాంజీ గోండ్‌ పేరుతో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్న మోదీ, దేశంలో 7 మెగాటైక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 7 మెగాటెక్స్‌టైల్స్‌ పార్కుల్లో ఒకదానిని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు.

12.33 PM

ఇది ఎన్నికల సభ కాదు - ఇది అభివృద్ధి ఉత్సవం : మోదీ

ఆదిలాబాద్‌లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని తెలిపారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని 15 రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించామని మోదీ వెల్లడించారు.

12.25 PM

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలి : కిషన్ రెడ్డి

ఆదిలాబాద్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ అనంతరం బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ గెలవాలని అన్నారు. హైదరాబాద్‌ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని పేర్కొన్నారు.

12.00 PM

రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ, పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు. అంబారి- పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్- మౌలాలి మార్గానికి శ్రీకారం చుట్టారు.

11. 50 AM

రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందని, గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న రేవంత్ రెడ్డి, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు రేవంత్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు. 'దేశం 5 ట్రిలియన్‌ ఆర్థికవ్యవస్థ చేరడంలో హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తుంది. మూసీ రివర్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలి.' అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

11.40 AM

తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందించింది : కిషన్ రెడ్డి

రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను మోదీ ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3 వందేభారత్‌ రైళ్లను మోదీ ప్రారంభించారని తెలిపారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందించిందని వెల్లడించారు.

11.37 AM

ఆదిలాబాద్​ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఆదిలాబాద్ చేరుకున్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభాస్థలి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

10.42 AM

కాసేపట్లో ఆదిలాబాద్​కు ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్‌కు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మరోవైపు ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభాస్థలికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఆదిలాబాద్ చేరుకోనున్నారు.

Last Updated :Mar 4, 2024, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.