ETV Bharat / politics

రణరంగంలా ఏపీ ఎన్నికలు - కిడ్నాపులు, దాడుల మధ్య పోలింగ్ - జంకుతున్న ఓటర్లు - Clashes in AP Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 12:13 PM IST

Clashes in AP Elections : ఆంధ్రప్రదేశ్​లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఏడుగురు పోలింగ్‌ ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ 129వ పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

CLASHES IN AP ELECTIONS 2024
Clashes in AP Elections (ETV Bharat)

ఓటర్లను భయపెడుతోన్న వైఎస్సాఆర్సీపీ నేతలు (ETV Bharat)

Clashes in AP Elections : ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుండగా, పలుచోట్ల వైఎస్సార్సీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాడులు, కిడ్నాప్​లో రెచ్చిపోతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఏడుగురు పోలింగ్‌ ఏజెంట్ల కిడ్నాప్‌: చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఏడుగురు పోలింగ్‌ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తుకెళ్లారు. ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు కిడ్నాప్‌ అయ్యారు. మరో స్వతంత్ర అభ్యర్థికి చెందిన పోలింగ్‌ ఏజెంట్లను సైతం కిడ్నాప్‌ చేశారు. పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్‌ చేశారు.

సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర కిడ్నాప్‌ ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్‌ చేశారని టీడీపీ నేతలు తెలిపారు. అదే విధంగా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఫిర్యాదు పేర్కొన్నారు.

టీడీపీ ఏజెంట్లపై దాడి: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మూకల దాడిలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో గొలవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని చెప్పింది. పల్నాడు ప్రాంతానికి ప్రత్యేక అబ్జర్వర్‌ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వైఎస్సార్సీపీ నేతలు ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తుండటంతో, పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేందుకు ఓటర్లు భయపడుతున్నారు.

అధికారులతో వైఎస్సార్సీపీ నేతల వాగ్వాదం: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించలేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతోనే అనుమతించడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలింగ్‌ కేంద్రంలోకి రావడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా నిన్న సాయంత్రమే ఏజెంటు పాసులు తీసుకోవాలని అధికారులు కోరారు. నిబంధనలు పెట్టినా పాసులకు దరఖాస్తు వైఎస్సార్సీపీ ఏజెంట్లు చేయలేదు. ఇవాళ నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి పాసులు ఇవ్వాలన్నారు. దీంతో పాసులు ఇచ్చేందుకు పోలింగ్‌ అధికారులు నిరాకరించారు. పోలింగ్‌ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. గొడవ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు - సర్దిజెప్పేందుకు రంగంలోకి అధికారులు - KHAMMAM VOTERS BOYCOTTED ELECTIONS

వైఎస్సార్సీపీ దౌర్జన్యం: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో వైఎస్సార్సీపీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేశారు. 201వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేయడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

మరోచోట టీడీపీ ఏజెంట్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ ఏజెంట్ వాహనం ధ్వంసం చేసి ఏజెంట్ ఫారాలు లాక్కెళ్లారు. సుభాష్ అనే టీడీపీ ఏజెంట్‌ను కిడ్నాప్ చేశారు. అదే విధంగా వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది.

ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లు: శ్రీశైలంలోని 4, 5 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా కూర్చోపెట్టొద్దని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న మాజీ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏఈఆర్ఓకు ఫిర్యాదు చేశారు.

కొడాలి నాని అనుచరుల హల్‌చల్‌: కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి కొడాలి నాని అనుచరుల హల్‌చల్‌ చేశారు. నాగవరప్పడులో అర్ధరాత్రి తలుపులు బాది రోడ్ల మీదకి రావాలని పిలిచారు. టిక్ పెట్టుకున్న కొంతమందికి డబ్బులు ఇచ్చారు. దీంతో కొందరికే డబ్బులు ఇస్తున్నారు ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎదురు దాడి చేసేందుకు కొడాలి నాని అనుచరుల యత్నించారు. జనం ఎదురు తిరగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టీడీపీ కార్యకర్తలకు గాయాలు: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపడంపై టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశావారిపాలెంలో ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీడీపీకి ఓటు వేయవద్దంటూ చెప్పారు. దీనిపై యువకుడు ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు దాడిచేశారు. యువకుడి తలకు స్వల్ప గాయం అయింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం మొక్కపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల‌ మధ్య ఘర్షణ తలెత్తింది. అదే విధంగా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ-టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన చోటుచేసుకుంది. కర్రలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త తలకు గాయం అయింది.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నడికుడిలో టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్యపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం ముప్పాళ్లలో పోలింగ్‌ కేంద్రం వద్ద పలువురు ఓటర్లపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడిచేశారు.

ఓటెత్తిన అధికారులు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? - OFFICERS CASTED VOTE IN TELANGANA

జనసేన ఏజెంట్‌ అపహరణ: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్‌ అపహరణకు గురయ్యారు. దలవాయిలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అపహరించారు. పోలింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, తమ ఏజెంట్‌ను కిడ్నాప్‌ చేశారని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. దలవాయి పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం కావడంతో, పోలింగ్‌ నిలిచింది.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కేసానుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలింపు విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్య సహా మరికొందరికి గాయాలు అయ్యాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వైఎస్సార్సీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం నల్లసింగయ్యప్లలిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్‌రెడ్డి సొంత గ్రామంలో ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. నల్లసింగయ్యపల్లిలోని 147వ పోలింగ్‌ కేంద్రంలో దౌర్జన్యంగా చొరబడ్డారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా సుమారు 10 ఓట్లు వేసుకుంటున్నారని టీడీపీ ఆరోపంచింది. దౌర్జన్యంగా ఓట్లు వేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పోలింగ్‌ సిబ్బంది అడ్డుకుని, బయటకు పంపించారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పుపై సాయిప్రసాద్‌రెడ్డి ఫోటోతో ముద్రించారు. దీంతో పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డి ఫిర్యాదుతో సాయిప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లెలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం మాగల్లు పోలింగ్‌ కేంద్రంలో ఘర్షణ తలెత్తగా పోలీసులు చెదరగొట్టారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బుక్కాపురంలో క్యూలైన్‌ వద్ద ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. మాచర్ల నియోజకవర్గం కంభంపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో రహదారి పైకి వచ్చి టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కంభంపాడులో భారీగా పోలీసులు మోహరించారు. ఐజీ శ్రీకాంత్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఏపీ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు - ఏకంగా ఏజెంట్లనే కిడ్నాప్​ చేసిన వైఎస్సాఆర్సీపీ నేతలు - POLLING AGENTS KIDNAPPED IN AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.