ETV Bharat / politics

కేసీఆర్​కు గట్టి షాక్ - 'కారు' దిగి కాంగ్రెస్​ గూటికి కేకే, మేయర్ విజయలక్ష్మి! - BRS MP KK Likely To Join Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 2:09 PM IST

K.Keshava Rao
Dipadas Munshi Met K.Keshava Rao

BRS MP KK Likely To Join Congress : బీఆర్​ఎస్​ సీనియర్​ నేత కె.కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షీ భేటీ అయ్యారు. ​హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేకే నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు.

BRS MP KK Likely To Join Congress : పార్లమెంట్​ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతలు, తెల్లారితే ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్​లోకి అంతకంతకూ చేరికలు పెరుగుతుండగా, ముఖ్య నేతల పార్టీ మార్పులు బీఆర్​ఎస్​కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవలే ఓ సిట్టింగ్​ ఎమ్మెల్యే, ఎంపీ కారు దిగి, కాంగ్రెస్​ గూటికి చేరగా, ఇంకా చాలా మంది క్యూలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సహా లోక్​ సభ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్​ వంటి నేతలు 'కారు' దిగి, కమలం గూటికి చేరిపోయారు. మరికొంత మంది హస్తం తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్​ నేతలు సైతం ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Dipadas Munshi Meets MP KK : తాజాగా బీఆర్​ఎస్​ నేత, రాజ్యసభ్య సభ్యుడు కె.కేశవరావును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ కలిశారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన తాజా రాజకీయ చర్చల్లో, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్‌ నేతలు కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

సొంత గూటికి చేరేనా? : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను చూస్తే, బీఆర్‌ఎస్ నాయకుల కాంగ్రెస్ చేరికలు ముమ్మరమయ్యాయని చెప్పొచ్చు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా మహేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం పార్టీలో చేరి, లోక్‌సభ టికెట్లు కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో కలిసి చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కేశవరావు, ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాను పార్టీ మారడం లేదని కేకే చెప్పడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.