ETV Bharat / international

కుదేలైన మాల్దీవులు టూరిజం- 'దయచేసి మా దేశానికి రండి' అంటూ భారతీయులకు రిక్వెస్ట్​ - Maldives India Tourism

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 12:24 PM IST

Maldives India Tourism : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం వల్ల మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మాల్దీవులకు వేళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ పర్యటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ విజ్ఞప్తి చేశారు.

Maldives India Tourism
Maldives India Tourism (ANI)

Maldives India Tourism : ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ అభ్యర్థించారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తుచేస్తూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

"మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలని అనుకుటుంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను" అని ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ భారత్​లోని లక్షద్వీప్​ దీవులను సందర్శించారు. అక్కడి పర్యటక అద్భుతాలను హైలైట్‌ చేస్తూ ఫొటోలు, వీడియోలు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై అక్కసును వెళ్లగక్కుతూ భారత్​ సహా ప్రధానిపై మాల్దీవుల మంత్రులు సోషల్​ మీడియా వేదికగా నోరుపారేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. మరోవైపు చైనా అనుకూలుడైన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించటం వల్ల సంబంధాలు మరింత క్షీణించాయి.

నాలుగు నెలల్లో 50శాతానికి!
ఈ పరిణామాల మధ్య మాల్దీవులకు వెళ్లడానికి సిద్ధమైన ప్రముఖులు సహా అనేక మంది భారతీయులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. విమాన, హోటల్‌ బుకింగ్‌లను క్యాన్సిల్‌ చేశారు. కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్‌లను నిలిపివేశాయి. దీంతో అప్పటి వరకు మాల్దీవులను సందర్శిస్తున్న పర్యటకుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. 2024 తొలి నాలుగు నెలల్లో భారత పర్యటకుల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయింది.

దౌత్య సంబంధాలే దెబ్బతినడమే కారణం
పర్యటకశాఖ గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదికలో పేర్కొంది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా- కారణం అదే! - Sunita Williams Space Mission

7 నెలల కాల్పుల విరమణకు హమాస్​ ఓకే- రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం - israel hamas ceasefire

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.