ETV Bharat / business

తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటున్నారా? సైబర్ నేరగాళ్లు కావచ్చు - జర జాగ్రత్త!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 11:53 AM IST

How To Identify Personal Loan Scams : చాలా మంది తమ ఆర్థిక అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో సైబర్ మోసాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Beware of Fake Pre approved Loan Offers
How to Identify Personal Loan Scams

How To Identify Personal Loan Scams : సైబర్​ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక వ్యవహారాల గురించి పెద్దగా తెలియని అమాయకులను వీరు టార్గెట్​ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పర్సనల్​ లోన్స్​, క్రెడిట్‌ కార్డ్స్​ ఇస్తామంటూ ఫోన్లు, ఎస్​ఎంఎస్​లు, ఇ-మెయిళ్లు పంపిస్తూ ఉంటారు. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నా లోన్ ఇస్తామంటూ చెబుతారు. క్షణాల్లోనే లోన్ అందిస్తామంటూ తొందర పెడతారు. అయితే ఇలాంటి వాటిపట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఎలాంటి దరఖాస్తు చేయకుండానే రుణం ఇస్తామంటూ వచ్చే ఫోన్లను, సందేశాలను నమ్మవద్దని చెబుతున్నారు. మీ ఆదాయంతో సంబంధం లేకుండా, తక్కువ వడ్డీకే అధిక మొత్తం రుణం ఇస్తామని చెబుతున్నారంటే, అది కచ్చితంగా సైబర్‌ స్కామ్‌ అని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

లోన్ ఆఫర్స్!
మీరు ఎలాంటి లోన్​ కోసం అప్లై చేయకపోయినా, మీ పేరుపై ముందస్తు రుణం మంజూరు అయ్యిందని సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తుంటారు. మెసేజ్​లు పెడుతుంటారు. పైగా ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంటారు. తక్కువ వడ్డీకే క్షణాల్లో లోన్ ఇస్తామని నమ్మిస్తారు. అయితే ఇలాంటి సమయంలోనే చాలా ప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా మీ ఖాతా ఉన్న బ్యాంకులో తప్ప, మరే ఇతర చోట్ల ముందస్తు రుణాలు మంజూరు అవ్వడం జరగదు. కనుక, ఇలాంటి మోసాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. రుణం ఇస్తాంటున్న సంస్థకు ఆర్‌బీఐ గుర్తింపు ఉందా? లేదా? అనేది కచ్చితంగా చెక్​ చేసుకోవాలి.

మీ వివరాలు కాజేస్తారు - జాగ్రత్త!
ఆర్థిక విషయాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తరచుగా మీ రుణ చరిత్ర నివేదికలను, క్రెడిట్‌ స్కోర్​ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీ పేరుపై ఎవరైనా అక్రమంగా లోన్స్​ తీసుకున్నారా? లేదా? అనేది తెలుస్తుంది. ఒక వేళ మీ రుణ చరిత్ర నివేదికలో ఏవైనా అనధికారిక రుణాలు ఉంటే, వెంటనే బ్యాంకులకు ఆ విషయాన్ని తెలియజేయాలి. క్రెడిట్‌ బ్యూరోలకు కూడా కచ్చితంగా ఫిర్యాదు చేయాలి.

అదనపు రుణాలు!
ఇప్పటికే తీసుకున్న లోన్​పై, బ్యాంకులు లేదా రుణ సంస్థలు అదనంగా రుణం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. బ్యాంకులు ఇచ్చే ఈ అదనపు లోన్ ఆఫర్లు సాధారణంగా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లలో కనిపిస్తుంటాయి. అయితే వీటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనితో బ్యాంకులు ఈ వివరాలను తమ రుణ ఏజెంట్లకు అందజేస్తుంటాయి. వాళ్లు కస్టమర్లకు ఫోన్లు చేసి, అదనంగా రుణం ఇప్పిస్తామంటూ ఆశ చూపిస్తుంటారు. కనుక ఇలాంటి కాల్స్​, మెసేజ్​లు వచ్చినప్పుడు ముందుగా మీ బ్యాంకును సంప్రదించండి. ఆ తర్వాత మాత్రమే సరైన నిర్ణయం తీసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంకు అదనపు రుణం ఇస్తుందని, అవసరం లోకపోయినా లోన్ తీసుకోకండి. కేవలం అత్యవసరం అయితేనే అదనంగా రుణాన్ని తీసుకోండి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.

పరిశీలనా రసుములు!
మోసగాళ్లు తెలివిగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి మాట్లాడుతున్నట్లుగా నమ్మిస్తారు. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామని ఊరిస్తారు. పరిమిత కాలంపాటే ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని తొందరపడతారు. రుణ దరఖాస్తును పరిశీలించడం, డాక్యుమెంటేషన్‌, రకరకాల ఫీజుల పేర్లు చెబుతారు. వీటి కోసం కొంత మొత్తాన్ని ముందుగా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని చెబుతారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీ లేదా గిఫ్ట్‌ కార్డులు, ఇతర రూపాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని చెబుతారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాసెసింగ్‌ ఫీజును, ఇతర రుసుములను లోన్​ మంజూరైన తర్వాత, ఆ మొత్తం నుంచే మినహాయించుకుంటారు. తరువాత మిగతా సొమ్మును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. గిఫ్ట్‌ కార్డులు లాంటి వాటిని అడుగుతున్నారంటే, అది కచ్చితంగా మోసమే అని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్​తో పని లేదంటున్నారా?
క్రెడిట్ స్కోర్ లేకపోయినా, ఎలాంటి ధ్రువీకరణలు అవసరం లేకుండానే లోన్ ఇస్తామంటున్నారా? అయితే వాళ్లు ఆర్థిక నేరగాళ్లు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వాస్తవానికి లోన్స్ ఇచ్చే ముందు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కేవైసీ నిబంధనలకు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవేవీ అవసరం లేదని, ఎవరైనా అంటే వాళ్లు కచ్చితంగా మోసగాళ్లే అని గుర్తించాలి. ఎందుకంటే రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్​ సమగ్రంగా పరిశీలించిన తరువాత మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి.

అనుమతి ఉండాల్సిందే!
ఆర్​బీఐ గుర్తింపు ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మాత్రమే లోన్స్ తీసుకోవాలి. అలాకాకుండా, గుర్తింపు లేని సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే, తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా మీకు రుణం ఇస్తామని చెప్పిన సంస్థల గురించి పూర్తిగా ఆరా తీయాలి. వాటికి ఆర్​బీఐ గుర్తింపు ఉందా? లేదా? చూడాలి. ఆ తరువాత వారి క్రెడిబిలిటీని కూడా చెక్ చేసుకోవాలి.

సరిపోల్చి చూడాలి!
మార్కెట్లో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ఇవి వసూలు చేసే వడ్డీలను, ఫీజులు, ముందస్తు చెల్లింపు రుసుములను కచ్చితంగా పరిశీలించాలి. వీటిలో తక్కువ వడ్డీలు, రుసుములు ఉన్నవాటిని ఎంచుకోవాలి. ఇందుకోసం ఆర్​బీఐ గుర్తింపు పొందిన వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంక్​ల​ వెబ్‌సైట్లలోని వడ్డీల వివరాలను సరిపోల్చి చూడాలి.

అన్ని వివరాలు తెలుసుకోవాలి!
రుణానికి సంబంధించిన అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. కీ ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్‌ను అడిగి తీసుకోవాలి. ఇందులో మీ రుణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీనిలోని రుణ మొత్తం, వడ్డీ, రుసుము, రుణం తీర్చడానికి ఉన్న వ్యవధి మొదలైన వివరాలు ఉంటాయి. వాస్తవానికి అవసరం లేకుండా పర్సనల్ లోన్స్ ఎప్పుడూ తీసుకోకూడదు. కేవలం మీకు నిజంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రమే లోన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి.

స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలా? డివిడెండ్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయండిలా!

నెలవారీ ఆదాయం కావాలా? పోస్టాఫీస్​లో ఇన్వెస్ట్ చేస్తే రూ.9వేలు ఇన్​కమ్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.