ETV Bharat / bharat

కాంగ్రెస్​లో శరద్​ పవార్​ ఎన్​సీపీ విలీనం? క్లారిటీ ఇచ్చిన సుప్రియ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 3:02 PM IST

Updated : Feb 14, 2024, 3:34 PM IST

sharad pawar ncp congress party
sharad pawar ncp congress party

Sharad Pawar NCP Congress Party : కాంగ్రెస్ పార్టీలో ఎన్​సీపీ శరద్​ పవార్ వర్గం విలీనం కానుందని వస్తున్న వార్తలపై పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియ సూలే స్పందించారు. ఎన్​సీపీ (శరత్​చంద్ర పవార్) ఏ రాజకీయ పార్టీలో కూడా విలీనం కాదని స్పష్టం చేశారు.

Sharad Pawar NCP Congress Party : శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీ వర్గం ఏ ఇతర రాజకీయ పార్టీలో కూడా విలీనం కాబోదని ఆ పార్టీ లోక్​సభ సభ్యురాలు సుప్రియ సూలే తేల్చి చెప్పారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. "మా వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదు. మహా వికాస్ అఘాడీలో పొత్తుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం" అని సుప్రియ తెలిపారు. కాంగ్రెస్​లో ఎన్​సీపీ (శరత్​ చంద్ర పవార్) పార్టీ విలీనం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

'అలాంటి అవకాశం కూడా లేదు'
బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ దేశ్​ముఖ్​, రాజేశ్ తోపే, ఎంపీలు అమోల్ కోల్హే, శ్రీనివాస్ పాటిల్​తోపాటు తదితరులు హాజరయ్యారు. ఎన్​సీపీ (శరద్‌చంద్ర పవార్) కాంగ్రెస్​ పార్టీలో విలీనం కానుందన్న వార్తలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. కాంగ్రెస్​లో తమ వర్గం విలీనమయ్యే అవకాశం కూడా లేదని చెప్పారు. అ విషయంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కొత్త ఎన్నికల గుర్తు పొందాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ విలీనంపై వస్తున్న వార్తలు తప్పని, కొత్త పేరు-కొత్త గుర్తుతో ప్రజల్లోకి వస్తామని మరో నాయకుడు ప్రశాంత్​ జగ్తాప్​ ప్రకటించారు. ఫిబ్రవరి 24న పుణెలో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీపై చర్చలు జరిపామని తెలిపారు.

శరద్​ వెంట 12 మంది ఎమ్మెల్యేలే!
గతేడాది జులైలో ఎన్​సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ- ఏక్​నాథ్​ శిందే సర్కారుకు మద్దతు పలికి అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎన్​సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ ఎన్​సీపీపై నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.

'అజిత్ వర్గమే అసలైన ఎన్​సీపీ'
ఇక పార్టీ ఎవరిదనే విషయమై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్​సీపీగా గుర్తించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గడియారం వారికే కేటాయించింది. ఎన్​సీపీ సంస్థాగత నిబంధనలు, నిర్మాణం, శాసనసభ్యుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని వెలువరించినట్లు ఈసీ తెలిపింది. శరద్​ వర్గానికి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ- శరద్‌ చంద్ర పవార్‌ అనే పేరు కేటాయించింది.

శరద్ పవార్ న్యాయపోరాటం
అయితే ఈసీ జారీ చేసిన ఆదేశాలపై శరద్‌ పవార్‌ న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో ఇటీవలే సవాలు చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సింబల్స్‌ యాక్ట్‌ ప్రకారం మెజారిటీ మాత్రమే అసలైన పరీక్ష కాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అజిత్‌ పవార్ కూడా న్యాయస్థానంలో కేవియట్‌ దాఖలు చేశారు. దీని ప్రకారం తమ వాదనలు వినకుండా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని కోరారు.

'80 ఏళ్లు దాటినా కొందరు రిటైర్ కారు- బాధ్యతలు మాకు అప్పగించొచ్చు కదా!'

బీజేపీతో పొత్తుకు అస్సలు ఛాన్సే లేదు.. అజిత్​తో భేటీ అందుకే!: శరద్​ పవార్

Last Updated :Feb 14, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.