ETV Bharat / bharat

'రాజకీయ లబ్ధి కోసమే నా మాటలను మోదీ వక్రీకరించారు'- 'శక్తి' వ్యాఖ్యలపై రాహుల్ క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 9:49 PM IST

Rahul Gandhi Gave Clarity On His Shakti Comments : ముంబయిలో ఇండియా కూటమిలోని పార్టీలు నిర్వహించిన ర్యాలీలో 'శక్తి' పేరుతో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే తాను చేసిన సదరు వ్యాఖ్యలను మతానికి లేదా హైందవత్వానికి ఆపాదించవద్దని, తాను ఎన్​డీఏ అనే 'రాజకీయ శక్తి' గురించి మాత్రమే మాట్లాడానని రాహుల్​ స్పష్టం చేశారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరించి తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.

Rahul Gandhi Fires On PM Modi Against His Shakti Comments
Rahul Gandhi Fires On PM Modi Against His Shakti Comments

Rahul Gandhi Gave Clarity On His Shakti Comments : ఆదివారం ముంబయిలో విపక్ష కూటమి ఇండియా నేతలు హాజరైన సభలో 'శక్తి' పేరిట కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. రాహుల్​ వ్యాఖ్యలను పలు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాజాగా దీనిపై రాహుల్​ స్పందించారు​. అయితే 'శక్తి' పేరుతో తాను చేసిన వ్యాఖ్యలను ఏ హైందవత్వానికో లేదా సదరు మతానికో ఆపాదించవద్దని, తాను ఎన్​డీఏ అనే 'రాజకీయ శక్తి'తో యుద్ధం అనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడానని రాహుల్ సోమవారం వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీ వేరే విధంగా వక్రీకరించి, దేవతలకు సంబంధించిన శక్తి అనే పదంతో ముడిపెట్టి తన ప్రసంగాల్లో వాడుకుంటున్నారని రాహుల్​ దుయ్యబట్టారు.

"నేను మతానికి సంబంధించిన శక్తి గురించి అనలేదు. అధర్మం, అవినీతి, అబద్ధాలతో కూడిన బీజేపీ లేదా రాజకీయ శక్తి గురించి మాత్రమే మాట్లాడాను. ఇందులో భాగంగానే 'శక్తికి వ్యతిరేకంగా పోరాటం' అనే వ్యాఖ్యలు చేశాను. అయితే నేను లోతైన సత్యం మాట్లాడాను. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీ నా మాటలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

'జూన్​ 4న తేలిపోతుంది'
హిందూ ధర్మంలో శక్తి అనే శబ్ధం ఉంటుందని, ఓ శక్తితో తాము పోరాడుతున్నామని రాహుల్‌ వ్యాఖ్యానించగా, ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలను సోమవారం తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా పూజించే శక్తిని నాశనం చేయడమే విపక్ష కూటమి ఇండియా మేనిఫెస్టో అని మోదీ విమర్శించారు. ఎన్నికల సమరంలో శక్తిని పూజించే వారిది విజయమో, శక్తిని నాశనం చేసేవారిది విజయమో జూన్‌ 4వ తేదీన తేలిపోతుందన్నారు.

మాకు-వారికి యుద్ధం : మోదీ
మరోవైపు శక్తి అని పదాన్ని ఉపయోగించి రాహుల్‌ చేసిన విమర్శలపై కొందరు బీజేపీ నేతలూ మండిపడ్డారు. అందరూ పూజించే శక్తిని నాశనం చేస్తామని ఇండియా కూటమి మేనిఫెస్టో చెబుతోందని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ రాహుల్​పై విమర్శలు గుప్పించారు. ఈ సార్వత్రిక ఎన్నికల సమరాన్ని శక్తిని పూజించే వారు, శక్తిని నాశనం చేసేవారి మధ్య యుద్ధంగా అభివర్ణించారు.

"భారతదేశంలో శక్తిని వినాశనం చేస్తామని ఎవరైనా మాట్లాడగలరా? శక్తిని వినాశనం చేయడం మనకు సమ్మతమేనా? మనం అందరం శక్తిని పూజిస్తామా లేదా? చంద్రయాన్‌ విజయాన్ని కూడా మనం ఎవరికి సమర్పించాం?. చంద్రయాన్‌ ఎక్కడ దిగిందో అక్కడ శివశక్తి పాయింట్‌ అని పేరు పెట్టి ఆ విజయాన్ని శివశక్తికి సమర్పించాము. తల్లులు, సోదరీమణులు మీరంతా శక్తి స్వరూపాలు. శక్తిని వినాశనం చేస్తాము అన్న వారికి మీరు అవకాశం ఇస్తారా? శక్తిని వినాశనం చేస్తాము అన్న వారు వినాశనం అవ్వాలా వద్దా? శక్తి స్వరూపులైన మహిళల రక్షణ జరగాలా వద్దా? ఇండియా కూటమి తమ మేనిఫెస్టో ప్రకటించింది. యుద్ధంలో శక్తిని వినాశనం చేయాలనుకుంటున్న ఇండియా కూటమి ఒకవైపు ఉంటే, మరోవైపు శక్తిని పూజించే వాళ్లం ఉన్నాం లేదా ఎన్​డీఏ కూటమి ఉంది. ఇక శక్తిని నాశనం చేయాలనుకునేవారు నెగ్గుతారో లేదా శక్తిని పూజించే వారు నెగ్గుతారో ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4వ తేదీన తేలుతుంది. శక్తి ఆరాధకులు కాంగ్రెస్​కు, భారత కూటమికి ఇదే రోజున తగిన గుణపాఠం చెబుతారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

రాహుల్​ కామెంట్స్​
'హిందూ ధర్మంలో శక్తి అనే పదం ఉంది. మేము శక్తితో యుద్ధం చేస్తున్నాం. ఒక శక్తితో పోరాడుతున్నాం. ఆ శక్తి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. రాజు ఆత్మ ఈవీఎంలో ఉందని ఎవరో అన్నారు. భారత్‌లోని ప్రతి సంస్థలో ఉంది. ఈడీలో, సీబీఐలో ఉంది, చివరకు ఆదాయపు పన్ను శాఖలోనూ ఉంది. శివసేనకు చెందిన వ్యక్తులు, ఎన్సీపీకి చెందిన వ్యక్తులు వారంతట వారే బీజేపీలోకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? కాదు. నేను ఏ శక్తి కోసం మాట్లాడుతున్నానో ఆ శక్తి వారి కాలర్‌ పట్టుకుని బీజేపీలోకి తీసుకెళ్లింది. వారంతా భయంతో వెళ్లారు' అని రాహుల్​ ముంబయిలో వ్యాఖ్యానించారు. ఇక ఇదే సభలో ఓ శక్తితో తాము పోరాడుతున్నామని, విపక్ష పార్టీల్లో ఉన్న నేతలను ఆ శక్తి బలవంతంగా బీజేపీలోకి తీసుకెళ్తోందని రాహుల్‌ విమర్శించారు.

'తొలి 100రోజులకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయండి!'- మోదీ 3.0పై ప్రధాని ధీమా

'EVM లేకుండా మోదీ గెలవలేరు- మేం ఓ శక్తితో పోరాడుతున్నాం'- ప్రధానిపై రాహుల్​ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.