ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకి- దానిపై సినిమా రావడం మంచి విషయం'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 3:31 PM IST

PM Modi On Article 370
PM Modi On Article 370

PM Modi On Article 370 : జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకిగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ ప్రాంతంలో వారసత్వ రాజకీయాలపై మాట్లాడిని మోదీ గత ప్రభుత్వాలకు చురకలు అంటించారు. ఈ క్రమంలో నటి యామీ గౌతమ్​ సినిమా గురించి ప్రస్తావించారు.

PM Modi On Article 370 : ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికరణ, జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 370 అధికరణ రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో, అన్నిప్రాంతాలు, అన్నిరంగాల్లో సమతుల అభివృద్ధిని చూస్తున్నాయని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో 32వేల కోట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎమ్​లు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన 1500మంది నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత వికసిత్‌ భారత్‌, వికసిత్‌ జమ్ము ద్వారా లబ్ధిపొందిన వారితో జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి ప్రభుత్వం ప్రజల ఇళ్ల వద్దకు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని, ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

"కేవలం ఒక్క కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలు సామాన్య ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నాయి. కుటుంబ పాలన నుంచి జమ్ముకశ్మీర్ విముక్తి ​పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్​ అంటే అభివృద్ధి చెందిన జమ్ముకశ్మీర్. అభివృద్ధి చెందుతున్న జమ్ముకశ్మీర్ గురించి ప్రపంచ మొత్తం ఆసక్తిగా ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని సామాన్య ప్రజలకు తొలిసారిగా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం గురించి హామీ లభించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

జమ్ముకశ్మీర్​కు ఇది గొప్ప రోజు అని ప్రధాని మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్​లో చేపట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. గత పదేళ్లలో భారత్​లో రికార్డు స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని, ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే 50 కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు.

యామీ గౌతమ్ సినిమా ప్రస్తావన
ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ నటించిన సినిమా గురించి ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'ఆర్టికల్ 370పై ఈ వారంలో ఒక సినిమా విడుదల కానుందని విన్నాను. అది మంచి విషయం. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ చిత్రం ఉపకరించనుంది.' అని మోదీ అన్నారు.ఇక సినిమా విషయానికొస్తే, యామీ గౌతమ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆర్టికల్‌ 370'. ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

'6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి'- జయలలిత ఆభరణాలు తమిళనాడు ప్రభుత్వానికే!

2024 లోక్​సభ ఎన్నికల తేదీలు ఫిక్స్! మార్చి 9 తర్వాత షెడ్యూల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.